సిగ్నల్ జంప్ చేసి బైక్ను ఢీకొట్టిన స్కార్పియో డ్రైవర్.. రెండేళ్ల తర్వాత..
దేశంలోని వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం సర్వసాధారణమే.. ఆఫీస్కు లేటవుతుందనో, ఎమర్జెన్సీ మీటింగ్ అనో, లేదా ట్రాఫిక్లో వేచి ఉండలేకనో చాలా మంది సిగ్నల్ జంప్ చేస్తుంటారు. వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించడం కూడా సర్వసాధారణమైపోయింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నా కొందరి తీరు మారడం లేదు.
హైదరాబాద్ మహానగరం ఇందుకు అతీతం కాదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఇప్పటికే మన సైబరాబాద్ పోలీసులు పలు వీడియోలను ఉదాహరణగా సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొందరి నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

హైదరబాద్లోని ఓ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలన్నీ బారులు తీరి ఉండగా, ఓ స్కార్పియో కారు డ్రైవర్ మాత్రం సిగ్నల్ జంప్ చేశాడు. అంతే కాకుండా వేరే మార్గం నుంచి వస్తున్న బైకర్ను వేగంగా ఢీకొట్టి వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సైబరాబాద్ పోలీసులు ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు ఏ మాత్రం భయం లేకుండా రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నారు.

నిజానికి ఈ సంఘటన 2021లో జరిగింది. మైలార్దేవ్పల్లి దుర్గానగర్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడి ట్రాఫిక్ సిగ్నల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ వీడియో రికార్డైంది. ఘటన జరిగి రెండేళ్లు దాటినా వాహనదారులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఈ వీడియోను షేర్ చేశారు.
ఈ వీడియోలో గ్రీన్ సిగ్నల్ పడి వాహనాలు ముందుకు వెళ్తుంటే మరోవైపు రెడ్ సిగ్నల్ను క్రాస్ చేసి గ్రీన్ సిగ్నల్ వచ్చే వాహనాల వైపు వెళ్లడం సమంజసం కాదు. అదే సమయంలో డ్రైవర్ అతివేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్ను ఢీకొనడంతో స్కార్పియో డ్యామేజ్ అయింది. ఈ ఘటనలో బైక్ నడిపే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించలేదు.

ప్రమాదం జరిగిన వెంటనే బైకర్ కారు బానెట్పై పడి, ఆపై నేలపై పడిపోయాడు. ఇదంతా కేవలం క్షణకాలంలో జరిగిపోయింది. బైకర్ వెంటనే లేచి డ్రైవర్తో గొడవకు దిగగా, డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. హైదరాబాద్ పోలీసులు సీసీటీవీ వీడియో ఆధారంగా కారు యజమాని, డ్రైవర్ను గుర్తించారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన డ్రైవర్పై పోలీసుల చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన బైకర్ను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం కారు డ్రైవర్ బాధ్యత. అంతే కాకుండా పోలీసులకు సమాచారం అందించాలి. ఇవేమీ చేయకుండా అక్కడి నుంచి పరారవ్వడం నేరం. నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తి మోటారు వాహనాల చట్టం 1998 సెక్షన్ 187 ప్రకారం శిక్షార్హులుగా గుర్తించాలి.
డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








