నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది..టికెట్ ధర కేవలం రూ.5 మాత్రమే
భారతీయ రైల్వే చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని, కాలుష్య రహితమైన హైడ్రోజన్ రైలు(Hydrogen Train)పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. చైనా, జర్మనీ వంటి దేశాల కంటే అడ్వాన్సుడ్ టెక్నాలజీతో, మన స్వదేశీ ఇంజనీరింగ్ నైపుణ్యంతో రూపొందిన ఈ రైలు త్వరలోనే ట్రయల్ రన్ ప్రారంభించనుంది. భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గ్రీన్ మొబిలిటీ మిషన్ వివరాలు తెలుసుకుందాం.
భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ఈ రైలును పైలట్ ప్రాజెక్ట్గా నడపబోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైలుగా రికార్డు సృష్టించబోతోంది. ఈ రైలులో మొత్తం 10 కోచ్లు ఉంటాయి. వీటిలో 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్లు ఉన్నాయి.

చెన్నైలోని ఐసీఎఫ్ (ICF)లో మన ఇంజనీర్లు దీనిని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ప్రస్తుతం జర్మనీ, చైనా దేశాల్లో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నప్పటికీ, భారత రైలు టెక్నాలజీ పరంగా మరింత బలంగా ఉంది. ఇది 5 అడుగుల 6 అంగుళాల వెడల్పు ఉన్న బ్రాడ్ గేజ్ పట్టాలపై నడిచే అత్యంత పొడవైన రైలు.
అంతేకాదు రెండు పవర్ కార్ల ద్వారా ఇది 2,400 kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంతటి పవర్ఫుల్ హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు.

ఈ రైలు నడవడానికి కావాల్సిన హైడ్రోజన్ ఇంధనం కోసం జింద్లో ఒక భారీ హైడ్రోజన్ ప్లాంట్ను నిర్మించారు. నీటిని విద్యుత్ విశ్లేషణ (Electrolysis) చేయడం ద్వారా ఇక్కడ హైడ్రోజన్ను తయారు చేస్తారు. ఈ ప్లాంట్ 3,000 కిలోల హైడ్రోజన్ను నిల్వ చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఒక్కసారి 360 కిలోల హైడ్రోజన్ నింపితే, ఈ రైలు దాదాపు 180 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ లేదా డీజిల్ రైళ్ల కంటే చాలా రెట్లు సమర్థవంతమైనది.
ఈ హైడ్రోజన్ రైలు చూడటానికి మెట్రో రైలులా ఆధునికంగా ఉంటుంది. ప్రతి కోచ్కు రెండు వైపులా రెండేసి తలుపులు ఉంటాయి. రైలు కదిలే ముందు ఆటోమేటిక్గా తలుపులు లాక్ అవుతాయి. సౌండ్ అస్సలు రాకుండా చాలా నిశ్శబ్దంగా ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఏసీ, ఫ్యాన్లు, లైట్లు వంటి అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. ఇక సామాన్యులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. దీని టికెట్ ధరలు కేవలం రూ.5 నుంచి రూ.25 మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం.

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జనవరి 26, 2026న (రిపబ్లిక్ డే) ఈ రైలును పట్టాలెక్కించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే దేశవ్యాప్తంగా మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత రైల్వే యోచిస్తోంది. దీనివల్ల డీజిల్ వినియోగం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేసినట్లు అవుతుంది.


Click it and Unblock the Notifications








