కారు కొనడం ఇప్పుడు చాక్లెట్ కొన్నంత ఈజీ..పెట్రోల్ బంకులు సరిపోవేమో అనేంతలా కొనేస్తున్నారు
భారతదేశం ఆర్థికంగా దూసుకుపోతుందనడానికి ప్రస్తుతం ఉన్న ఆటోమొబైల్ రంగమే నిదర్శనం. ఒకప్పుడు కారు కొనాలంటే దశాబ్దాల కలగా ఉండేది. కానీ ప్రస్తుతం భారతీయులు వాహనాల కొనుగోలులో స్పీడ్ పెంచారు. చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వాహన మార్కెట్ గా భారత్ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా జనవరి నెలలో నమోదైన గణాంకాలు చూస్తుంటే ఆటో రంగం ఏ రేంజ్లో పరుగులు తీస్తుందో అర్థం అవుతుంది.
ప్రతి రోజూ దేశవ్యాప్తంగా యావరేజ్గా లక్షకు పైగా వాహనాలు అమ్ముడవుతుండడం విశేషం. ఫెడరేషన్ ఆప్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన లేటెస్ట్ లెక్కల ప్రకారం.. ఆటోమొబైల్ రంగం మునుపెన్నడూ లేని విధంగా 18 శాతం మేరకు వృద్ధిని సాధించింది.

జనవరిలో రికార్డు సేల్స్
ఫెడరేషన్ ఆప్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ (FADA) రిపోర్టు ప్రకారం.. జనవరి 2026 నెల ఆటోమొబైల్ డీలర్లకు కాసుల పంట పండించింది. గత ఏడాది జనవరితో పోలిస్తే వాహనాల రిటైల్ అమ్మకాలు 17.61 శాతం పెరిగాయి. జనవరి 2025లో 23.14 లక్షల వాహనాలు అమ్ముడవగా.. ఈ ఏడాది అది ఏకంగా 27,22,558 యూనిట్లకు చేరుకుంది. అంటే దేశవ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 87 వేల నుంచి లక్ష వాహనాలు షోరూమ్ల నుంచి బయటకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 నిబంధనలు, ఈజీ లోన్ సదుపాయాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ ఎందులో ఎంత వృద్ధి?
వాహనాల విభాగాల వారీగా చూస్తే, టూ వీలర్స్ అమ్మకాలు ఏకంగా 21 శాతం పెరిగాయి. జనవరి 2026లో మొత్తం 18,52,870 బైక్లు, స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇక కార్ల విషయానికి వస్తే.. గత నెలలో 5,13,475 ఫోర్ వీలర్లు విక్రయించబడ్డాయి. ఇది గత ఏడాది కంటే 7 శాతం ఎక్కువ. ప్రజలు ఇప్పుడు సాధారణ కార్ల కంటే కూడా ఎస్యూవీ (SUV), కాంపాక్ట్ ఎస్యూవీల పట్ల ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కొత్త టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది.

పట్టణాలను మించిన పల్లెలు
ఫెడరేషన్ ఆప్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ (FADA) అధ్యక్షుడు సి.ఎస్.విఘ్నేశ్వర్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా కార్ల అమ్మకాలు సిటీల్లో ఎక్కువగా ఉంటాయని భావిస్తాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఫోర్ వీలర్ అమ్మకాలు 14.43 శాతం వృద్ధి చెందగా, పట్టణాల్లో ఇది కేవలం 2.75 శాతంగానే ఉంది. దీనికి ప్రధాన కారణం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం, పంటలు బాగా పండడం, పెళ్లిళ్ల సీజన్ కావడం. పల్లెల్లో కూడా ఇప్పుడు విలాసవంతమైన కార్లు, ఎస్యూవీలకు డిమాండ్ పెరగడం విశేషం.
ట్రాక్టర్లు, కమర్షియల్ వెహికల్స్ వెలుగులు
కేవలం పర్సనల్ వాహనాలే కాకుండా, వాణిజ్య అవసరాలకు వాడే వెహికల్స్ సేల్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. త్రీ-వీలర్ సేల్స్ 19 శాతం, కమర్షియల్ వెహికల్ సేల్స్ 15 శాతం పెరిగాయి. వ్యవసాయ రంగానికి వెన్నుముక అయిన ట్రాక్టర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 23 శాతం పెరిగి 1,14,759 యూనిట్లకు చేరాయి. ఇది దేశంలో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయని సూచిస్తోంది.
మున్ముందు ఇంకా పెరిగే అవకాశం
రాబోయే ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా అమ్మకాలు ఇదే రీతిన కొనసాగుతాయని డీలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమారు 80 శాతం మంది డీలర్లు పాజిటివ్ బిజినెస్ వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటం, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో కొనుగోలుదారులు షోరూమ్ల వైపు క్యూ కడుతున్నారు. భారత ఆటో రంగం ఇదే వేగంతో ముందుకు వెళితే, త్వరలోనే ప్రపంచంలోనే నంబర్ వన్ మార్కెట్గా అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.


Click it and Unblock the Notifications








