డ్రైవింగ్లో ఉన్నప్పుడు హ్యాండ్స్-ఫ్రీ టెక్నాలజీ ఉపయోగిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం: పోలీసులు
వాహనాన్ని నడిపేటప్పుడు ఫోన్లో మాట్లాడటం కొందరికి చాలా సరదాగా ఉంటుంది. కానీ భారతదేశంలో ఇది చట్టరీత్యా నేరం. వాహనం నడుపుతున్నప్పు ఫోన్లో మాట్లాడుతూ పోలీసులకి దొరికితే, సదరు వ్యక్తికి పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే, ఈ జరిమానా నుండి తప్పించుకునేందుకు కొందరు బ్లూటూత్ లేదా హ్యాండ్స్-ఫ్రీ పరికరాలను ఉపయోగిస్తుంటారు.

వాస్తవానికి వాహనం చలనంలో ఉన్నప్పుడు, ఏ రూపంలోనైనా అవతలి వ్యక్తితో ఫోనులో సంభాషించడం ద్వారా సదరు వాహనం నడిపే వ్యక్తి పరధ్యానానికి లోనై ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు.

ప్రత్యేకించి కేరళ రాష్ట్రంలో ఈ తరహా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో, వీటికి చెక్ పెట్టేందుకు అధికారులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఇకపై ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు బ్లూటూత్ టెక్నాలజీని ఉపయోగించి ఫోన్లో మాట్లాడినట్లయితే, వారి లైసెన్స్ను రద్దు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు, డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ చేతితో చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే కేసు నమోదు చేసేవారు. అయితే, ఇకపై వాహనం నడిపేటప్పుడు చెవిలో బ్లూటూత్ లేదా ఇయర్పోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే వారి లైసెన్స్ను రద్దు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

ఈ నిర్ణయంతో, హ్యాండ్స్-ఫ్రీ డ్రైవింగ్ విషయంలో దేశంలో ఇలాంటి చర్యలు తీసుకున్న మొదటి రాష్ట్రంగా కేరళ మారనుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు బ్లూటూత్ మాత్రమే కాదు, ఎలాంటి హ్యాండ్స్ ఫ్రీ పరికరాలను ఉపయోగించకూడదని కేరళ పోలీసులు చెబుతున్నారు. వాహనంలోని స్పీకర్ సాయంతో ఫోన్లో మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు చెబుతున్నారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్ ఫోనులో మాట్లాడటాన్ని పోలీసు అధికారులు గమనించినట్లయితే, పోలీసులు తనిఖీ చేయవచ్చు. అందుకు డ్రైవర్ నిరాకరిస్తే, సదరు డ్రైవర్ ఫొన్ కాల్ హిస్టరీని తనిఖీ చేసి, జరిమానాలు విధించే అవకాశం కూడా ఉంటుంది. కానీ, నిజ జీవితంలో దీనిని పూర్తిగా అమలు చేయడం చాలా కష్టం, ఇందుకు ఎన్నో అవాంతరాలు కూడా ఉంటాయి.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న దాదాపు అన్ని ఆధునిక కార్లు కూడా బ్లూటూత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లను స్టాండర్డ్ ఫీచర్గా కలిగి ఉంటాయి. ఇవి యూజర్ల ఫోన్ డేటాను నేరుగా కారులోని డ్యాష్బోర్డు స్క్రీన్పై ప్రదర్శిస్తుంటాయి. వీటి సాయంతో వారు ఫోన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేకుండానే కాల్స్ ఆన్సర్ చేయటం, రిజెక్ట్ చేయటం చేయవచ్చు.

అంతేకాదు, ఎస్ఎస్ఎస్లను చదవటం మరియు వాటికి రిప్లై ఇవ్వటం కూడా చేయవచ్చు. కొన్ని అధునాతన కార్లలో వాయిస్ కమాండ్ ఫీచర్ కూడా ఉంటుంది. వీటి సాయంతో డ్రైవర్ తన నోటితో కమాండ్స్ చేయటం ద్వారా ఎవ్వరికైనా కాల్ లేదా మెసేజ్ చేయవచ్చు మరియు కారులోని అనేక ఫీచర్లను కూడా వాయిస్ కమాండ్ టెక్నాలజీ సాయంతో కంట్రోల్ చేయవచ్చు.

నిజానికి ఈ టెక్నాలజీ డ్రైవర్లకు కంఫర్ట్గానే అనిపించినప్పటికీ, దాని వెనుక పెద్ద ప్రమాదమే దాగి ఉంది. ఈ వైర్లెస్ టెక్నాలజీని వినియోగించే క్రమంలో అప్రత్తంగా లేకపోయినట్లయితే, ఆ తర్వాతి పరిణామాలకు భారీ మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మరి ఇంతటి ఆధునిక యుగంలో కేరళ పోలీసులు తీసుకుంటున్న ఈ నిర్ణయం ఎంతమేర విజయం సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications








