రైళ్లలో టాయిలెట్ దుర్వాసనకు చెక్.. అధునాతన టెక్నాలజీని తీసుకురానున్న రైల్వే శాఖ
దేశంలోని రవాణా రంగాల్లో రైల్వే రంగం చాలా కీలకమైనది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సాధారణ, ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు వందే భారత్ రైళ్లు కూడా అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. కాగా రైలు ప్రయాణికులను నిత్యం వేధించే ఓ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే శాఖ కృషి చేస్తోంది.
గత కొన్నేళ్లుగా రైళ్లు, రైల్వే స్టేషన్లను భారతీయ రైల్వే(Indian Railway) ఆధునికరిస్తోంది. అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. సాధారణ రైళ్లలో కూడా అన్ని సౌకర్యాలు ఉండేలా రైల్వే శాఖ కృషి చేస్తోంది. అయినప్పటికీ రైళ్లలో ఓ సమస్య నిత్యం ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తోంది. అదే దుర్వాసన.

రైళ్లలో ప్రతి కోచ్లో టాయిలెట్లు తప్పనిసరిగా ఉంటాయి. అంతేకాకుండా కంపార్ట్మెంట్లలో ఫ్లోర్పై మురికి, అశుభ్రత కూడా ఎక్కువైపోతుంది. పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నప్పటికీ ఈ సమస్య ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. దీనిపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించే దిశగా భారతీయ రైల్వే శాఖ కృషి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా వందేభారత్ రైళ్లలో దుర్వాసన రాకుండా బయో టాయిలెట్లు నిర్మించిన సంగతి తెలిసిందే. ఇంకా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోచ్లను రూపొందించారు. ఈ క్రమంలో సాధారణ, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ తరహా సౌకర్యాలు ఉండవు. ఇంకా టాయిలెట్లు కూడా దుర్గంధం వెదజల్లుతుంటాయి. ఈ దుర్వాసనను పసిగట్టి చర్యలు తీసుకునేందుకు టెక్నాలజీని తీసుకురావాలని భారతీయ రైల్వే యోచిస్తోంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రైల్వే బోర్డు IoT ఆధారిత సాంకేతికతను పరీక్షించే ఆలోచనను తీసుకువచ్చే యోచనలో ఉంది. డిటెక్టర్ల ద్వారా దుర్వాసనను పసిగట్టేలా సాంకేతికతను ఉపయోగించనున్నారు. ముంబయికి చెందిన స్టార్టప్ విలిసో టెక్నాలజీస్ను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి టెస్ట్ ప్రాజెక్ట్ కాగా.. దీనిని నిర్దిష్ట కోచ్లలో అమలు చేస్తారు.
ఈ IoT ఆధారిత సాంకేతికతలో టాయిలెట్లలో వచ్చే దుర్వాసనలను గుర్తించేందుకు సెన్సార్లను ఉపయోగించే స్మార్ట్ సిస్టమ్లు ఉంటాయి. ఈ సెన్సార్లు గాలిలోని అస్థిర సమ్మేళనాలు మరియు అణువులను గుర్తిస్తాయి. ఈ డేటాను సెంట్రల్ హబ్కు బదిలీ చేస్తుంది. అప్పుడు హబ్ సమాచారాన్ని విశ్లేషించి.. ఆటోమేటిక్గా స్పందిస్తుంది.

ఉదాహరణకు ఈ సిస్టమ్.. రైళ్లలోని దుర్వాసన గుర్తించి పారిశుధ్య సిబ్బందిని హెచ్చరిస్తుంది. తద్వారా కోచ్లను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని వారికి తెలియజేస్తుంది. ఈ రియల్ టైమ్ పర్యవేక్షణ ద్వారా అవసరమైన సమయాల్లో పారిశుద్ధ్య సిబ్బంది అక్కడికి చేరుకుని శుభ్రం చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా రైళ్లలో దుర్వాసన సమస్యను పరిష్కరించవచ్చు.
కాగా విలిసో టెక్నాలజీస్ వెబ్సైట్ ప్రకారం, స్టార్టప్లో మెరుగైన పారిశుద్ధ్యానికి సహాయపడే కొన్ని IoT- ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయట. ఉదాహరణకు, వాసన, మొత్తం అస్థిర సేంద్రియ సమ్మేళనం (TVOC), ఉష్ణోగ్రత మరియు తేమను పర్యవేక్షించేందుకు IoT-ఆధారిత ఎలక్ట్రానిక్ పరికరం గంధవేద్(Gandhvedh) దోహదపడుతుందని నివేదిక చెబుతోంది.
సంస్థ అధికారిక వెబ్సైట్లోని వివరాల ప్రకారం ఈ పరికరం పనితీరు ఇలా ఉంది. టాయిలెట్లో ఈ పరికరాన్ని అమరుస్తారు. అక్కడి వాసనను గుర్తించి ఆ డేటాను మొబైల్ యాప్ & వెబ్ యాప్కి పంపిస్తుంది. తద్వారా.. వీటిని మరుగుదొడ్డి పరిశుభ్రతకు బాధ్యత వహించే కేర్టేకర్ లేదా మానిటరింగ్ అథారిటీకి పంపిస్తుందని డేటా చెబుతుంది. అయితే భారతీయ రైల్వే ఉపయోగించే టెక్నాలజీ ఇదేనా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








