గో గ్రీన్ ఫర్ ఏ బిగ్గర్ గోల్.. అంటున్న ప్రముఖ మూవీ డైరెక్టర్
భారతదేశంలో వాహనాల కారణంగా కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో, పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల్లో అవగాహన రోజురోజుకీ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విషయంలో ఈ ట్రెండ్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఏడాది కాలంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహన తయారీదారులను మరియు వినియోగదారులను ప్రోత్సహిస్తోంది.

అంతేకాకుండా, సెలబ్రిటీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వాహనాలను వినియోగించడం వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. తాజాగా, మాలీవుడ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఓ ఎలక్ట్రిక్ కార్ మరియు ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశారు. తాను కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల గురించి చాలా తెలుసుకున్నానని, భవిష్యత్తులో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్నాని జీతూ జోసెఫ్ చెప్పారు.

శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల వాడకం వల్ల ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో తనవంతు పాత్రగా ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేశానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా, మలయాళ దర్శకుడు తన సోషల్ మీడియా ఛానెల్ పై 'గో గ్రీన్ ఫర్ ఏ బిగ్గర్ గోల్' అనే క్యాప్షన్తో తన వాహనాలతో దిగిన ఫొటోలోను పోస్ట్ చేశారు. ఎమ్జి మోటార్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎమ్జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) మరియు టీవీఎస్ కంపెనీ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ (TVS iQube) లను ఆయన కొనుగోలు చేశారు.

ఎమ్జి హెక్టర్ సక్సెస్ ద్వారా భారత మార్కెట్లో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఎమ్జి మోటార్ బ్రాండ్, తమ జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీతో ఎలక్ట్రిక్ మార్కెట్ను శాసించింది. ఈ కంపెనీ 2020 జనవరిలో తొలిసారిగా ఈ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఆ తర్వాత 2021లో ఇందులో ఓ అప్డేటెడ్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్సైట్ మరియు ఎక్స్క్లూజివ్ అనే రెండు ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో ఎక్సైట్ వేరియంట్ ధర రూ. 20.99 లక్షలు కాగా ఎక్స్క్లూజివ్ వేరియంట్ ధర రూ. 24.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

ఎమ్జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 44.5 kWh IP6 సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్పి శక్తిని మరియు 353 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. చార్జింగ్ విషయానికి వస్తే, హోమ్ ఛార్జర్ ద్వారా ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 6 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే 50 కిలోవాట్ల డిసి ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 50 నిమిషాల్లోనే ఈ ఎస్యూవీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

రేంజ్ విషయానికి వస్తే, ఎమ్జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్పై గరిష్టంగా 419 కిమీ రేంజ్ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది ఈ విభాగంలో లభిస్తున్న టాటా నెక్సాన్ ఈవీ రేంజ్ (312 కిమీ) కన్నా ఎక్కువ మరియు హ్యుందాయ్ కోన ఆఫర్ చేసే రేంజ్ (452 కిమీ) కన్నా తక్కువగా ఉంటుంది. MG ZS EV కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఈ కారులో మూడు డ్రైవింగ్ మోడ్లతో పాటుగా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

జీతూ జోసెఫ్ కొనుగోలు చేసిన రెండవ ఎలక్ట్రిక్ వెహికల్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iCube) విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పాటుగా 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఒకే ఛార్జ్ (ఎకో మోడ్) పై గరిష్టంగా 75 కి.మీ పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ వరకు ఉంటుంది. ఈ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 40 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ప్రస్తుతం, ఇది దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ స్కూటర్ లోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవడానికి 4 గంటల సమయం పడుతుంది, అదే వీటిని పూర్తిగా ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది. ఐక్యూబ్ లేటెస్ట్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో లభిస్తుంది. దీని సాయంతో స్కూటర్కు సంబంధించిన అనేక విషయాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవటం మరియు కంట్రోల్ చేయటం చేయవచ్చు. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఎల్ఈడీ హెడ్ల్యాంప్లు, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, పెద్ద టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. భారత మార్కెట్లో దీని ధర లక్ష రూపాయలకు (ఎక్స్-షోరూమ్) పైగా ఉంటుంది.


Click it and Unblock the Notifications