వాహ్ త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైళ్లు.. మొత్తం 35 రైళ్లు, ప్రస్తుతం ఆ రూట్లల్లోనే!!
భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద నెట్వర్క్గా గుర్తింపు పొందింది. దేశంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వే శాఖ.. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సైతం రైల్వే శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తోంది.
దేశంలో చాలా మంది ఉద్యోగులు ప్రతిరోజూ రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. జీరో ఎమిషన్ వాహనాల ద్వారా దేశంలో కాలుష్యం లేని వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో డీజిల్తో నడిచే రైళ్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనే చెప్పవచ్చు. దీనిపై రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

సుదీర్ఘ సాధ్యాసాధ్యాల అధ్యయనం తర్వాత రైల్వే శాఖ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్టుపై కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొండల మధ్య మార్గాల్లో, దేశ వారసత్వ సంపదను కలుపుతూ ప్రయాణించే పర్యాటక రైళ్లలో డీజిల్కు బదులుగా హైడ్రోజన్ ఇంధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
రైల్వే స్టాండింగ్ కమిటీ (2022-23) తన నివేదికలో ఒక్కో రైలుకు రూ.80 కోట్ల అంచనా వ్యయంతో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని లోక్సభలో ప్రతిపాదించింది. ఆ రైళ్లలోని ఒక్కో లైన్ను అభివృద్ధి చేయడానికి రూ. 70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే మరి కొన్నేళ్లలో ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
ముఖ్యంగా, మాథెరాన్ హిల్, డార్జిలింగ్, కల్కా సిమ్లా, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై, పటపల్పాని కలకుండ్, నీలగిరి పర్వతం, మార్వార్ - గోరం ఘాట్ మార్గాల్లో 35 హైడ్రోజన్ రైళ్లు నడవనున్నాయి. ఒక్కో రైలులో ఆరు కోచ్లు ఉంటాయి. అలాగే, ఈ రైళ్లు పర్యావరణ అనుకూలమైనవితో పాటు ఇక్కడి కొండల మార్గాల్లో ప్రయాణించేందుకు అనువుగా ఉంటాయి.
వచ్చే ఏడాది జూన్లో దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్తో నడిచే రైలు కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. దీని ద్వారా చరిత్ర సృష్టించేందుకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి సోనిపట్ వరకు నడుస్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల రైలుగా మారుతుంది.
హైడ్రోజన్ రైళ్లు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ మిళితం ద్వారా శక్తిని ఉత్పత్తి చేసి ప్రయాణిస్తాయి. సంప్రదాయ డీజిల్తో నడిచే రైలు ఇంజిన్లతో పోలిస్తే, హైడ్రోజన్తో నడిచే ఇంజిన్లతో కూడిన రైళ్లు పర్యావరణానికి హాని చేయవు. అంతేే కాకుండా ప్రమాదకరమైన కాలుష్య కారకాలను విడుదల చేయవు. ఇది స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరో అద్భుతమైన ప్రాజెక్టును ప్రారంభించే యోచనలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబయి సహా ఏడు ప్రధాన మార్గాల్లో హైస్పీడ్ రైళ్లను (బుల్లెట్) నడపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. చెన్నై-బెంగళూరు-మైసూర్, ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-అహ్మదాబాద్, ఢిల్లీ-అమృతసర్, ముంబై-నాగ్పూర్, వారణాసి-హౌరా నగరాలకు కూడా భవిష్యత్తులో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
జపాన్ ప్రభుత్వం సహకారంతో భారత ప్రభుత్వం ముంబయి - అహ్మదాబాద్ నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టును చేపడుతుండగా, 2027 నాటికి ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలోని వివిధ నగరాల్లో హైస్పీడ్ రైలుగా నడుస్తున్న 'వందే భారత్ ఎక్స్ప్రెస్' 160 కి.మీ. ప్రయాణికుల సౌకర్యార్థం Wi-Fi, AC సిస్టమ్ మరియు సౌకర్యవంతమైన సీట్లు వంటి అనేక అధునాతన సౌకర్యాలను కల్పించింది.


Click it and Unblock the Notifications








