విమానంలో 8 మందే ప్రయాణికులు.. మధ్యలోనే దించేసిన ఇండిగో.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.!!
ఇండిగో విమానం నుంచి ప్రయాణికులను మధ్యలోనే దించేసిన సంఘటన బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. గత ఆదివారం(నవంబర్ 19) న ఈ సంఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి లోనయ్యారు. దీనిపై ఇండిగో సైతం వివరణ ఇచ్చింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
గత ఆదివారం రాత్రి 9.30 కి పంజాబ్లోని అమృత్సర్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానం 6E 478 బెంగళూరు మీదుగా చెన్నైకి బయలుదేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయి బెంగళూరులో దిగిన తర్వాత అక్కడ అందులోని ప్రయాణికులు దిగగా.. చివరికి 8 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ ఎనిమిది మందితో చెన్నైకి ఫ్లైట్ నడపడం ఇష్టం లేని సిబ్బంది.. వారిని వేరే విమానంలో ఎక్కిస్తామని చెప్పారు.

దీంతో ఆ 8 మంది ప్రయాణికులు విమానం దిగారు. కానీ ఆ తర్వాత మళ్లీ చెన్నైకి కనెక్టింగ్ ఫ్లైట్ కానీ, ఇతర విమానం కానీ లేకపోవడంతో ప్రయాణికులు ఆ రాత్రి బెంగళూరులోనే గడపాల్సి వచ్చింది. తిరిగి సోమవారం తెల్లవారుజామున వారు చెన్నైకి వెళ్లారు. కాగా తమ ప్రయాణానికి అడ్డంకి ఏర్పడిందని.. సిబ్బంది తమకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆరోపించారు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి చెన్నైకి వెళ్లలేని ఆ 8 మంది ప్రయాణికుల్లో కొందరు హోటల్ రూమ్స్ బుక్ చేసుకోగా.. మరికొందరు ఎయిర్పోర్ట్ లాంజ్లోనే సేద తీరారు. ఈ క్రమంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చి విమానం మధ్యలో నుంచే దించారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా దీనిపై ఇండిగో సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. అనంతరం సంఘటనకు సంబంధించి వివరణ ఇచ్చింది.

ఆదివారం రోజున అమృత్సర్ నుంచి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ బెంగళూరులో ఆలస్యంగా ల్యాండ్ అయిందని ఇండిగో సిబ్బంది తెలిపారు. దీంతో ఈ ఎనిమిది మందిని వేరే విమానం ఎక్కించాలన్నా ఆలస్యం కావడంతో మరో ఫ్లైట్ అందుబాటులో లేదని పేర్కొన్నారు. కాగా ఇండిగో గ్రౌండ్ స్టాఫ్.. ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేసిందని చెప్పారు.
రాత్రి పూట వారికి వసతితో పాటు మరో ఫ్లైట్ ఎక్కించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఇండిగో సంస్థ వెల్లడించింది. కొంతమంది ప్రయాణికులు ఎయిర్ పోర్టు లాంజ్లోనే ఉండటానికి ఇష్టపడినట్లు చెప్పారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటన విడుదల చేసింది.
ఇలాంటి ప్రాక్టికల్ సమస్యలు లేదా సమయాభావం వల్ల కూడా ప్రయాణికులు విమానం ఎక్కలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రయాణికులకు తగిన పరిహారం, ఉపశమనం అందించడం ఎయిర్ లైన్స్ బాధ్యత. వారికి కనీస వసతి, ఆహారం అందించాల్సి ఉంటుంది. అయితే విమానయాన సంస్థలు ఎల్లప్పుడూ తమ నిబంధనలకు, టైమింగ్స్కి కట్టుబడి ఉంటే ఇలాంటి సమస్య ఉండదు. కాగా అమృత్సర్ నుంచి బెంగళూరుకు విమానం ఎందుకు ఆలస్యంగా ల్యాండ్ అయిందనే దానిపై కంపెనీ వివరణ ఇవ్వలేదు.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








