సామాన్యులకు గుడ్న్యూస్.. త్వరలో వందే భారత్ సౌకర్యాలతో నాన్ ఏసీ రైళ్లు..!!
భారత్లో దూర ప్రాంతాల ప్రయాణాలకు సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రైల్వేలపైనే ఆధారపడతారు. కానీ ఆయా రైళ్లలో ఉన్న టికెట్ల కొరత ఇతర సమస్యల కారణంగా చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
వందే భారత్ ఎక్స్ప్రెస్ల రాకతో రైల్వే ప్రయాణాన్ని కొంత వరకు మెరుగుపరిచిన భారతీయ రైల్వే.. ఇప్పుడు సామాన్యుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తోంది. అందుబాటు ధరలో నాన్ ఏసీ బోగీలతో కూడిన రైళ్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.

వందే భారత్ రైళ్ల రాకతో వాటిలో ప్రయాణించేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు. అయితే ఆ రైళ్ల టికెట్ ధర కారణంగా అనేక మంది మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఆయా రైళ్లలో ప్రయాణానికి వెనకడుగు వేశారు. అయితే వందేభారత్ ఫీచర్లతో నాన్ ఏసీ రైళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వందేభారత్ రైళ్ల తరహాలో అప్గ్రేడ్ చేసిన సెకండ్ క్లాస్ అన్ రిజర్వడ్, సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్లతో కొత్త రైళ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ మోడల్ రైళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. రైలు పేరును ఇంకా ఖరారుచేయలేదు. సామాన్యలకు మెరుగైన ప్రయాణాన్ని అందించడమే ఈ రైళ్ల ఉద్దేశంగా తెలుస్తోంది. వందేభారత్ రైళ్ల మాదిరిగానే మెరుగైన ఫీచర్లు కలిగి ఉండే అవకాశం ఉంది.

ఈ రైళ్ల రెండు చివర్లలో రెండు ఇంజిన్లు ఉంటాయి. పుష్- పుల్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇంజిన్లను చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో తయారు చేస్తున్నారు. రైలు కోచ్లను చైన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో (ICF) తయారు చేయనున్నారు. ప్రస్తుతం ఐసీఎఫ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కోచ్లను తయారు చేస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి రానున్న రైళ్ల అన్ని కోచ్లు నాన్ ఏసీ బోగీలను కలిగి ఉంటాయి. సామాన్య ప్రజల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉంటాయి. ఈ రైళ్లలో 12 సెకండ్ క్లాస్ 3 టైర్ స్లీపర్ కోచ్లు, 8 సెకండ్ క్లాస్ అన్ రిజర్వడ్ కోచ్లు, 2 సెకండ్ లగేజీ, దివ్యాంగులకు అవసరమైన కోచ్లు ఉంటాయి.

ఈ నాన్ ఏసీ రైళ్లు సుదూర ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలుస్తోంది. వలస కార్మికులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలను కలుపుతూ అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఈ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంతో పని చేస్తున్నట్లు సమాచారం.
2017లో రైల్వే శాఖ అంత్యోదయ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టింది. ఈ రైలు అన్ రిజర్వడ్ ప్రయాణికుల సౌకర్యం కోసం ఏర్పాటుచేశారు. అయితే త్వరలో రానున్న రైళ్లు అంత్యోదయ రైళ్లకు మించి సౌకర్యాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విజయవంతమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫార్ములాను అనుసరిస్తున్నారని సమాచారం.
* తొలిసారిగా ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి మార్గంలో 2019 ఫిబ్రవరి 15న వందే భారత్ రైలును ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు 17 రైళ్లను ప్రవేశపెట్టారు. అయితే ఈ రైళ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేస్తున్నారు.
చెన్నైలోని పెరంబలూరు ఐసీఎఫ్ ఫ్యాక్టరీలో వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ఈ రైళ్ల కోసం ప్రత్యక విభాగం ఉంది. ప్రస్తుతం వందే భారత్ రైలు ఇంజిన్ నుంచి కోచ్ వరకు పూర్తి చేసేందుకు 2 నెలల సమయం పడుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








