హెలికాప్టర్ వద్దు.. విమానం వద్దు..బుక్ చేసుకుంటే ఇంటిపైకే ఎయిర్ టాక్సీ..ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
హైదరాబాద్ వంటి మహానగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. ఆఫీస్కు వెళ్లాలన్నా, ఎయిర్పోర్ట్కు చేరుకోవాలన్నా గంటల తరబడి రోడ్ల మీద వేచి ఉండాల్సిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సరళా ఏవియేషన్ సంస్థ భారతీయ గగనతలంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. గాలిలో ఎగిరే టాక్సీలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ సరళా ఏవియేషన్ (Sarla Aviation), ఈ ఏడాది ప్రారంభంలో శూన్య(Shunya) పేరుతో తన ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం బెంగళూరులో దీనికి సంబంధించిన SYL-X1 అనే డెమో విమానం గ్రౌండ్ టెస్టింగ్ను ప్రారంభించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ శక్తితో నడుస్తుంది కాబట్టి, పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు.

పైగా హెలికాప్టర్ లాగా విపరీతమైన శబ్దాన్ని కూడా చేయదు. ఈ విమానానికి సంబంధించిన రెక్కలు 7.5 మీటర్ల వెడల్పు ఉండి, అత్యాధునిక సెన్సార్లతో పనిచేస్తాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. త్వరలోనే 15 మీటర్ల వెడల్పు ఉండే పూర్తి స్థాయి 6 సీట్ల విమానాన్ని సిద్ధం చేయనున్నారు.
సాధారణ కార్లు ట్రాఫిక్లో గంటకు 10-20 కి.మీ వేగంతో కూడా వెళ్లలేని చోట, ఈ ఎయిర్ టాక్సీ గంటకు 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోగలదు. ఇది పైలట్తో కలిపి మొత్తం 7 మందిని (6 ప్రయాణికులు) మోయగలదు. గరిష్టంగా 680 కిలోల బరువును మోసే సామర్థ్యం దీనికి ఉంది.

ఈ టాక్సీ ద్వారా 20 నుంచి 30 కిలోమీటర్ల తక్కువ దూరాన్ని కేవలం 10 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి ఎల్ బీ నగర్ కు వెళ్లడానికి ప్రస్తుతం రోడ్డు మార్గంలో సుమారు 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుండగా ఈ ఎయిర్ టాక్సీలో అది కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది.
ఎయిర్ టాక్సీ అనగానే వేలల్లో ఖర్చు అవుతుందని అందరూ భయపడతారు. కానీ సరళా ఏవియేషన్ ఒక వినూత్నమైన ఆలోచనతో ముందుకు వస్తోంది. ప్రారంభంలో దీని ధరలు మన ఊబర్ లేదా ఓలా ప్రీమియం క్యాబ్ సర్వీసులతో సమానంగా ఉండేలా చూడాలని సంస్థ భావిస్తోంది. అంచనాల ప్రకారం.. ఒక ప్రయాణానికి సుమారు రూ.1,700 నుంచి రూ.2,400 వరకు చార్జ్ చేసే అవకాశం ఉంది.

భవిష్యత్తులో ఈ సేవలు మరింత విస్తరిస్తే, ఆటో రిక్షా అంత తక్కువ ధరలో కూడా ఎయిర్ టాక్సీ ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకులు చెబుతున్నారు. అంతేకాకుండా, అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం గ్రౌండ్ టెస్టింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్, 2027 నాటికి ఫ్లైట్ టెస్టింగ్ను (గాలిలో ప్రయోగాత్మక ఎగిరే పరీక్షలు) పూర్తి చేసుకోనుంది. అన్ని రకాల అనుమతులు లభిస్తే, 2028 నాటికి వాణిజ్య పరంగా ఈ సేవలు బెంగళూరులో మొదలవుతాయి.
ఆ తర్వాత రెండు నెలల్లోనే ముంబై, ఢిల్లీ, పుణె నగరాలకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో సుమారు రూ.1,300 కోట్లతో భారీ తయారీ కేంద్రాన్ని (Sky Factory) కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మన దేశీయ ప్రతిభకు నిదర్శనంగా నిలవడమే కాకుండా, పట్టణ రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించనుంది.


Click it and Unblock the Notifications








