పూర్తి చార్జ్పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
భారతదేశానికి మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది మన దేశీయ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. మహీంద్రా బెంగుళూరుకి చెందిన రేవా అనే ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ స్వాధీనం చేసుకున్న తర్వాత మహీంద్రా రేవా గా మారి ఈ2ఓ అనే చిన్న కారును, ఇ-వెరిటో అనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసింది.

అయితే, అప్పట్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సరైన మౌళిక సదుపాయాలు లేకపోవటంతో ఈ కార్లు ఆశించిన విజయాలను సాధించలేకపోయాయిం. మరోవైపు ఈ ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ (మైలేజ్) కూడా తక్కువగా ఉండటం కూడా వీటి వైఫల్యానికి ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ రెండు కార్లు ఒకే ఛార్జీపై 100-110 కిలోమీటర్ల రేంజ్ని మాత్రమే అందించేవి.

మహీంద్రా విడుదల చేసిన తమ ఈ2ఓ ఎలక్ట్రిక్ కారుకు కొనసాగింపుగా కంపెనీ 2016లో ఈ2ఓ ప్లస్ అనే 5-డోర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. అప్పట్లో ఈ కారు పూర్తి చార్జ్పై గరిష్టంగా 140 కిలోమీటర్ల రేంజ్ని ఆఫర్ చేసేది. ఇందులో 210 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ను ఉపయోగించే వారు.

కాగా, ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ జోరందుకున్న నేపథ్యంలో, కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మహీంద్రా ప్రస్తుతం విక్రయిస్తున్న కొన్ని మోడళ్లను ఆధారంగా చేసుకొని కంపెనీ వాటిలో కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంట, పూణేకు చెందిన ఒక సంస్థ మహీంద్రా ఈ2ఓ ప్లస్ రేంజ్ను విస్తరించడానికి ప్రయత్నించింది. పూణేకు చెందిన నార్త్వే మోటార్స్పోర్ట్ అనే కంపెనీ మహీంద్రా ఈ2ఓ ప్లస్ ఎలక్ట్రిక్ కార్ యొక్క బ్యాటరీ సామర్థ్యాన్ని మొత్తంగా 28 కిలోవాట్లకు పెంచారు.

కారులో ఇదివరకే ఉన్న 11 కిలోవాట్ ప్లస్ అదనంగా జోడించిన 17 కిలోవాట్ స్పెషల్ బ్యాటరీ ప్యాక్తో ఇది సాధ్యమైంది. మహీంద్రా ఈ2ఓ ప్లస్ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ప్యాక్లో చేసిన ఈ మార్పు కారణంగా, కారు పూర్తి చార్జ్పై 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు నార్త్వే మోటార్స్పోర్ట్ సంస్థ పేర్కొంది.

మహీంద్రా ఈ2ఓ ప్లస్ రియల్ టైమ్ రేంజ్ను చూపించే ఓ వీడియోని కూడా ఈ కంపెనీ విడుదల చేసింది. ఇందులో బ్యాటరీ చార్జ్ 100 శాతం నుండి 4 శాతం చేరుకునే సమయానికి కారు అప్పటికే 350 కిలోమీటర్ల ట్రిప్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మహీంద్రా ఈ2ఓ ప్లస్ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించిన ఇండక్షన్ మోటార్లు గరిష్టంగా 26 బిహెచ్పి పవర్ను మరియు 70 న్యూటన్ మీటర్ల టార్క్ను జనరేట్ చేస్తాయి. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఈ కారులోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 7 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది.

గత 2016లో మహీంద్రా ఈ కారును మార్కెట్లో విడుదల చేసినప్పుడు, మూడు వేరియంట్లలో లభించేది. అప్పట్లో ఈ కారు ధరలు రూ.5.46 లక్షల నుంచి రూ.8.46 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండేవి. ఈ2ఓ ప్లస్ అమ్మకాలు కూడా అంతంమాత్రంగా ఉండటంతో 2019లో కంపెనీ ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది.


Click it and Unblock the Notifications








