పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. రైళ్లలో వెళ్లాలంటే భయపడుతున్న జనాలు..టెక్నికల్ సమస్యలా? మానవ తప్పిదమా?
పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఓ ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్ (West Bengal)లోని డార్జిలింగ్ జిల్లాలో ఉదయం 8:45 గంటల ప్రాంతంలో రైళ్లు ఢీకొన్నట్లు రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఒకే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడం (Train Collision)తో ఓ బోగీ గాల్లోకి ఎగిరింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రయాణికులు మృతిచెందగా.. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఇక ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతా (Kolkata)లోని సీల్దాకు కాంచన్జంఘా ఎక్స్ప్రెస్ (Kanchanjungha Express) బయలుదేరింది. ఈ మధ్యలోని న్యూజల్పాయ్గుడి వద్ద ఈ ఎక్స్ప్రెస్ ఆగింది. అక్కడి నుంచి బయల్దేరిన కాసేపటికే రంగపాని స్టేషన్ సమీపంలోకి చేరుకుంది. ఆ వెంటనే వెనక నుంచి ఓ గూడ్స్ రైలు ఈ ఎక్స్ప్రెస్ని బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడ ఆర్తనాదాలు, భయాందోళనలు మిన్నంటాయి.

అక్కడి ప్రమాద దృశ్యాలు భయపెడుతున్నాయి. ఆ ప్రాంతం అంతా ఆర్తనాదాలతో భీతిల్లిపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్ప్రైస్ రైలు రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలోని ఓ బోగీ గాల్లోకి ఉండటం ప్రమాద తీవ్రతకు అద్దంపడుతోంది. వెంటనే సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
సిగ్నల్ జంప్ కారణమా?: ప్రమాదం దీనిపై దార్జిలింగ్ అదనపు ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద తీవ్రతా చాలా తీవ్రంగా ఉందని తెలిపారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న చాలామంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. వారికి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.

ఈ ప్రమాదంపై ఆయన ప్రాథమికంగా అంచనా వేశారు. సిగ్నల్ జంపింగ్ ప్రమాదానికి కారణం కావచ్చని ఆయన భావిస్తున్నారు. కేవలం సిగ్నల్ జంప్ కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లినట్లు అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.
సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెళ్లడించారు. ప్రయాణికుల బంధువులు, ఇతర ఎంక్వైరీల కోసం హెల్ప్లైన్ ఏర్పాటు చేశామని.. ప్రస్తుతం అక్కడి బాధితులను ఆసుపత్రికి తరలిస్తున్నారని అన్నారు. భారీ యంత్రాలతో రైలు బోగిలను తొలిగిస్తూ క్షతగాత్రులను బయటకు తీస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని ఇతర ప్రముఖులు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు.

భయపెడుతున్న ప్రమాదాలు: దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలతో ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండటంతో రైళ్లలో ప్రయాణించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. దేశంలో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ మానవ తప్పిదాల వల్ల లేదా సిగ్నలింగ్ వ్యవస్థ వల్ల పొరపాట్లు జరిగి భారీ మొత్తంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








