ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు.. కోయంబత్తూర్ టూ షిరిడి.. దీని స్పెషాలిటీ ఏంటంటే..?
భారతదేశపు ప్రజా రవాణా వ్యవస్థలో మనం ఇప్పటి వరకూ ప్రైవేట్ కార్లు, ప్రైవేట్ బస్సులు, ప్రైవేట్ పడవలు మరియు చివరకు ప్రైవేట్ విమానాలను కూడా చూశాం. కానీ, ఇప్పటి వరకూ భారత రైల్వే వ్యవస్థలో మనం ప్రైవేట్ రైళ్లను ఎప్పుడూ చూడలేదు. అయితే, ఇప్పుడు ఆ కోరిక కూడా తీరిపోయింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేటు రైలు పట్టాలెక్కింది. దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత్ గౌరవ్ పథకం (Bharath Gaurav Scheme) కింద భారతదేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రైలు కోయంబత్తూర్ నుండి పవిత్ర నగరమైన షిర్డీకి బయలుదేరింది.
ఈ రైలును కోయంబత్తూర్కు చెందిన ప్రైవేట్ రైల్ సర్వీస్ ఆపరేటర్ సౌత్ స్టార్ రైల్ (South Star Rail) నిర్వహిస్తోంది. ఇది కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుండి మంగళవారం (జూన్ 14వ తేదీ) సాయంత్రం 6 గంటలకు బయలుదేరి గురువారం (జూన్ 16వ తేదీ) ఉదయం 7:25 గంటలకు షిరిడి పట్టణంలోని సాయినగర్ షిర్డీ స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ప్రైవేట్ రైలు సర్వీస్ తిరుప్పూర్, ఈరోడ్, సేలం, యలహంక (బెంగళూరు), ధర్మవరం, మంత్రాలయం రోడ్ మరియు వాడిలో ఆగుతుంది.

మంత్రాలయం ఆలయంలో స్వామివారి దర్శనానికి వినియోగదారులను అనుమతించడానికి ఈ ప్రైవేట్ రైలు సుమారు 5 గంటల పాటు మంత్రాలయం రోడ్ స్టేషన్ వద్ద ఆగుతుంది. ఆ తర్వాత ఇదే రైలు శుక్రవారం (జూన్ 17వ తేదీ) ఉదయం 7:25 గంటలకు షిర్డీ నుండి తిరుగు ప్రయాణాన్ని ప్రారంభించి శనివారం (జూన్ 18వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు కోయంబత్తూర్ నార్త్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో వాడి, ధర్మవరం, యలహంక, సేలం, ఈరోడ్ మరియు తిరుప్పూర్ స్టేషన్లలో ఈ ప్రైవేట్ రైలు ఆగుతుంది.

భారత్ గౌరవ్ స్కీమ్ లో భాగంగా వచ్చిన ఈ మొట్టమొదటి ప్రైవేట్ రైలు ప్రత్యేకమైన డార్క్ బ్లూ మరియు బ్రైట్ యల్లో కలర్లో (ముదురు నీలం మరియు ముదురు పసుపు రంగులో) పెయింట్ చేయబడి ఉంటుంది. లోపలి వైపున సీట్లు మాత్రం బ్లూ కలర్ కలర్ లోనే ఉంటాయి. కాకపోతే, సైడ్ వాల్స్ అంతా కూడా రంగురంగుల వాల్ పేపర్లను కలిగి ఉంటాయి. ట్రైన్ వెలుపలి భాగంలో అక్కడక్కడా భారత్ గౌరవ్ లోగోలు అంటించబడి ఉంటాయి.

భారతీయ రైల్వే సంస్థ ఉపయోగించే సాధారణ WAP4 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ట్రైన్ ను ఈ ప్రైవేట్ రైల్వే సంస్థ సౌత్ స్టార్ రైల్ ప్రత్యేకంగా పెయింట్ చేసి ఉపయోగిస్తోంది. సౌత్ స్టార్ రైల్ నడుపుతున్న ఈ ప్రైవేట్ భరత్ గౌరవ్ రైలులో ఒక ప్యాంట్రీ కార్, రెండు లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్లు, ఐదు స్లీపర్ క్లాస్ కోచ్లు, ఎనిమిది 3-టైర్ ఏసీ కోచ్లు, మూడు 2-టైర్ ఏసీ కోచ్లు మరియు ఒక సోలిటరీ 1-టైర్ ఏసి కోచ్ తో సహా మొత్తం 20 కోచ్లు ఉన్నాయి. ఈ ప్రైవేట్ రైలు తన మొదటి ట్రిప్ లో భాగంగా కోయంబత్తూర్ నార్త్ - షిర్డీ మరియు తిరిగి ప్రయాణంతో కలిపి మొత్తం 1,100 మంది ప్రయాణికులతో బయలుదేరింది.

