తాజా రైలు ప్రమాదానికి అసలు కారణం 'TA 912 డాక్యుమెంట్ '.. దీనిని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో తెలుసా?
పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదానికి కారణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముందుగా సిగ్నలింగ్లో టెక్నికల్ ఎర్రర్ అని భావించారు. ఆ తర్వాత లోకో పైలట్ సిగ్నల్ జంప్ ఈ ప్రమాదానికి కారణమని అనుకున్నారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం రైలు ప్రమాదానికి గల కారణం ఏమిటో తెలిసిపోయింది. దీనిపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది. ఈ ప్రమాదంలో లోకో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. అసిస్టంట్ లోకో పైలట్ సైతం స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అసలు వారు రైలుని ఎందుకు ముందుకు కదిలించాడు. అధికారులు సైతం అనుమతి ఎలా మంజూరు చేశారనే అంశంపై విచారణ వేగంగా సాగుతోంది. ఈ ప్రమాదానికి ముందు అసలేం జరిగిందంటే..
జూన్-17న ఉదయం 8:45లకు అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సీల్దాకు కాంచన్జంఘా ఎక్స్ప్రెస్ (Kanchanjungha Express) బయలుదేరింది. మార్గమధ్యలో డార్జిలింగ్ జిల్లాలోని రంగపాని స్టేషన్ నుంచి బయలు దేరి వెళ్లిన కాసేపటికే నుంచి గూడ్స్ రైలు వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను కీలకమైన కారణాలను భారతీయ రైల్వే అన్వేషిస్తుంది.

ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తుండగా మొదటి దశలో గూడ్స్ రైలు లోకోపైలట్ సిగ్నల్ని దాటి నడిపినట్లు భావించారు. ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సిగ్నల్ ఫెయిల్ అయిన సందర్భాల్లో ఒక రైలు అదే ట్రాక్లో కదులుతున్నప్పుడు మరొక రైలుకు రెడ్ సిగ్నల్ రావాలి. సాంకేతిక లోపంతో ఇది పనిచేయదు. ఆ సందర్భాల్లో ఓ ప్రత్యేక డ్యాక్యుమెంట్ని వినియోగించుకోవచ్చు.
సిగ్నలింగ్ వ్యవస్థ లోపం ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక అనుమతులలో లోకోపైలట్స్ని రైలు ముందుకు నడిపేందుకు అవకాశం ఉంటుంది. దానినే టీఏ 912 డ్యాక్యుమెంట్ అంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సిగ్నల్ క్రాసింగ్ కోసం ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. తాజా రైలు ప్రమాదానికి ముందు ఆఖరుగా ఆగిన రంగపాని రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు లోకో డ్రైవర్కి టీఏ 912 అనే డాక్యుమెంట్ ఇచ్చినట్లు విచారణంలో తేలింది.

ఇలంటి డాక్యుమెంట్స్ కేవలం ట్రాక్పై హెచ్చరిక బోర్డు లేదా సిగ్నల్ ఫెయిల్ అయిన సందర్భాల్లో రైలు రాకపోకలకు అంతరాయం కలగకుండా జారీ చేస్తారు. తాజాగా ప్రమాదం జరిగిన ట్రైన్కి కూడా ప్రస్తుత స్టేషన్ నుంచి మరో స్టేషన్కి వెళ్లేందుకు ఇలాంటి డాక్యుమెంట్ జారీ చేశారు. రంగపాని రైల్వేస్టేషన్ నుంచి ప్రమాదం జరిగిన న్యూ జల్పాయ్గుడి జంక్షన్ వరకు రెడ్ సిగ్నల్ ఉన్నా కానీ ముందుకు కదిలేందుకు అనుమతించారు.
ఈ డ్యాక్యుమెంట్ అందుకున్న లోకోపైలట్ సిగ్నల్ని పట్టించుకోకుండా రైలును కొనసాగించడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒక్కోసారి ట్రాక్ పనులు జరుగుతుంటే నిర్దిష్ట ప్రదేశానికి వెళ్లేటప్పుడు నిర్దిష్ట వేగంతో వెళ్లాలని లోకోపైలట్కి సూచిస్తారు. తాజాగా అధికారులు ఇచ్చిన క్లియరెన్స్ ప్రకారం గంటకు పది కి.మీ వేగంతో వెళ్లాలి. అయితే దీనిని గూడ్స్ లోకోపైలట్ ఉల్లఘించినట్లు తేలింది. పరిమితికి మించిన వేగంతో రైలుని పోనివ్వడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు భావిస్తున్నారు.

రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ గూడ్స్ రైలును నడపడానికి అనుమతి పొందిన తర్వాతే అదే ట్రాక్పై రైలుని లోకోపైలట్ పోనిచ్చినట్లు నిర్దారించారు. ఈ ప్రమాదంలో అతను చనిపోయాడు. అయితే ఈ రూట్లో ఉదయం 5:50 నిమిషాల నుంచి సిగ్నల్ సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాంచన్జంఘా ఎక్స్ప్రెస్ సైతం టీఏ 912 డాక్యుమెంట్ సహాయంతో 9 స్టేషన్లు దాటినట్లు తెలిసింది. అంతలోనే ఘోర ప్రమాదం జరిగింది.
రైల్వే ట్రాఫిక్లో సాంకేతిక లోపాలు తలెత్తితే తాత్కాలికంగా ఇలాంటి అనుమతులు జారీ చేయడం మామూలే. ఏయే పరిస్థితుల్లో అందించాలన్న దానిపై స్టేషన్ మాస్టర్లకు పూర్తి ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తాజా ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత విధివిధానాల్లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అత్యాధునిక కవచ్ టెక్నాలజీ ఉన్నా కానీ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications








