జైసల్మేర్ దుర్ఘటన.. నాన్-ఏసీ బస్సులను ఏసీగా మార్చడం ఎంత వరకు ప్రమాదకరం?
రాజస్థాన్లోని జైసల్మేర్లో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒక మోడిఫై చేసిన ఏసీ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతై, 22 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 19 మంది బస్సులోనే దగ్ధమయ్యారు. ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ నేపథ్యంలో ఒక నాన్-ఏసీ బస్సును ఏసీ బస్సుగా మార్చడం ఎంత ప్రమాదకరమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్సు యజమానులు ఎందుకు ఇంత ప్రమాదకరంగా మార్పులు చేస్తున్నారు? ఈ మార్పులకు ఎంత ఖర్చవుతుంది? నాసిరకం వస్తువులు వాడటం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా నాన్-ఏసీ బస్సును ఏసీ బస్సుగా మార్చడానికి అయ్యే ఖర్చు బస్సు సైజ్ పై ఆధారపడి ఉంటుంది. ఒక చిన్న మినీ బస్సు నుంచి పూర్తి సామర్థ్యం గల స్లీపర్ బస్సును మార్చడానికి రూ.4 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే, బస్సు యజమాని మంచి క్వాలిటీ గల ఏసీ యూనిట్, పవర్ఫుల్ ఎలక్ట్రిక్ వైరింగ్, లగ్జరీ సీటింగ్ వాడితే ఈ ఖర్చు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది.
కానీ, యజమానులు ఖర్చు తగ్గించుకోవడానికి నాసిరకం వస్తువులు ఉపయోగిస్తే, మోడిఫికేషన్ ఖర్చు తగ్గుతుంది. కానీ జైసల్మేర్ ప్రమాదం లాంటి ఘటనలు ఎప్పుడైనా జరగవచ్చు. నాన్-ఏసీ బస్సును ఏసీ బస్సుగా మార్చేటప్పుడు కేవలం ఏసీ పెట్టడం మాత్రమే కాదు, మొత్తం బస్సు సిస్టమ్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. పెద్ద సైజు బస్సుకు కనీసం రూ.4 లక్షల విలువైన ఎయిర్ కండీషనర్ అవసరం.

ఏసీని నడపడానికి మూడు మార్గాలున్నాయి.
స్లేవ్ ఇంజిన్ : చాలా మోడిఫికేషన్లలో ఏసీని నడపడానికి ప్రత్యేకంగా చిన్న ఇంజిన్ను అమర్చుతారు. దీనివల్ల మెయిన్ ఇంజిన్పై భారం తగ్గి, దాని లైఫ్ పెరుగుతుంది, కానీ మొత్తం ఖర్చు పెరుగుతుంది.
మెయిన్ ఇంజిన్ : ఏసీని బస్సు మెయిన్ ఇంజిన్తో నడిపితే ఖర్చు తగ్గుతుంది. కానీ ఇంజిన్ లైఫ్,మైలేజ్ తగ్గుతాయి.
ఆల్టర్నేటివ్ సిస్టమ్: కొన్ని కంపెనీలు బ్యాటరీ ఛార్జ్ చేసి, ఆ బ్యాటరీతో ఏసీ నడిచేలా కొత్త సిస్టమ్స్ను ప్రయత్నిస్తున్నాయి.
మోడిఫికేషన్ అంటే కేవలం ఏసీ పెట్టడం కాదు. నాన్-ఏసీ బస్సు బాడీలో ఇన్సులేషన్ ఉండదు. చల్లని గాలి బయటకు పోకుండా ఉండటానికి, పైకప్పు, గోడలలో థర్మల్ ఇన్సులేషన్ తప్పనిసరిగా వేయాలి. అలాగే, చల్లని గాలి క్యాబిన్ అంతా సమానంగా చేరడానికి ఎయిర్ డక్ట్లు, వెంట్ల కొత్త సిస్టమ్ ఏర్పాటు చేయాలి.

దీనికి ఇంటీరియర్ ప్యానెల్లను మార్చడం వల్ల శ్రమ, మెటీరియల్ ఖర్చు పెరుగుతుంది. చివరిగా ప్రయాణికులకు ఎక్కువ సౌకర్యం ఇవ్వడానికి సీటింగ్ను సెమీ-స్లీపర్ లేదా స్లీపర్గా మార్చాల్సి ఉంటుంది. దీని వల్ల కూడా ఖర్చు పెరుగుతుంది. బస్సు లేదా కారులో రంగు లేదా ఇతర భాగాల మార్పులైనా సరే ఆర్టీఓ నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
కానీ చాలా మంది బస్సు యజమానులు మోడిఫికేషన్ అనుమతులు తీసుకోకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం మార్పులు చేస్తున్నారు. జైసల్మేర్ బస్సు ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తులో కూడా ఈ విషయం బయటపడింది. ఈ ప్రమాదం కేవలం ప్రమాదం కాదని, తీవ్ర నిర్లక్ష్యం, అవినీతి ఫలితం కావచ్చని తెలుస్తోంది.

తప్పుడు వైరింగ్ లేదా నాసిరకం మెటీరియల్ వాడకం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే సేఫ్టీ, సౌకర్యం కోసం, మోడిఫికేషన్ పనులు నైపుణ్యం గల టెక్నీషియన్లతో, ధృవీకరించబడిన వర్క్షాప్లలో మాత్రమే చేయించడం మంచిది.


Click it and Unblock the Notifications








