ఇస్రో శాస్త్రవేత్తపై యువకుడు దాడి.. స్కూటీపై వచ్చి కారును తన్ని హల్చల్, వీడియో వైరల్
చంద్రునిపై చంద్రయాన్- 3 విజయవంతంగా ల్యాండింగ్ తర్వాత, ఇస్రో శాస్త్రవేత్తల పరిశోధన మరియు అధ్యయనం ఊపందుకుంది. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో ఓ వైపు దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. ప్రధాని మోదీ సైతం స్వయంగా శాస్త్రవేత్తలను అభినందించారు. కానీ బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్త కారుపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు.
గత కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోనే ఓ సైంటిస్టుపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తులతో సైతం ఆయనను వెంబడించారు. అంతే కాకుండా కారు అద్దాలు పగలగొట్టారు. ఆ ఘటన మరువకముందే తాజాగా ఇస్రో శాస్త్రవేత్తపై ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బెంగళూరుకు చెందిన ఆశిష్ లాంబా తన కారుపై దాడికి సంబంధించిన వీడియోను పూర్తి సమాచారంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇస్రో సైంటిస్ట్ ఆశిష్ లాంబా ఆఫీసుకు వెళ్తుండగా టీవీఎస్ ఎన్టార్క్ స్కూటీపై ఓ యువకుడు తన కారు ముందు ఆగినట్లు తెలిపారు. ఆ తర్వాత తనను దుర్భాషలాడి కారును రెండుసార్లు తన్నినట్లు పోస్టులో పేర్కొన్నారు. అయితే ఈ ఘటనకు ముందు ఏం జరిగిందో వీడియోలో లేదు.
ఈ ఘటనకు ముందు వారి మధ్య గొడవ జరిగిందా.. లేక స్కూటీపై వెళ్లే యువకుడు ఒక్కసారిగా ఆపి సైంటిస్ట్ను దుర్భాషలాడాడా అనేది స్పష్టంగా లేదు. ఇస్రో శాస్త్రవేత్త సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో.. కారు డాష్బోర్డ్ కెమెరా ద్వారా తీసుకున్నారు. బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో ఇటీవల నిర్మించిన హెచ్ఏఎల్ అండర్పాస్ సమీపంలో ఆగస్టు 29 న ఈ సంఘటన జరిగింది.

'స్కూటర్ పైన వెళ్తున్న యువకుడు కారు ముందుకి వచ్చి దుర్భాషలాడి కారును తన్నాడు. మంగళవారం ISRO ఆఫీసుకి వెళుతుండగా, కొత్తగా నిర్మించిన HAL అండర్ పాస్ దగ్గర, హెల్మెట్ లేకుండా స్కూటర్ మీద ఒక వ్యక్తి (KA 03 KM 8826) నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ హఠాత్తుగా మా కారు ఎదురుగా వచ్చాడు. దాంతో సడెన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది.' అని శాస్త్రవేత్త X(ట్విట్టర్)లో రాశారు.
దీనిపై బెంగళూరు పోలీసులు వెంటనే స్పందించారు. అధికారిక బెంగళూరు పోలీసు ట్విట్టర్ ఖాతా ద్వారా సమాధానమిచ్చారు. సంబంధిత పోలీసు అధికారికి వివరాలు తెలియజేస్తామన్నారు. తదుపరి సమాచారం కోసం ఆశిష్ చిరునామా, వివరాలు అడిగారు. అయితే ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఘటనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించని యువకుడు.. హెల్మెట్ ధరించకుండా బండి నడపడమే కాకుండా.. తన ముందు కారులో వెళ్తోన్న ఇస్రో సైంటిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడం నెట్టింట్లో చర్చనీయాంశమైంది. కారుకు అడ్డంగా స్కూటీ ఆపి.. బెదిరింపులకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. కాగా నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల బెంగళూరులోనే యువ శాస్త్రవేత్త అశుతోష్ సింగ్ తన రెనాల్ట్ క్విడ్ కారులో ప్రయాణిస్తుండగా, అనుసరించిన దుండగులు ఆయనపై దాడి చేశారు. దుండగుల నుంచి తప్పించుకున్న అశుతోష్ సింగ్ మదనాయకహళ్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. మరోవైపు ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో అశుతోష్ సింగ్ X ద్వారా ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. అనంతరం మదనాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన బెంగళూరులోని మదనాయకన హళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌతనహళ్లి మెయిన్ రోడ్డులో చోటుచేసుకుంది.
కారు డ్యాష్బోర్డ్ కెమెరాలు పబ్లిక్ రోడ్లపై ప్రమాదాలు మరియు నేర కార్యకలాపాలు వంటి సంఘటనలను రికార్డ్ చేయడం ద్వారా ఇలాంటి ఘటనల్లో తప్పెవరిదో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకూ డ్యాష్ బోర్డు కెమెరాల ద్వారా చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