కోయంబత్తూరు మరియు షిర్డీ మధ్య నడుస్తున్న ప్రైవేట్ భారత్ గౌరవ్ రైలు దాని ప్రయాణీకులకు అధిక-నాణ్యతతో కూడిన శాఖాహార భోజనాన్ని అందిస్తుంది మరియు స్నాక్ ట్రాలీని కూడా కలిగి ఉంటుంది. ఈ షిరిడీ యాత్రలో భాగంగా ప్రయాణీకులు అనేక భక్తి పత్రికలు (డివోషనల్ మ్యాగజైన్స్) మరియు బెడ్టైమ్ కిట్ లను కూడా పొందుతారు. ఈ రైలు కోచ్లు అన్నీ కూడా స్పీకర్ల శ్రేణులతో అమర్చబడి ఉంటాయి మరియు ప్రైవేట్ సేవలో భాగంగా ఆన్-రైల్ ఆర్జే కూడా ఉంటుంది. ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా ఉంచేందుకు ఈ రైలులో భక్తిగీతాలు, ఆధ్యాత్మిక కథలు మరియు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు వినిపించబడుతాయి.

ఒకవేళ రైలు మార్గంలో ఏదైనా వైద్యపరమైన అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తే, ఈ రైలులో ప్రయాణీకుల వైద్య సహాయార్థం ఓ ఆన్-బోర్డ్ డాక్టర్ను కూడా ఉంటారు. ఈ ప్రైవేట్ రైలులో ప్రయాణించే వృద్ధులు లేదా వికలాంగులైన ప్రయాణికులకు సహాయం చేయడానికి ప్రత్యేక సహాయం కూడా అందించబడుతుంది.

మరి ఈ టెంపుల్ టౌన్ స్పెషల్ని నడపడానికి ప్రైవేట్ ఆపరేటర్ను అనుమతించడం ద్వారా భారతీయ రైల్వేకి ఎలాంటి ఆదాయం లభిస్తుందనేదే కదా మీ సందేహం. సౌత్ స్టార్ రైల్ నిర్వహిస్తున్న కోయంబత్తూరు-షిర్డీ మరియు షిర్డీ-కోయంబత్తూర్ భారత్ గౌరవ్ ప్రైవేట్ రైలు కోసం సదరు కంపెనీ భారతీయ రైల్వేలకు ప్రతి సంవత్సరం మొత్తం రూ. 3.34 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో వార్షిక వినియోగ హక్కు రుసుము రూ. 27.79 లక్షలు (GST మినహాయించి) మరియు రూ. 3.07 కోట్లు ఫిక్స్డ్ హాలేజ్ ఛార్జీలు కలిసి ఉంటాయి.

కోయంబత్తూరు నుండి సాయినగర్, షిర్డీ మరియు తిరిగి వెళ్లడానికి 5 రోజుల పర్యటన కోసం భారతీయ రైల్వే రూ. 38.22 లక్షలు (GST మినహా) అదనపు వేరియబుల్ హాలేజ్ ఛార్జీలను కూడా వసూలు చేస్తుంది. ట్రిప్లో రైలు బయలుదేరిన ప్రతిసారీ ఇలాంటి ఛార్జీలు విధించబడతాయి.

మరి చార్జీ ఎంత ఉంటుంది?
ఈ ప్రైవేటు రైలులో కోయంబత్తూర్ నుండి షిరిడి మరియు తిరిగి షిరిడీ నుండి కోయబంత్తూర్ చేరుకోవడానికి తిరుగు ప్రయాణ టికెట్తో కలిపి ఒక్కొక్కరికి ధర రూ.2,500 గా ఉంటుంది. ఇది కేవలం ప్రయాణ చార్జీ మాత్రమే. అలాకాకుండా, కంపెనీ ప్రతిఒక్కరికీ రూ.4,999 రుసుముతో తిరుగు ప్రయాణ టికెట్ తో కలిపి ఓ ప్యాకేజీని కూడా అందిస్తోంది. ఈ ప్యాకేజీలో షిరిడి విఐపి దర్శనం, తిరుగు ప్రయాణంతో కూడిన టికెట్, త్రీ షేరింగ్ ఏసి రూమ్ (ముగ్గురితో కలిపి పంచుకునేలా ఏసి గది), టూర్ గైడ్ మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్లు కలిసి ఉంటాయి.

టిక్కెట్లను ఎక్కడ కొనుగోలు చేయాలి?
ప్రస్తుతం, సౌత్ స్టార్ రైల్ నిర్వహిస్తున్న ఈ ప్రైవేట్ రైలు టిక్కెట్లను కొనుగోలు చేయాలంటే, ప్రయాణీకులు కోయంబత్తూర్, సేలం, ఈరోడ్ మరియు తిర్పూర్ ప్రాంతాలలో ఉన్న సాయిబాబా దేవాలయాల వద్ద ఈ రైలు ప్రయాణం లేదా ప్యాకేజీకి సంబందించిన టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications








