కార్గిల్ అమరవీరులకు ఘన నివాళి.. ఏకంగా 3,620 కి.మీ బైక్ రైడ్!!
కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి యేటా భారత సైన్యం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ను జరుపుకొంటున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది #ForeverHeroes ఇనిషియేటివ్ను కొనసాగిస్తూ భారత సాయుధ దళాల భాగస్వామ్యంతో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు జావా యెజ్డీ మోటార్సైకిల్స్(Jawa Yezdi Motorcycles) ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంది.
1999లో జరిగిన కార్గిల్ వార్లో ఎంతో మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంలో వారి పరాక్రమం, త్యాగాలను స్మరించుకోవడం, వారి స్ఫూర్తికి నివాళులర్పించడమే ఈ యాత్ర లక్ష్యం. ఈ సంవత్సరం, కార్గిల్ విజయ్ దివస్ రైడ్ను భారత సైన్యంలోని నాగా రెజిమెంట్ చేపట్టింది.

నాగా సైనికుల జన్మస్థలం, 1999లో జరిగిన యుద్ధంలో వారు తుది శ్వాస విడిచిన ప్రదేశానికి అనుసంధానం చేస్తూ 'ఫస్ట్ బ్రీత్ టు లాస్ట్' అనే ఈ యాత్ర సాగింది. భారత సాయుధ దళాల భాగస్వామ్యంతో జావా యెజ్డీ మోటార్సైకిల్స్ కార్గిల్ విజయ్ దివస్ రైడ్ మరో ఎడిషన్ను పూర్తి చేసింది. ఈ ఏడాది జూలై 2వ తేదీన నాగాలాండ్లోని కోహిమా నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.
భారత సాయుధ దళాలకు చెందిన అనుభవజ్ఞులు, అధికారులు మరియు సైనికులతో కూడిన 24 మంది రైడర్ల కాన్వాయ్, యాత్ర అంతటా ఆదర్శప్రాయమైన ఐక్యత మరియు స్నేహాన్ని ప్రదర్శించింది. ఈ యాత్రలో భాగంగా రైడర్లు 'పవిత్ర నేల'గా భావించే నాగాల భూమి నుంచి మట్టిని తీసుకువెళ్లారు. 3,620 కిలోమీటర్లకు పైగా సవాలుతో కూడిన భూభాగాలు, ముఖ్యమైన సైనిక స్థాపనలు మరియు గౌరవనీయమైన యుద్ధ స్మారక చిహ్నాల ద్వారా ప్రయాణించారు.

ఈ రైడ్ కార్గిల్లోని ద్రాస్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద ముగిసింది. అక్కడ నాగా రెజిమెంట్కు చెందిన రైడర్లు తాము తీసుకువచ్చిన పవిత్ర మట్టిని GOC 8 డివిజన్ మేజర్ జనరల్ సచిన్ మాలిక్కు అందజేశారు. దేశం కోసం అహర్నిశలు పోరాడి అసువులు బాసిన వీరులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గౌహతి మరియు చండీగఢ్లలో, జావా యెజ్డీ డీలర్షిప్ల వద్ద రైడర్లను సత్కరించారు.
యుద్ధంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన తమ సహచరులకు వారి కృతజ్ఞత, గౌరవాన్ని సూచిస్తూ రైడర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాత్రలో భాగంగా రైడర్లు దిమాపూర్, గౌహతి, సిలిగురి, దానాపూర్, వారణాసి, లక్నో, ఢిల్లీ NCR, చండీగఢ్, డెహ్రాడూన్, ద్రాస్తో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పర్యటించారు.

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సీఈఓ ఆశిష్ సింగ్ జోషి మాట్లాడారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత సాయుధ దళాలతో భాగస్వామ్యం పంచుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. దేశ సైనికుల ధైర్యం, తిరుగులేని మద్దతు, స్ఫూర్తి, త్యాగాలను గుర్తించి వారిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. నిస్వార్థమైన త్యాగంతో దేశం కోసం పోరాడుతున్న యువతీయువకుల పట్ల జావా యెజ్డీ గౌరవాన్ని కలిగి ఉందన్నారు.
1999లో కార్గిల్ వార్ సమయంలో నాగా రెజిమెంట్ సాహసం, త్యాగాలను గౌరవిస్తూ భారత సాయుధ దళంతో తాము భాగస్వామ్యం ఏర్పరుచుకున్నట్లు ఆశిష్ సింగ్ అన్నారు. నాగా రెజిమెంట్లోని ఒక విశేషమైన బృందానికి జావా యెజ్డీ మోటార్సైకిళ్లను అందించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. భారత సాయుధ దళాలతో మా శాశ్వతమైన మైత్రి ఈ లక్ష్యం పట్ల తమ నిబద్ధతను మరింత పటిష్టం చేస్తుందని స్పష్టం చేశారు.

సాయుధ దళాల పట్ల కృతజ్ఞతా భావాన్ని పెంపొందించడానికి #ForeverHeroes హ్యాష్ట్యాగ్తో భారత సాయుధ దళం భాగస్వామ్యంతో జావా యెజ్డీ మోటార్సైకిల్స్ నిర్వహిస్తోంది. దేశాన్ని సురక్షితంగా, శాంతియుతంగా మరియు సుసంపన్నంగా ఉంచేందుకు పాటుపడుతున్న సైనికుల కృషి, త్యాగాలను అభినందిస్తూ ఈ యాత్రలో పాలుపంచుకుంటోంది. 2019లో, సాయుధ దళాల సిబ్బంది మరియు వారి బంధువుల సంక్షేమానికి తోడ్పడేందుకు కంపెనీ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించింది.
జావా యెజ్డీ మోటార్సైకిల్స్ తన మొదటి బ్యాచ్ ప్రొడక్షన్ మోటార్సైకిళ్ల నుంచి 13 మోటార్సైకిళ్లను వేలం వేయడం ద్వారా రూ. 1.49 కోట్ల మొత్తాన్ని సేకరించింది. వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్కు విరాళంగా అందించింది. ప్రముఖ సాయుధ దళాల అనుభవజ్ఞులు, యుద్ధ వీరులు, అధికారుల సమక్షంలో కేంద్రీయ సైనిక్ బోర్డు, రక్షణ మంత్రిత్వ శాఖకి జావా యెజ్డీ మోటార్సైకిల్స్ అప్పగించింది.


Click it and Unblock the Notifications








