ప్రైవేట్ పంపు టాయిలెట్లు.. పబ్లిక్ కావు.. టాయిలెట్ కస్టమర్లకేనని హైకోర్టు సంచలన తీర్పు
దూర ప్రయాణాలు చేసేవాళ్లకి, అకస్మాత్తుగా టాయిలెట్కి వెళ్లాలని అనిపించినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ప్రైవేట్ పెట్రోల్ పంపులే. ఎందుకంటే దారి పొడవునా పబ్లిక్ టాయిలెట్లు అంతగా ఉండవు.. ఉన్నా వాటి పరిస్థితి మంచిగా ఉండదు. అందుకే, జనాలు ఎక్కువగా పెట్రోల్ బంకుల్లోని టాయిలెట్లను వాడుకునేవాళ్ళు. కానీ, ఇప్పుడు కేరళ హైకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది.
దీని ప్రకారం పెట్రోల్ పంపుల్లోని టాయిలెట్లను ఇకపై సాధారణ ప్రజలు వాడటానికి వీలు లేదంట. కేవలం పెట్రోల్ నింపించుకునే కస్టమర్లు మాత్రమే వీటిని వాడుకోవాలట. అసలు ఈ తలనొప్పి ఎందుకొచ్చిందంటే... చాలా కాలంగా పెట్రోల్ పంపు యజమానులు, తమ పంపుల్లోని టాయిలెట్లను అందరూ వాడటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు.

పబ్లిక్ టాయిలెట్లు అన్నట్లుగా ఎవరంటే వాళ్ళు వచ్చి, వాటిని అపరిశుభ్రం చేయడంతో పాటు, కొన్నిసార్లు పంపు ఉద్యోగులతో గొడవలు కూడా పడుతున్నారట. ముఖ్యంగా టూరిస్ట్ బస్సుల్లో వచ్చే ప్రయాణీకులు ఒకేసారి వచ్చి టాయిలెట్లను వాడేసి, అక్కడ రద్దీని, అపరిశుభ్రతను పెంచుతున్నారట.
దీని వల్ల పెట్రోల్ పంపు భద్రతకు కూడా సమస్య వస్తుందని, అపరిచితులు పంపు ప్రాంగణంలోకి స్వేచ్ఛగా వస్తే ప్రమాదకరమని పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ ఇటీవల కేరళ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తమ డబ్బుతో కట్టి, మెయింటైన్ చేస్తున్న టాయిలెట్లను అందరూ వాడటానికి అనుమతిస్తే కష్టమని కోర్టుకు విన్నవించుకున్నారు.

జస్టిస్ సిఎస్ డయాస్ నేతృత్వంలోని బెంచ్, పంపు యజమానుల వాదన విన్న తర్వాత ప్రైవేట్ పెట్రోల్ పంపుల్లోని టాయిలెట్లను పబ్లిక్ టాయిలెట్లుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అంతేకాదు, ప్రజలందరికీ టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఆదేశాన్ని కూడా హైకోర్టు తాత్కాలికంగా ఆపేసింది. అంటే, ప్రస్తుతానికి ఆ ప్రభుత్వ ఆదేశం అమలులో ఉండదు.
కొన్ని స్థానిక ప్రభుత్వాలు, పెట్రోల్ పంపుల్లోని టాయిలెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరినందుకే కొందరు పంపు యజమానులు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. హైకోర్టు, స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా పబ్లిక్ టాయిలెట్లను నిర్మించుకోవాలని కార్పొరేషన్లకు సూచించింది. పంపుల్లోని టాయిలెట్లను అందరి కోసం తెరవాలని చెప్పలేమని కోర్టు తేల్చి చెప్పింది.

గతంలో, టాయిలెట్ తాళం ఇవ్వనందుకు ఒక పెట్రోల్ పంపు యజమానికి రూ.1.65 లక్షల భారీ జరిమానా పడింది. అది కేరళలోనే జరిగింది. కాసర్గోడ్ నుంచి వస్తున్న ఒక ఉపాధ్యాయురాలికి టాయిలెట్ తాళం ఇవ్వకపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగి డోర్ పగలగొట్టించి మరి అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆ టీచర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించడంతో ఈ జరిమానా పడింది.
అప్పట్లో పంపు అనుమతి ఇచ్చేటప్పుడే టాయిలెట్ సౌకర్యం తప్పనిసరి అని, అది లేకుండా పంపు నడుపుతున్నారని కోర్టు చెప్పింది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పెట్రోల్ పంపుల్లో టాయిలెట్లే కాకుండా, మరికొన్ని ప్రాథమిక సేవలను కూడా ఉచితంగా అందించాలి.

అవేంటంటే కారు లేదా బైక్ టైర్లలో గాలి తక్కువైతే, పెట్రోల్ పంపుల్లో ఉచితంగా నింపించుకోవచ్చు. దీనికి ఒక్క రూపాయి కూడా అడగకూడదు. అలాగే నింపుకున్న పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతపై మీకు అనుమానం ఉంటే, అది ఎంత ఉందో కొలిపించుకోవచ్చు. ఈ టెస్ట్లు పూర్తిగా ఉచితం. మీరు అడిగితే పంపు సిబ్బంది నిరాకరించకూడదు. ఇప్పుడు టాయిలెట్లపై హైకోర్టు తీర్పు వచ్చాక, ఈ సర్వీసుల గురించి కూడా తెలుసుకుని వాడుకుంటే మంచిది.


Click it and Unblock the Notifications








