తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు..
దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో మేధా సర్వో డ్రైవ్స్, స్విస్ రైల్వే వెహికిల్స్ తయారీదారు స్టాడ్లర్ రైల్ సంయుక్తంగా స్థాపించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. స్వదేశీ కంపెనీ రైల్ కోచ్లను నిర్మించడం తెలంగాణకు గర్వకారణమని ఆయన అన్నారు. ముంబయి నుంచి మోనో రైల్ కంపెనీ ఆర్డర్ను పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీ కోచ్లు, రైలు సెట్లు, లోకోమోటివ్లు, మెట్రో రైళ్లు మరియు మోనోరైల్లతో సహా అన్ని రకాల రైల్వే రోలింగ్ స్టాక్లను అభివృద్ధి చేస్తుంది. తొలిదశలో దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేధా మేనేజింగ్ డైరెక్టర్ కశ్యప్ రెడ్డి తెలిపారు. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదించిన పెట్టుబడి రూ. 805 కోట్లు.
2017లో, మేధా గ్రూప్.. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC)తో ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీని స్థాపించడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2020 ఆగస్టు 13 న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ. 1,000 కోట్ల పెట్టుబడితో, ప్రైవేట్ రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏడాదికి 500 కోచ్లు, 50 లోకోమోటివ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని గతంలో ప్రకటించారు.

ప్రాజెక్ట్ రెండు, మూడు దశల్లో.. కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి సైతం మేము రైల్వే ఉత్పత్తులను తయారు చేయాలని యోచిస్తున్నామని మేధా ఎండీ అన్నారు. అంతర్గత ఆర్ అండ్ డీ సౌకర్యాలను కలిగి ఉన్న ఏకైక భారతీయ కంపెనీగా మేధా ఉందని పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం భారతీయ రైల్వేల కోసం బోగీలను తయారు చేస్తోందని చెప్పారు. త్వరలో పూర్తిగా ముంబై మోనోరైల్ రైలు సెట్ల తయారీని ప్రారంభించనుందని వెల్లడించారు.
ఇప్పటికే ఈ ప్రాజెక్టు ద్వారా 558 మందికి ఉపాధి లభించిందని, అదనంగా మరో 500 మంది పరోక్షంగా లబ్ధి పొందారని కశ్యప్ తెలిపారు. భవిష్యత్తులో దాదాపు 1,000 మందికి అదనంగా ఉపాధి లభించనుంది. ఈ ఏడాది చివరి నాటికి మోనోరైల్ ప్రాజెక్ట్ కోసం మొత్తం కోచ్ల తయారీ ఇక్కడే జరుగుతుందని ఆయన వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా రైల్వే వినియోగదారులకు సేవలందించేందుకు స్పెయిన్, ఇటలీ, అమెరికా, బ్రెజిల్ మరియు పోలాండ్తో సహా వివిధ అనుబంధ కంపెనీలతో మేధా సంబంధాలు కలిగి ఉంది. తెలంగాణలో కొత్త రైల్ కోచ్ తయారీ కర్మాగారం కోసం స్విస్ రైల్వే రోలింగ్ స్టాక్ తయారీదారు స్టాడ్లర్ రైల్తో మేధా సర్వో డ్రైవ్స్ జాయింట్ వెంచర్ (జెవి) ఒప్పందంపై సంతకం చేసింది.
1984లో స్థాపించబడిన మేధా 1990 నుంచి రైల్వేలకు వివిధ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. ఇది భారతీయ రైల్వేలకు అతిపెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరాదారుగా ఉంది. ఇది రైల్వేలకు అతిపెద్ద ట్రాక్షన్ మోటార్ తయారీదారుగా ఉంది. అంతే కాకుండా అధునాతన సిగ్నలింగ్ మరియు భద్రతా వ్యవస్థలను సరఫరా చేసే పెద్ద సంస్థగా మేధా నిలిచింది.



Click it and Unblock the Notifications








