మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
ఎండలు ముదిరిపోతున్నాయి. ఈ వేసవిలో బైక్పై రైడ్ అంటే భానుడి భగభగలకు చెమటలు పట్టి నరకం చూడాల్సిందే. ఎక్కడైనా చల్లని నీడ దొరికితే కాసేపు సేదతీరితే చాలనిపిస్తుంది ఎవరికైనా.. ఇక ట్రాఫిక్ పోలీసుల విషయం అయితే.. హెల్మెట్ పెట్టుకుని రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రించడం పెద్ద సవాలు. కానీ వారికోసం ఇక్కడ చల్లచల్లని హెల్మెట్లు అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ట్రాఫిక్ను నియంత్రించే పోలీసులకు ఏసీ హెల్మెట్లు(AC Helmets) అందించింది ప్రభుత్వం. ఇది ఒక పైలట్ ప్రాజెక్టు లాంటిదని చెప్పవచ్చు. ఇది విజయవంతమైతే, పోలీసు అధికారులందరికీ ఏసీ హెల్మెట్లను అందజేస్తారు. అసలు ఈ హెల్మెట్లను ఎవరు రూపొందించారు.. పూర్తి సమాచారం ఈ కథనంలో..

మండే వేసవిలో నడి రోడ్డుపై ట్రాఫిక్ను నియంత్రిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎండ తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు IIM వడోదర విద్యార్థులు ఏసీ హెల్మెట్ రూపొందించారు. ఇప్పటికే అహ్మదాబాద్ ప్రాంతంలో ట్రయల్ రన్గా హెల్మెట్ను గతేడాది పరీక్షించారు. ఇది మరింత అభివృద్ధి చేయబడింది మరియు ఇప్పుడు దీనిని టెస్ట్ చేసేందుకు వివిధ రాష్ట్రాల పోలీసులకు అందించారు.
ఈ ఏడాది కూడా వడోదర ప్రాంతంలోని పోలీసులకు అలాంటి హెల్మెట్లు అందజేయగా, ఆ తర్వాత కాన్పూర్ ప్రాంతంలోని పోలీసులకు కూడా ఏసీ హెల్మెట్లను అందించారు. ఈ సందర్భంలో, లక్నోలోని ట్రాఫిక్ పోలీసులకు కూడా ఏసీ హెల్మెట్లను అందించాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకోసం IIM విద్యార్థులు తయారు చేసిన హెల్మెట్లను పరీక్షించేందుకు లక్నో పోలీసులకు అందజేశారు.

ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఏటా వేసవి(AC Helmets In UP)లో పోలీసులకు ఏసీ హెల్మెట్లను అందజేయనున్నట్లు సమాచారం. ఈ ఏసీ హెల్మెట్ పూర్తిగా బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ హెల్మెట్ను ఒకసారి ఛార్జింగ్ చేయడం ద్వారా నిరంతరం 8 గంటల పాటు బ్యాటరీతో పనిచేసేలా ఈ హెల్మెట్ను రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాటరీని అందించారు.
హెల్మెట్కు వెనుక వైపున ఉన్న వైర్ ద్వారా బ్యాటరీని పోలీసు నడుముకు పట్టుకునే ఆప్షన్ అందించారు. కాగా ఈ హెల్మెట్ మొత్తం బరువు 500 గ్రాములు. సాధారణ హెల్మెట్ బరువుతో సమానంగా ఉండే ఈ ఏసీ హెల్మెట్ ధరించడం వల్ల పోలీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. ఈ హెల్మెట్ ధరించినప్పుడు తల లోపలి భాగం వేడిగా అనిపించకుండా గాలి ప్రసరించేలా రూపొందించారు.

ఇంకా ఈ ఏసీ హెల్మెట్కు ఫ్రంట్ వైజర్స్ అందించారు. ఇది సన్ షేడ్స్ మాదిరిగా పనిచేస్తూ కళ్లను రక్షించడానికి ఉపయోగపడుతుంది. దీంతో ఎండలో పనిచేసే పోలీసులపై ఈ వేసవి తాపం పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల వరకు ఉండటంతో ఈ ఏసీ హెల్మెట్లు వారికి ఉపశమనం కలిగించనున్నాయి.
ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వేసవి తాపాన్ని చల్లబరిచేందుకు పోలీసులు ఈ ఏసీ హెల్మెట్ని ఉపయోగిస్తుండగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా వీటిని అమల్లోకి తెస్తారో లేదో చూడాలి. వేసవిలో ఇలాంటి ఏసీలు ట్రాఫిక్ పోలీసులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి వీరికి ఇవి చాలా అవసరం.
డ్రైవ్స్పార్క్ వ్యాఖ్య: ట్రాఫిక్ పోలీసు అధికారులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఈ ఏసీ హెల్మెట్ల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా బైక్పై లాంగ్ జర్నీ, ఫీల్డ్ వర్క్, మార్కెటింగ్ చేసే వారికి ఈ ఏసీ హెల్మెట్లు.. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆకట్టుకునే డిజైన్లలో వీటిని రూపొందిస్తే బైక్ రైడర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








