భర్త బైక్పైన గర్ల్ఫ్రెండ్.. భార్యకు ఫోటో తీసి పంపిన AI ట్రాఫిక్ కెమెరా..!!
రాష్ట్రంలోని రోడ్లపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో (AI Cameras) పనిచేసే కెమెరాల ఏర్పాటు ప్రభుత్వానికి రోజురోజుకు తలనొప్పిగా మారుతోంది. సేఫ్ కేరళ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ట్రాఫిక్ కూడళ్లలో సుమారు 726 అధునాతన AI కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చేయడంతో రోడ్డు ప్రమాదాలను నివారించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
ఈ కెమెరాల వల్ల జరిగిన మంచిని పక్కనపెడితే.. చలాన్ నుంచి తప్పించుకొనేందుకు ప్రజలు అనేక ప్రమాదకర ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఈ AI కెమెరా తీసిన ఫోటో ఓ కుటుంబం కోర్టు మెట్లు ఎక్కేందుకు కారణం అయింది.

కేరళలోని తిరువనంతపురంలో ఓ వ్యక్తి తన స్కూటర్పై స్నేహితురాలితో కలిగి ప్రయాణించాడు. హెల్మెట్ ధరించని కారణంగా AI కెమెరా ఫోటో తీసి ఆన్లైన్లో చలాన్ పంపింది. చలాన్తోపాటు సంబంధిత ఫోటోలను కూడా రవాణా శాఖ పంపింది. ఇదే అసలు గొడవకు కారణం అయింది.
ఇడుక్కి ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న వస్త్ర దుకాణంలో పనిచేసేవారు. ఏప్రిల్ 25న తన స్నేహితురాలితో కలిసి నగరంలో ప్రయాణం చేశాడు. హెల్మెట్ ధరించని కారణంగా ట్రాఫిక్ కూడళ్లలో ఏర్పాటుచేసిన అధునాతన కెమెరాలు ఆ ఫోటోలు సహా చలాన్ను ఆన్లైన్లోనే పంపాయి. అయితే ఆ వ్యక్తి నడిపిన స్కూటర్ అతని భార్య పేరు మీద ఉండడంతో ఆమె ఫోన్కు కూడా మెసేజ్ వెళ్లింది.
ఆ ఫోటోలు చూసిన అతని భార్య.. స్కూటర్ వెనుక సీట్లో కూర్చున్న మహిళ ఎవరని భర్తను ప్రశ్నించింది. అయితే ఆమెతో తనకేం సంబంధం లేదని, తాను కేవలం లిఫ్ట్ మాత్రమే ఇచ్చారని బదులిచ్చాడు. భర్త చెప్పిన సమాధానాన్ని భార్య నమ్మలేదు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
అనంతరం ఆ మహిళ మే 5న పోలీసులను ఆశ్రయించింది. తనపై, బిడ్డపై భర్త దాడిచేశాడంటూ పోలీసులకు ఫిర్యాదుచేసింది. మహిళ ఫిర్యాదుతో ఆమె భర్తపై IPC 321, 341, 294, మరియు జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 ప్రకారం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూరి జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.
గత నెలలో ఓ మహిళ అవే ఏఐ కెమెరాల నుంచి తప్పించుకొనేందుకు ప్రమాదకర ప్రయాణం చేసింది. కుమార్తె, కుమారుడితో కలిసి స్కూటర్పై వెళ్తున్న మహిళ త్రిపుల్ రైడింగ్ కింద జరిమానా నుంచి తప్పించుకొనేందుకు ప్రమాదకంగా ప్రయాణం చేసింది. కుమారుడిని స్కూటర్ ముందుభాగంలో ఆమె రెండు కాళ్ల మధ్యన దాచిపెట్టింది. ఇలా చేస్తే కెమెరాలు తన కుమారుడిని కనిపెట్టలేవని ఆమె ఉద్దేశంగా తెలిసింది. అప్పట్లో ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది.
ఓ చిన్నారిని జూట్ బ్యాగ్లో పెట్టి స్కూటర్ ముందు భాగంలో ఉంచి ప్రయాణిస్తున్న వీడియోలు కూడా ఇటీవలే వైరల్ అయ్యాయి. ఇలా చేస్తే ఏఐ కెమెరాలకు చిక్కకుండా ఉండొచ్చనేది ప్రజల ఆలోచనగా తెలుస్తోంది. ఈ అధునాతన కెమెరాల ఏర్పాటు ఆ రాష్ట్రంలో రాజకీయ విమర్శలకు కూడా కారణం అవుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కెమెరాల ఏర్పాటులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








