ఈ నెల 24 న కాచిగూడ- యశ్వంత్పూర్, విజయవాడ- చెన్నై వందే భారత్ రైళ్లు ప్రారంభం.. టైమింగ్స్ ఇవే..
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో హైదరాబాద్- బెంగళూరు(Kachiguda- Yeshwantpur Vande Bharat Express) మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఈ నెల 24 న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. కాచిగూడ(హైదరాబాద్)- యశ్వంత్పూర్(బెంగళూరు) మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది.
కాచిగూడ- యశ్వంత్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat Express)ను ఆదివారం(సెప్టెంబర్ 24) మధ్యాహ్నం 12.30 కు ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఈ రైలును ప్రారంభించనున్నారు. సోమవారం(సెప్టెంబర్ 25) నుంచి అధికారికంగా సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు.

వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రీమియం సెమీ హైస్పీడ్(Premium Semi High Speed Train) రైలు కాచిగూడ- యశ్వంత్పూర్ మధ్య 609 కి.మీ దూరాన్ని 8.30 గంటల్లో చేరుకుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ గరిష్ఠంగా 71.74 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుత హై-స్పీడ్ రైలు దురంతో ఎక్స్ప్రెస్ కంటే ఒక గంట ముందుగానే వందే భారత్ ఎక్స్ప్రెస్ నిర్దిష్ట గమ్యస్థానానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
అయితే కాచిగూడ- యశ్వంత్పూర్ వంద భారత్ రైలు తెలంగాణ మరియు ఏపీ రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. ఈ ఎక్స్ప్రెస్ కర్ణాటకలోని ఏ స్టేషన్లోనూ ఆగకుండా యశ్వంత్పూర్కు చేరుకుంటుంది. అయితే రైల్వే ప్రయాణికులు మాత్రం ఈ రైలు రాయచూరు మార్గంలో ప్రయాణించి యలహంక వద్ద ఆగుతుందని అభిప్రాయపడ్డారు.
కాచిగూడ- యశ్వంత్పూర్ సెమీ హై స్పీడ్ రైలును దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నిర్వహిస్తుందని సంబంధిత అధికారి తెలిపారు. సెప్టెంబర్ 24 న ఈ రైలును వర్చువల్గా ప్రారంభించిన అనంతరం మరుసటి రోజు నుంచి అధికారికంగా రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. దీని ద్వారా రెండు నగరాల మధ్య ప్రయాణించే వేలాదిమంది ప్రయాణికులకు లబ్ధి చేకూరనుంది.
అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కాచిగూడ- యశ్వంత్పూర్(Kachiguda-Yeshwantpur) రైలు.. కాచిగూడ రైల్వే స్టేషన్(Kachiguda Railway Station)లో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమవుతుంది. మహబూబ్ నగర్కి 7.00 గంటలకు, కర్నూలు 8.40 కి, అనంతపురం 10.55 కి, ధర్మవరం రైల్వే స్టేషన్కి 11.30కి చేరుకుని చివరగా, యశ్వంతపూర్ స్టేషన్(Yeshwantpur Railway Station)కి మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది.
యశ్వంత్పూర్ నుంచి మధ్యాహ్నం గం. 2.45కి రైలు ప్రారంభమవుతుంది. రాత్రి గం. 11.15 కి కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. బుధవారం మినహా మిగిలిన రోజుల్లో మాత్రమే కాచిగూడ- యశ్వంత్పూర్ రైలు రాకపోకలు కొనసాగించనుంది. కాగా ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతికి రెండు వందేభారత్ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా.. కాచిగూడ- యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్తో తెలంగాణ ఖాతాలో మూడో రైలు చేరింది.
అంతే కాకుండా ఈ నెల 24న ప్రధాని మోదీ కాచిగూడ- యశ్వంత్పూర్ వందే భారత్తో పాటు మరో 8 రైళ్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. వాటిలో విజయవాడ- చెన్నై(Vijayawada- Chennai Vande Bharat Express) వందేభారత్ రైలు కూడా ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా ప్రయాణించి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది.
గురువారం మినహా మిగిలిన రోజుల్లో విజయవాడ- చెన్నై వందే భారత్ ఎక్స్ప్రెస్(Vande Bharat) రాకపోకలు కొనసాగిస్తుంది. విజయవాడలో ఉదయం 5.30 కి బయలుదేరి మధ్యాహ్నం 12.10 కి చెన్నై చేరుకుంటుంది. చెన్నైలో మధ్యాహ్నం 3.20 కి బయలుదేరి విజయవాడకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన కాషాయ రంగు వందేభారత్ తొలి రైలును కేరళ రాష్ట్రానికి కేటాయించారు.


Click it and Unblock the Notifications








