మైనర్ తమ్ముడికి బైక్ ఇచ్చిన అన్న.. రూ.34,000 జరిమానాతో పాటు అన్నకు జైలు శిక్ష విధించిన కోర్టు
దేశంలో మైనర్లు వాహనాలు నడపడం చట్ట విరుద్ధం. మైనారిటీ తీరకుండా వాహనం నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. కానీ ఇటీవల రోడ్లపై అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా స్కూల్ స్టేజ్ దాటని పిల్లలు సైతం కార్లు, బైకులతో రోడ్లపై రైడ్లు చేస్తున్నారు.
మైనారిటీ తీరని వారు వాహనం నడిపినా.. వారిని ప్రోత్సహించినా.. ఇద్దరికీ శిక్ష లేదా జరిమానా తప్పదు. కానీ మన దేశంలో రోడ్లపై కుర్రకారు బైకులు, కార్లు, స్కూటర్లను నడపడం చూస్తూనే ఉంటాం. విచిత్రమేమంటే వారి కుటుంబ సభ్యులే వారిని ప్రోత్సహిస్తుంటారు. ప్రమాదాలకు జరగడానికి ఇది కూడా ఓ కారణంగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

పబ్లిక్ రహదారులపై మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, కారు డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి. వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా జరిమానా లేదా శిక్ష తప్పదు. ఇటీవల కేరళలో ఓ మైనర్ బాలుడు వాహనం నడిపినందుకు గాను కేరళ హైకోర్టు శిక్షతో పాటు జరిమానాను సైతం విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్టేట్ వర్సెస్ రోషన్ షిజు(State Vs Roshan Shiju) కేసులో, ఎర్నాకుళం అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నైనా కేవీ సంచలన తీర్పు వెలువరించారు. మైనర్ బాలుడితో వాహనం నడిపించినందుకు గాను ఆ బైక్ రిజిస్ట్రేషన్ను 12 నెలల పాటు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మైనర్ తమ్ముడిని బైక్ నడపడానికి అనుమతించిన అన్న డ్రైవింగ్ లైసెన్స్ను కూడా 3 నెలల పాటు రద్దు చేశారు.

కుటుంబీకుల అంగీకారంతోనే మైనర్ బాలుడు ద్విచక్ర వాహనం నడిపాడని కోర్టులో నిరూపించబడింది. అంతేకాకుండా మైనర్ బాలుడు వాహనం నడపడం మాత్రమే కాదు, బైక్ ముందు మరియు వెనుక రిజిస్ట్రేషన్ ప్లేట్లు కూడా లేవు. దీంతో మైనర్ను బైక్ నడపడానికి ప్రోత్సహించినందుకు గాను సదరు అన్నకు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.34,000 జరిమానా విధించింది.
అంతేకాకుండా, ద్విచక్ర వాహనానికి టర్న్ ఇండికేటర్లు, రేర్ వ్యూ మిర్రర్స్ కూడా లేవని అధికారులు పేర్కొన్నారు. దేశంలో రోడ్లపై ప్రయాణించాలంటే ఏ వాహనానికైనా ఈ భద్రతా ఫీచర్లు తప్పనిసరి. వివరాలు, సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది.
టూ వీలర్లు లేదా ఫోర్ వీలర్ వాహనాలు నడపడానికి మైనర్లను ఎందుకు అనుమతించకూడదనేదానికి ఈ కేసు సరైన ఉదాహరణగా నిలుస్తుంది. మైనర్లు వాహనం నడపడమనేది ఇటీవల ట్రెండ్గా మారింది. వారు తమ పిల్లలను పబ్లిక్ రోడ్లపై కార్లు నడపడానికి అనుమతిస్తున్నారు. అంతే కాకుండా ఈ సంఘటనల వీడియోలను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు.
చాలా సందర్భాల్లో ఈ ఉల్లంఘనలు ట్రాఫిక్ పోలీసులు, ఉన్నతాధికారుల దృష్టికి రావడం లేదు. ఒకవేళ మీ పిల్లలకు బండి నేర్పించాలని మీరు అనుకుంటే ఇలా పబ్లిక్ రోడ్లపై కాకుండా జన సంచారం లేని ప్రాంతాలు లేదా ప్రైవేట్ స్థలాల్లో నేర్పించడం ఉత్తమం.
పిల్లలను పబ్లిక్ రోడ్లపై డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలకే కాకుండా ఇతర వాహనదారుల జీవితాలకు కూడా ప్రమాదం కలిగిస్తున్నారు. డ్రైవింగ్ అనేది బాధ్యతాయుతమైన పని. మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు చట్టపరమైన వయస్సు 18 సంవత్సరాలు అని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications








