హెల్మెట్లపై జీఎస్టీ రద్దు చేయాలని కోరిన IRF.. వాహనదారులు హెల్మెట్ కొనకపోవడానికి అదే కారణమట.!!
భారత్లో హెల్మెట్లపై విధించే జీఎస్టీని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్(International Road Federation) కోరింది. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో తీవ్రత ఎక్కువగా ఉండటంతో, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
దేశంలో మోటారు వాహన చట్టం ప్రకారం టూ వీలర్లు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంది. హెల్మెట్ ధరించి బైక్ లేదా స్కూటర్పై వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదాలు జరిగినా.. తలకు రక్షణ కవచం ఉన్న కారణంగా ప్రమాద తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఇలాంటి ప్రమాదాల్లో తలకు గాయాలు కాకుండా హెల్మెట్ కాపాడుతుంది. గతేడాది 2022 లో భారత్లో మొత్తం 4.61 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ జాబితాలో హెల్మెట్ ధరించకుండా వాహనం నడుపుతూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 50 వేలు దాటింది.
కేంద్ర రవాణా శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 70 శాతం మంది టూ వీలర్ నడిపే వారే కావడం బాధాకరం. మరో విషయమేమంటే.. భారత్ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లోనూ అక్కడ ప్రజలు కార్ల కంటే టూ వీలర్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఆ దేశాల్లో ద్విచక్ర వాహనదారులు క్రమం తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటారు.

కానీ భారత్లో తరచూ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. కేవలం చిన్న పట్టణాల్లోనే కాకుండా హైదరాబాద్, చెన్నె, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోనూ హెల్మెట్ లేకుండా రోడ్డు పైకి వస్తున్నారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా హెల్మెట్ ధరించని వారు ప్రాణాలు కోల్పోతున్నారు.
అయితే దేశంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడానికి వివిధ కారణాలు వెలుగులోకి వచ్చాయి. హెల్మెట్ ధర ఎక్కువగా ఉండటం ద్వారా కొనలేకపోతున్నామని కొందరు చెబుతున్నారు. ఈ కారణంగా తక్కువ ధరలో లభించే హెల్మెట్లు కొంటున్నట్లు తేలింది. కానీ ఈ నాసిరకం హెల్మెట్లు ధరించడం ద్వారా వాహనదారులకు ప్రయోజనం ఏమీ ఉండదు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ కొత్త విన్నపం తీసుకువచ్చింది. దీని ప్రకారం భారత్లో విక్రయించే హెల్మెట్లపై జీఎస్టీని తొలగించాలని సంస్థ ప్రతినిధులు అభ్యర్థించారు. కాగా ప్రస్తుతం దేశంలో విక్రయించే హెల్మెట్లపై 18 శాతం వరకు GSTని కేంద్రం విధిస్తోంది.
ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ తీసుకువచ్చిన ఈ విన్నపంపై కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు టూ వీలర్లు హెల్మెట్ వాడటం తప్పనిసరి. జీఎస్టీ కారణంగా వాహనదారులు హెల్మెట్ కొనుగోలు చేసేందుకు వెనుకాడుతుండటంతో దీనిపై కేంద్రం ఆలోచన చేయాల్సి ఉంది. జీఎస్టీ తగ్గితే హెల్మెట్ ధరలు పూర్తిగా తగ్గుతాయి.

ధరలు తగ్గితే హెల్మెట్ కొనేవారి సంఖ్య పెరుగుతుంది. దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గడంతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. దీని ద్వారా రహదారి భద్రత అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్కు ర్యాంక్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీనిపై కేంద్రం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మోటారు వాహన చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడిపేవారికి రూ.1000 జరిమానా విధిస్తారు. అయితే ఇలా ఎక్కువ సార్లు దొరికితే.. డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నెలల వరకు సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. అయితే దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో వారికి ట్రాఫిక్ అధికారులు జరిమానా విధిస్తున్నారు.


Click it and Unblock the Notifications








