ఐఎన్ఎస్ రాజ్పుత్ ఇక సెలవు.. నీ సేవలకు ఇవే మా జోహార్లు..
భారతదేశ నావికాదళంలో 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఐఎన్ఎస్ రాజపుత్కు నేవీ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. భారతదేశపు జల సరిహద్దులలో నిర్విరామంగా 41 ఏళ్ల పాటు సేవలందించిన ఈ మొట్టమొదటి డిస్ట్రాయర్ యుద్ధనౌకను డీకమిషన్ చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా, దేశానికి ఐఎన్ఎస్ రాజ్పుత్ అందించిన సేవలను భారత తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ (ఏబీ సింగ్) కొనియాడారు. విశాఖ నేవల్ డాక్యార్డులో గత శుక్రవారం సాయంత్రం ఐఎన్ఎస్ రాజ్పుత్ యుద్ధనౌక డీ కమిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

41 ఏళ్ల సర్వీస్
ఐఎన్ఎస్ రాజ్పుత్ డిస్ట్రాయర్ ఓడ భారతదేశ సరిహద్దుల్లో 41 ఏళ్లుగా నిర్విరామంగా సేవలను అందిస్తూ వచ్చింది. ఇది 1980లో మన సైన్యంలోకి వచ్చింది. ఈ 41 ఏళ్ల కాలంలో ఐఎన్ఎస్ రాజ్పుత్ అనేక ఆపరేషన్లలో విజయవంతంగా పాల్గొని, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చింది.

దేశపు మొట్టమొదటి డిస్ట్రాయర్ (విధ్వంసక) ఓడ
ఐఎన్ఎస్ రాజ్పుత్ భారతదేశపు మొట్టమొదటి డిస్ట్రాయర్ (విధ్వంసక) ఓడ. దీనిని మాజీ సోవియెట్ యూనియన్ నిర్మించినట్లుగా చెబుతారు. ఈ నౌకలో సుదూర శ్రేణి బ్రహ్మోస్ క్షిపణులు, జలాంతర్గాములను నాశనం చేసే క్షిపణులు, విమాన వాహకాలు, బాంబులు వంటి మరెన్నో విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయి.

'రాజ్ కరేగా రాజ్పుత్' (రాజ్పుత్ రాజ్యమేలుతుంది)
రాజ్పుత్ చేసిన కొన్ని ఆపరేషన్లలో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపికెఎఫ్)కు సహాయపడటం కోసం చేసిన ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితిని పరిష్కరించడానికి ఆపరేషన్ కాక్టస్ మరియు లక్షద్వీప్ నుండి ఆపరేషన్ క్రోస్నెస్ట్లు చెప్పుకోదగినవి. 'రాజ్ కరేగా రాజ్పుత్' అనే నినాదంతో ఇంతకాలం భారతదేశంలో రాజ్యమేలిన రాజ్పుత్ ఇకపై విశ్రాంతి తీసుకోనుంది.

ఆపద సమయాల్లో అండగా..
ఐఎన్ఎస్ రాజ్పుత్ కేవలం యుద్ధ సమయాల్లోనే కాకుండా, విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అండగా నిలిచింది. గత 1999లో ఒడిశా తుఫాన్ సమయంలో, 2004లో వచ్చిన సునామీ సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో, జకార్తా భూకంపం తర్వాత హెచ్ఏడిఆర్ మిషన్లో కూడా ఎంతో కీలకంగా వ్యవహరించింది.

అసలు పేరు నాదేజ్నీ
ఐఎన్ఎస్ రాజ్పుత్ను 1961లో నికోలెవ్ (ప్రస్తుత ఉక్రెయిన్)లోని కమ్యునార్డ్స్ షిప్యార్డ్లో తయారు చేశారు. ఈ ఓడ అసలు రష్యన్ పేరు 'నాదేజ్నీ' అంటే ఆంగ్లంలో 'హోప్' (తెలుగులో నమ్మకం) అని అర్థం. ఈ ఓడ సేవలు 1977, సెప్టెంబర్ 17న ప్రారంభం కాగా, 1980, మే 4వ తేదీన తేదీన జార్జియాలోని యూఎస్ఎస్ఆర్లో భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్ సమక్షంలో ఐఎన్ఎస్ రాజ్పుత్గా పేరు మార్చి, భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.

మొదటి కమాండింగ్ ఆఫీసర్
కెప్టెన్ గులాబ్ మోహన్ లాల్ హిరానందాని ఐఎన్ఎస్ రాజ్పుత్ యుద్ధ నౌకకు మొదటి కమాండింగ్ ఆఫీసర్గా పనిచేశారు. ఈ 41 ఏళ్ల ఐఎన్ఎస్ రాజ్పుత్ ప్రస్థానంలో మొత్తం 31 మంది కమాండింగ్ ఆఫీసర్లు ఇందులో పనిచేశారు.

నౌక నిండా క్షిపణులే..
ఈ యుద్ధ నౌకలో ఉపరితలం నుండి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణులు, విమాన నిరోధక తుపాకులు, టార్పెడోలు మరియు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు ఉన్నాయి. సూపర్సోనిక్ క్రూయిజ్ మరియు సుదూర బ్రహ్మోస్ క్షిపణులను కాల్చడానికి అమర్చిన మొదటి ఓడ కూడా ఐఎన్ఎస్ రాజ్పుత్ కావటం విశేషం.

క్షిపణుల ప్రయోగాలకు మూలాధారం..
భారతీయ ఆర్మీ రెజిమెంట్, రాజ్పుత్ రెజిమెంట్తో అనుబంధంగా ఉన్న మొదటి భారతీయ నావికాదళం కూడా ఈ ఐఎన్ఎస్ రాజపుత్. 2005లో బ్రహ్మోస్ యాంటిషిప్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క మొదటి వెర్షన్ పొందిన నావికాదళంలో మొదటి ఓడ కూడా ఐఎన్ఎస్ రాజ్పుత్. 2005లో ధనుష్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కూడా రాజ్పుత్ నుంచి ట్రాక్ చేశారు. ఆ తరువాత 2007 మార్చిలో పృథ్వి-3 క్షిపణిని ఈ యుద్ధ నౌక నుంచి పరీక్షించారు.


Click it and Unblock the Notifications