వామ్మో ఒకే స్కూటర్పై ఏడుగురు పిల్లలతో ప్రయాణం.. కట్ చేస్తే..!
దేశంలో రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు పట్టుబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణించడం, పరిమితికి మించి బండిపై ప్రయాణించడం లాంటివి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో పాటు ప్రయాణికుల భద్రతకు ఆటంకం కలిగిస్తాయి. తాజాగా ముంబైలో స్కూటర్పై ఏడుగురు ప్రయాణిస్తున్న వీడియో వైరల్గా మారింది.
ఇటీవల స్కూటర్పై ఓ వ్యక్తి ఏడుగురిని ఎక్కించుకుని హెల్మెట్ లేకుండా రోడ్డుపై ప్రయాణించడం తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఏడుగురూ మైనర్లు(చిన్నారులు) కావడం ఆందోళనను రేకెత్తిస్తోంది. ఏ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ నెల(జూన్) 20న ముంబయి సెంట్రల్ బిడ్జి వద్ద ఓ వ్యక్తి ఏడుగురు పిల్లలతో స్కూటర్పై ప్రయాణిస్తున్న దృశ్యాన్ని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వెళ్లడంతో పోలీసులు సదరు వ్యక్తిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు.
కాగా ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఆ వ్యక్తి గుర్తింపు, ఇతర వివరాలను వెల్లడించలేదు. గోప్యంగా ఉంచారు. మార్ఫింగ్ చేసిన ముఖంతో అదే స్కూటర్పై ఉన్న ఆ వ్యక్తి ఫొటోను రోడ్డుపై పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోతో కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనంతరం ఇలా పేర్కొన్నారు.

'మేము ఈ ఫొటోను మార్ఫింగ్ చేయడం ద్వారా ఈ వ్యక్తికి మద్దతిస్తున్నట్లు కాదు. ఈ రైడర్ స్కూటర్పై కూర్చున్న వారితో పాటు ఇతర ప్రయాణికులను ప్రమాదంలో పడేశాడు. కావున హత్యాయత్నంగా భావిస్తూ ఈ వ్యక్తిపై సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశాం.' అనే తెలిపారు.
మహారాష్ట్ర వీధుల్లో హెల్మెట్ లేకుండా ప్రయాణించడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర రవాణా శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికల ప్రకారం.. గతేడాది సుమారు 7,700 మంది వాహనదారులు ప్రమాదాల్లో మరణించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం కారణంగానే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని నివేదిక పేర్కొంది.
నివేదిక ప్రకారం రాష్ట్రంలో గతేడాది దాదాపు 15,000 రోడ్డు ప్రమాద మరణాలు నమోదయ్యాయి. బాధితుల్లో సగానికి పైగా ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కారణంగా చాలా మంది ద్విచక్ర వాహనదారుల తలలకు గాయాలయ్యాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం హెల్మెట్ ధరించకపోవడం చట్టరీత్యా నేరం.
ద్విచక్ర వాహనం నడుపుతూ హెల్మెట్ లేకుండా పట్టుబడితే రూ. 1000 జరిమానా విధించబడుతుంది. ఇంకా పోలీసులు లైసెన్స్ను రద్దు చేసే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో ద్విచక్ర వాహనదారులకు మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
అదే విధంగా గత కొన్ని నెలల క్రితం.. మూడు బైకులపై పద్నాలుగు వ్యక్తులు ప్రయాణించిన వీడియో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అందులో ఒక బైకుపై ఆరుగురు ప్రయాణిస్తుండగా మరో రెండు బైకులపై నలుగురు చొప్పున ప్రయాణించారు. వారిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు.
అంతేకాకుండా బైక్లపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వాటిపై నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వారిపై కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications








