ఖరీదైన ఆడి A4 కారులో వచ్చి ఆకు కూరలు అమ్మిన యువ రైతు.. తెగ వైరల్ అవుతున్న వీడియో
సాధారణంగా అందరికంటే భిన్నంగా ఏది చేసిన వెంటనే వైరల్ అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగే రైతులు రోడ్లపై కూరగాయలు, పూలు లేదా పండ్లు వినూత్న పద్ధతిలో అమ్ముతూ ఆకట్టుకున్న వీడియోలు కూడా తెగ పాపులారిటీని పొందాయి. అయితే తాజాగా ఓ రైతు ఖరీదైన కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్న వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.
ప్రస్తుతం దేశంలో యువత ఎక్కువగా వ్యవసాయం వైపు చూస్తోంది. వర్క్ఫ్రం హోమ్ చేసుకుంటూనే తమకున్న పొలంలో లాభసాటి పంటలు పండిస్తూ అధిక మొత్తంలో సంపాదిస్తున్నారు. కొవిడ్ పుణ్యమా అని దేశంలో సాగు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలామంది యువత అమ్మ, నాన్నలకు సహాయపడుతూ రైతు అవతారమెత్తుతున్నారు. పొలాల్లో కష్టపడి పనిచేస్తూ నిత్యం వార్తలో యువకులు దర్శనమిస్తున్నారు.

దేశంలో వ్యవసాయ సేద్యం నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాలలో చాలా మంది యువకులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో వారికి మెరుగైన ఫలితాలు రావడంతో పాటు లాభాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్మేందుకు ఆడి ఎ4(Audi A4) సెడాన్లో వచ్చిన యువ రైతు వీడియో వైరల్గా మారింది.
దీనికి సంబంధించిన వీడియోను రైతు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. మొదటగా ఈ వీడియోలో తాను పండించిన ఆకు కూరలను సేకరించిన వీడియో తీశాడు. ఆ తర్వాత క్లిప్లో ఆడి A4 లగ్జరీ సెడాన్లో వచ్చి తన కూరగాయలను మార్కెట్కి తరలించడానికి ఉపయోగించే ఆటో రిక్షా వద్దకు వెళ్తాడు. అక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు రైతు.

అప్పటి వరకు ఓ సాఫ్ట్వేర్లా వచ్చిన ఆ యువకుడు.. లగ్జరీ కారు నుంచి దిగుతూ నేరుగా ఆటో దగ్గరకు వెళ్లి తన లుంగీని తీసేసి సాధారణ విక్రయదారుడిగా మారిపోతాడు. ఇదంతా చూస్తున్న అక్కడి వారు ఒక్కసారిగా అవాక్కవుతారు. ఓ లగ్జరీ కారు లోంచి పెద్ద బిజినెస్మెన్లా వచ్చిన వ్యక్తి అరక్షణంలో రైతుగా మారిపోవడంతో ముక్కున వేలేసుకుంటారు.
ఆకుకూరలన్నీ రోడ్డు పక్కన ప్లాస్టిక్ షీట్పై పోసి వాటిని సేల్ చేస్తాడు. తెచ్చిన సరుకు అంతా అమ్ముడు పోయాక తర్వాత అన్నీ సర్దుకుని తన కారులోకి వెళ్తాడు. మళ్లీ కారులోకి వెళ్లేటప్పుడు లోపలి భాగం మురికిగా మారకుండా ఉండేందుకు తన షార్ట్స్ చుట్టూ లుంగీని చుట్టిన వీడియోను గమనించవచ్చు.

ఆదర్శ రైతు: ఈ యువరైతు పేరు సుజిత్. కేరళకు చెందిన సుజిత్ గత 10 ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ ఆదర్శ రైతుగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు అవార్డులు కూడా పొందారు. చాలా మంది రైతుల మాదిరిగానే సుజిత్ కూడా సేద్యాన్ని ప్రారంభించాడు. ఇతనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే నేరుగా కస్టమర్కి విక్రయించేటప్పుడు పంటకు సంబంధించిన అన్ని పద్ధతులను వివరిస్తాడు.
సొంతంగా పంటను అమ్మడం మూలంగా ఎక్కువ లాభాలను పొందవచ్చనేది ఇతని భావన. పంటను సొంతంగా విక్రయించడం వల్ల దళారుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తాడు. తాజాగా సుజిత్ ఆడీ A4 లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. అయితే ఇతను కొనుగోలు చేసిన కారు సెకండ్ హ్యాండ్ది.

గతంలోనూ రైతులు లగ్జరీ కార్లు ఉపయోగించేవారు. కొన్నేళ్ల క్రితం తమిళనాడుకు చెందిన ఓ 88 ఏళ్ల రైతు సరికొత్త మెర్సిడెస్ బెంజ్ బీ-క్లాస్ ఎంపీవీ కారును కొనుగోలు చేశాడు. బీహార్కు చెందిన మరో రైతు తన పశువులకు పశుగ్రాసం తీసుకెళ్లడానికి BMW 5-సిరీస్ సెడాన్ను కొనుగోలు చేశాడు. ఇలా ఎందరో రైతులు తమ అవసరాల కోసం ఖరీదైన కార్లను కొంటున్నారు.


Click it and Unblock the Notifications








