భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..
భారత నావికాదళంలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరనుంది. నరేంద్ర మోడీ భారత ప్రధానికి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి దేశంలో త్రివిధ దళాలను బలోపేతం చేయటంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, భారత నావికా దళంలో కొత్తగా ఎంహెచ్ -60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్లు వచ్చి చేరనున్నాయి.

అమెరికాకి చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ భారతదేశం కోసం తయారు చేస్తున్న ఎంహెచ్ -60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్ మొట్టమొదటి ఫొటోలను విడుదల చేసింది. భారతదేశంలో నావీ డే సందర్భంగా లాక్హీడ్ మార్టిన్ ఈ వివరాలను వెల్లడించింది. ఈ సంస్థ నుండి మొత్తం 24 హెలికాఫ్టర్లు భారత్కు చేరుకోనున్నాయి.

భారతీయ జలాల భద్రత మరియు నిఘాలో ఎంహెచ్-60 రోమియో మల్టీరోల్ హెలికాప్టర్లు ముఖ్యమైన పాత్రను పోషించనున్నాయి. ఈ హెలికాప్టర్లు నీటి లోపల మరియు వెలుపల ఉండే శత్రువులను గుర్తించేందుకు మరియు వారితో పోరాడేందుకు అవసరమైన అన్ని ఆధునిక పరికరాలు, ఆయుధాలను కలిగి ఉంటుంది.

ఈ హెలికాప్టర్లో క్షిపణులు మరియు టార్పెడోలు అమర్చబడి ఉంటాయి. ఇవి నీటి ఉపరితలం పైన మరియు నీటి అడుగున ఉండే లక్ష్యాలను సైతం ఛేదించగలవు. ఇందులో హెల్ఫైర్ క్షిపణులు మరియు ఎంకే-54 టార్పెడోలు ఉంటాయి.

శత్రువుల జలాంతర్గాములు, ఓడలను నాశనం చేయగల శక్తిసామర్థ్యాలు వీటికి ఉంటాయి. అంతేకాకుండా, సముద్ర జలాల్లో రెస్క్యూ ఆపరేషన్లను నిర్వహించడానికి కూడా వీటిని రూపొందించబడ్డాయి. లాక్హీడ్ మార్టిన్ నిర్మించిన ఈ ఎంహెచ్-60 హెలికాఫ్టర్లు, ప్రస్తుతం భారత నావీ ఉపయోగిస్తున్న బ్రిటీషర్లు నిర్మించిన సీ కింగ్ హెలికాఫ్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి.

ఈ హెలికాఫ్టర్లలో అధునాతన రాడార్ వ్యవస్థలు, మెషిన్ గన్లు, ఆధునిక రెస్క్యూ పరికరాలు మరియు సెన్సార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి క్షిపణి లేదా శత్రువులు చేసే దాడిని ముందుగానే గుర్తించి సమాచారాన్ని అందిస్తాయి. ఇందులో అధునాతన సోనార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు, ఇది సముద్రం లోతులో దాగి ఉన్న జలాంతర్గాములను సైతం గుర్తించగలదు.

ఈ హెలికాప్టర్ గంటకు గరిష్టంగా 267 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇంధన ట్యాంక్ నిండినప్పుడు, ఈ హెలికాప్టర్ 10,659 కిలోల బరువుతో 834 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. చైనా, పాకిస్తాన్లతో సముద్ర సరిహద్దును పర్యవేక్షించడానికి ఈ హెలికాప్టర్లను మోహరించనున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమైంది. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, అమెరికా నుండి భారతదేశానికి అపాచీ మరియు ఎంహెచ్-60 రోమియో హెలికాప్టర్లు సహా 3 బిలియన్ డాలర్ల ఆధునిక సైనిక పరికరాలు రానున్నాయి.


Click it and Unblock the Notifications