ఏకంగా పోలీస్ కారునే చోరీ చేసిన ఘరానా దొంగ.. ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్.. మాంచి ఝలక్ ఇచ్చిన పోలీసులు
దేశంలో వాహన దొంగతనాల ఘటనలు పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. హై సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లను సైతం చాలా ఈజీగా చోరీ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ సాయంతో దొంగలు సునాయాసంగా తాళం తీసి దర్జాగా తీసుకెళ్తున్నారు. వీరిని పట్టుకోవడం పోలీసులకు పెద్దగా సవాలుగా మారుతుంటే.. ఇప్పుడు ఏకంగా పోలీసు కారునే దొంగతనం చేశాడు ఓ ఘరానా దొంగ..
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో హైటెక్ పద్ధతిలో కార్లను దొంగిలిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఈ తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే రూ. లక్షల విలువ చేసే కార్లను చోరీ చేస్తున్నారు. అయితే గుజరాత్లో మాత్రం ఓ దొంగ ఏకంగా పోలీసు (Man Steals Mahindra Bolero)అధికారిక వాహనంలో అది కూడా పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరాడు.

గుజరాత్లోని ద్వారకలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మోహిత్ శర్మ అనే వ్యక్తి ఈ నెల 30న, గురువారం ఉదయం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న పోలీస్ వాహనం మహీంద్రా బొలెరో కారును తీసుకెళ్లాడు. ఆ రోజు 8.15 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే చోరీ చేసిన 6 గంటల్లో అంటే మధ్యాహ్నం 2.30 గంటలకు జామ్నగర్లో పోలీసులు అతడిని పట్టుకున్నారు.
కాగా మోహిత్ శర్మపై ఇప్పటికే పరువు నష్టం కేసు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహిత్ మొదటగా బైక్పై ద్వారక చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ద్వారకకు చేరుకోగానే పోలీస్ స్టేషన్ సమీపంలో బైక్ను ఆపి పోలీస్ వాహనం మహీంద్రా బొలెరో(Mahindra Bolero)తో పరారయ్యాడు.

ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ సమీర్ సర్దా స్పందించారు. ద్వారకకు నిరంతరం పర్యాటకులు వస్తుండటంతో.. పోలీసులు తరచూ అత్యవసర పరిస్థితుల్లో కార్లను ఉపయోగిస్తారని తెలిపారు. ఈ క్రమంలోనే కారు తీసుకెళ్లిన వ్యక్తి పోలీసులు అనుకొని పొరబడినట్లుగా చెప్పాపు. అయితే కారు నడుపుతున్న వ్యక్తిని వారెవరూ చూడకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.
కాగా శర్మ పరువు నష్టం కేసులో గాంధీధామ్ పోలీసుల విచారణలో ఉన్నట్లు సమాచారం. అయితే పోలీసు వాహనాన్ని దొంగిలిస్తానని గతంలో విచారణ అధికారిని బెదిరించినట్లు ఆయన తెలిపారు. కారును దొంగిలించి స్క్రాప్కు విక్రయించడమే అతని ఉద్దేశమని అనుమానించినట్లు పేర్కొన్నారు. అయితే చోరీ చేయాలనే ఉద్దేశమే అతనికి ఉందా అనేది స్పష్టంగా తెలియదు.

ద్వారకా పోలీస్ స్టేషన్లో ఆ పోలీసు కారు డ్రైవర్ కొంత సమయం గడిచిన తర్వాత అక్కడ కారు లేకపోవడాన్ని గుర్తించి.. పోర్బందర్ మరియు జామ్నగర్ పోలీస్ స్టేషన్లతో సహా ఇతర పోలీసు స్టేషన్లు, పెట్రోలింగ్ యూనిట్లకు సమాచారం అందించారు. అలర్ట్ అయిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, కురంగ, ఖంభాలియా వద్ద ఉన్న టోల్ గేట్లను మహీంద్రా బొలెరో దాటినట్లు గుర్తించారు.
అయితే మోహిత్ పట్టుబడటానికి ముందు దాదాపు 200 కిలోమీటర్లు కారును నడిపినట్లు సమాచారం. ఇంకా విచిత్రమేమంటే.. అతను పోలీస్ కారును దొంగిలించడమే కాకుండా మహీంద్రా బొలెరోతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. బొలెరోలో ఫుల్ ట్యాంక్ నిండి ఉండటంతో ఏ పెట్రోల్ బంక్ వద్ద కూడా ఆగలేదు.

చోరీకి గురైన ఆరు గంటల తర్వాత కారును గుర్తించిన పోలీసులు మోహిత్ శర్మను అరెస్టు చేశారు. సంఘటనలో అతనిపై ఎన్ని కేసులు నమోదు చేశారనేది స్పష్టంగా తెలియదు. ఇంకా మోహిత్ శర్మకు గంజాయి అలవాటు ఉన్నట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు. ఆ మత్తులోనే మోహిత్ ఈ ఘటనకు పాల్పడ్డాడా అనేది తెలియదు.
కాగా ఏడాది క్రితం కర్ణాటకలో ఇదే తరహా సంఘటన చోటుచేసుకుంది. పోలీస్ జీప్ నడపాలనే కోరికతో ఓ వ్యక్తి ఏకంగా పోలీస్ వాహనం మహీంద్రా బొలెరోను చోరీ చేశాడు. తన ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి అందులో 100 కి.మీ ప్రయాణించాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనకు అన్ని రకాల వాహనాలు నడిపిన అనుభవం ఉంది కానీ.. పోలీసు జీపు నడిపిన అనుభవం లేదని అతను చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications








