వేరే వ్యక్తులకు రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? భారీ మొత్తంలో జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
టికెట్ బుకింగ్ విషయంలో భారతీయ రైల్వే (Indian Railway) కీలక మార్పులు చేసింది. తాజాగా తీసుకువచ్చిన నిబంధనల్నీ ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానా విధించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రైల్వే శాఖ వెల్లడించింది. ఓ వ్యక్తి ఐడీతో కుటుంబ సభ్యులు కాకుండా ఇతర వ్యక్తులకు ఆన్లైన్లో టికెట్ల బుకింగ్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అసలు ఇలాంటి మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? కొత్త ఆదేశాల్లో ఏముంది? అనే తదితర అంశాలు ఈ కథనంలో..
దేశమంతటా ప్రతిరోజూ వందల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో ప్రయాణం కోసం IRCTC వెబ్సైట్ ద్వారా లక్షలాది మంది టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. వీటితో పాటు ఇతర అసోసియేట్ పార్టీ యాప్స్ ద్వారా బుకింగ్స్ చేసుకునే సదుపాయం ఉంది. అయితే IRCTC వెబ్సైట్కి ఎక్కవ సక్సెస్ రేట్ ఉండటంతో దీనినే ఉపయోగిస్తారు. ఇందులో టికెట్ కన్ఫర్మ్కి సంబంధించి కచ్చితమైన సమాచారం అందుతుంది.

భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 143 ప్రకారం అధీకృత ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీలకు టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. అంటే IRCTC ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ ప్రకారం వేరే వ్యక్తులు టికెట్లు బుక్ చేయడానికి వీల్లేదు. అయితే మీ సెల్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ ద్వారా మీ వ్యక్తిగత ఖాతా నుంచి టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
అంతే కాకుండా మీరు లేదా మీ రక్త సంబంధీకులకు మాత్రమే టిక్కెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకపై కమీషన్ లేదా మరేదైనా లాభం కోసం మీ పర్సనల్ బుకింగ్ ఫెసిలిటీ నుంచి టిక్కెట్లు బుక్ చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ .10,000 వరకు జరిమానా విధించబడుతుంది. తాజా నియమాలతో వ్యక్తిగత టికెట్ల బుకింగ్పై రైల్వే యంత్రాంగం ఇప్పటికే పలు రకాల ఆంక్షలు విధించింది.

కొత్త నిబంధనల ప్రకారం ఆధార్ వెరిఫైడ్ అయిన ప్యాసింజర్ తన ఐడీ నుంచి 24 టికెట్లు, ఆధార్ ధృవీకరణ లేని వ్యక్తి నెలకు 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దేశంలో చాలా మందికి ఐఆర్సీటీ ఐడీలు ఉన్నాయి. అయితే చాలా మంది ఇతరుల కోసం తమ ఐడీల ద్వారా టికెట్స్ బుక్ చేస్తున్నారని తేలింది. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని రైల్వే యంత్రాంగం తెలిపింది. ఇందుకోసం గతంలో పలు ఆంక్షలు విధించారు.
ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తున్న వారిపై రైల్వే శాఖ శిక్ష వివరాలను వెల్లడించింది. దీనిని ఉల్లంఘిస్తే మీకు చట్ట ప్రకారం శిక్ష పడనుంది. అంతే కాదు మీరు మీ వ్యక్తిగత ఐడీ నుంచి థర్డ్ పార్టీకి టికెట్లు బుక్ చేస్తున్నట్లు రైల్వే యంత్రాంగం గుర్తిసే మీ ఐడీని బ్లాక్ చేసే అధికారం రైల్వేకు ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మీ ఐడీ నుంచి రైలు టికెట్లు బుక్ చేసుకోలేని పరిస్థితి ఏర్పడవచ్చు.

వ్యక్తిగత ఐడీతో టికెట్లు ఎలా బుక్ చేయాలో తెలియకపోతే లేదా సమయం లేకపోతే మీరు వెంటనే రైల్వే అడ్మినిస్ట్రేషన్ లేదా సమీప అధీకృత టికెట్ డిస్ట్రిబ్యూటర్ వద్దకు వెళ్లి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. వీరు IRCTC నియమించిన అధీకృత డీలర్లుగా ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. పర్సనల్ ఐడీతో థర్డ్ పార్టీలకు టికెట్లు బుక్ చేయవద్దని చెప్పినా వినకపోవడంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications








