రన్నింగ్ ట్రాక్టర్తో డేంజరస్ స్టంట్స్.. టైర్ల కింద పడి 29 ఏళ్ల వ్యక్తి మృతి, వైరల్ అవుతున్న వీడియో.!!
రియాల్టీ షోల్లో, కొన్ని ఈవెంట్లలో సాహసోపేతమైన స్టంట్లు చేయడం చూస్తూనే ఉంటాం. నిపుణుల పర్యవేక్షణలో ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఒక్కోసారి దురదృష్టవశాత్తు అవి ఫెయిల్ అయ్యి ప్రాణాల మీదకు వస్తాయి. అలా ట్రాక్టర్తో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్లోని గురుదాస్పూర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. పంజాబ్లో జరుగుతున్న ఓ మేళాలో ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఉత్సవాలను తిలకిస్తుండగా అకస్మాత్తుగా ట్రాక్టర్ స్టంట్స్లో వ్యక్తి మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. హఠాత్పరిణామానికి అందరూ షాక్కు గురయ్యారు.

ఇందుకు సంబంధించిన వీడియోను అక్టోబర్ 29 న X(గతంలో ట్విట్టర్)లో షేర్ చేశారు. పంజాబ్లోని గురుదాస్పూర్లో శనివారం(అక్టోబర్ 28న) గ్రామీణ క్రీడా ప్రదర్శనలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఫతేఘర్ చురియన్ నియోజకవర్గం పరిధిలోని సర్చూర్ గ్రామంలో జరుగుతున్న గ్రామీణ క్రీడా ప్రదర్శనల్లో భాగంగా.. సుఖ్మన్దీప్ సింగ్ అనే 29 ఏళ్ల వ్యక్తి ట్రాక్టర్తో స్టంట్లు చేశాడు.
మీడియా కథనాలు, వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అక్కడి గ్రౌండ్లో కేవలం ఇంజిన్తో ఉన్న ట్రాక్టర్ను ఆన్ చేసి పైకి లేపి వదిలేశారు. అప్పుడు ట్రాక్టర్ ఆటోమేటిక్గా గ్రౌండ్లో కదులుతూ ఉంది. ఇంకా ఈ వీడియోలో సుఖ్మన్దీప్తో మరో ఇద్దరిని అక్కడ చూడవచ్చు. ఈ క్రమంలో సుఖ్మన్దీప్ నడుస్తున్న ట్రాక్టర్పై ఎక్కేందుకు యత్నించాడు.

మొదటగా సుఖ్మన్దీప్ తన పాదాలను కదులుతున్న టైర్పై ఒకదానిపై ఒకటి ఉంచాడు. అనంతరం ట్రాక్టర్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంజిన్ రన్ అవుతుండగా రెండు వీల్స్ కదులుతుండటంతో అతను పట్టు తప్పి రెండు టైర్లకు మధ్యలో పడిపోయాడు. టైర్ల మధ్యలో క్రషర్ ఉండటం, ట్రాక్టర్ కదులుతుండటంతో దానిలో పడి సుఖ్మన్దీప్ సింగ్ నలిగిపోయాడు.
ఇది గమనించిన అక్కడున్న వారు వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే సుఖ్మన్దీప్ యాక్సిడెంట్లో నలిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సుఖ్మన్దీప్ చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈ విషాధ సంఘటనతో మేళాను రద్దు చేసినట్లు ఆ గ్రామానికి చెందిన గురుముఖ్ సింగ్ అనే రైతు తెలిపారు.

బటాలాలోని తాతే గ్రామానికి చెందిన సుఖ్మన్దీప్కు తల్లిదండ్రులు, భార్య, ఏడేళ్ల కుమారుడు ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏటా సంబంరంగా జరుపుకొనే గ్రామీణ క్రీడా ఉత్సవాల్లో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ఏదేమైనా కదులుతున్న వాహనాలపై ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం సరికాదని ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది.
దేశంలో తరచూ రహదారులపై కూడా కొందరు ప్రమాదకర స్టంట్స్కు పాల్పడటం లాంటి సంఘటనలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. బైక్పై వెళ్తూ కొన్ని యువజంటలు పబ్లిక్ రోడ్లపై రొమాన్స్ చేసుకోవడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వీడియోలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయి.

అయినప్పటికీ కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరం. ఇక కార్లలో ప్రయాణిస్తూ సన్రూఫ్ నుంచి బయటికి వచ్చి చూడటం, డోర్లు తీసి వేలాడటం, కారులో వెళ్తూ టపాసులు కాల్చడం ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. పలు సందర్భాల్లో జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








