భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు ట్రైల్ రన్ ప్రారంభం
విదేశాల్లో మాదిరిగానే మన భారతదేశంలో కూడా అత్యధిక వేగంతో పరుగులు పెట్టే రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు మనం ఇదివరకే చదువుకున్నాం. కాగా.. ఇప్పుడు భారతీయ రైల్వే సంస్థ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఓ సెమీ హై-స్పీడ్ రైలుకు ట్రైల్ రన్ నిర్వహిస్తోంది. ఈ ట్రైల్ రన్ విజయవంతం కాగానే, ఈ ఫాస్టెస్ట్ ట్రైన్ సేవలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.
ఢిల్లీ మరియు ఆగ్రా మధ్యలో ఇండియన్ రైల్వేస్ ఓ సెమీ హై-స్పీడ్ రైలును ట్రైల్ రన్ కోసం గురువారం నాడు ప్రారంభించింది. ఢిల్లీ-ఆగ్రా రూట్లో ఇది గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. ఈ సెమీ హై-స్పీడ్ ట్రైన్ వలన ప్రయాణ సమయం దాదాపు 30 నిమిషాలు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

సాధారణంగా ఈ రూట్లో రైలు ప్రయాణం 120 నిమిషాలు పడుతుంది. అయితే, సెమీ హై-స్పీడ్ రైలులో కేవలం 90 నిమిషాల్లోనే ఢిల్లీ నుంచి ఆగ్రాకి లేదా ఆగ్రా నుంచి ఢిల్లీకి చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఈ సెమీ హై-స్పీడ్ రైలులో 5400 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ (ఇంజన్) ఉంటుంది. ఈ రైలు కోసం ట్రాక్ను సిద్ధం చేసేందుకు గాను సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. వీలైనంత త్వరలోనే ఈ సెమీ హై-స్పీడ్ రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








