మన్మోహన్ సింగ్ ఒక్క నిర్ణయంతో అంతా మార్చేశారు.. అప్పుడు అలా చేయకపోతే.. మారుతీ-సుజుకీ ఇలా ఉండేవి కావు..!
దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, ఆర్థిక వేత్త, భారత ప్రధానిగా విశేష సేవలు అందించిన మన్మోహన్ సింగ్(Manmohan Singh) గురువారం కన్నుమూశారు. 92 ఏళ్ల వయసు కలిగిన ఆయన వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో దేశంలో విషాధ ఛాయలు అల్లుకున్నాయి. దేశంలోని ప్రధాన నాయకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎలాంటి వివాదాలకు పోకుండా, సైలెంట్గా తన పని చేసుకుంటూ, మచ్చలేని మనిషిగా పేరొందిన మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. చీకట్లో ఉన్న దేశానికి ఆర్థిక సరళీకరణ విధానాన్ని ప్రవేశపెట్టి భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ దిగ్గజ దేశాల ప్రక్కన నిలబడేలా చేసి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన అపర మేధావి ఇక లేరు అనే వార్త జీర్ణంచుకోలేం.
మన్మోహన్ సింగ్ ఆటోమొబైల్ పరిశ్రమ వృద్దికి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని విజయవంతం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం అయిన భారతీయ మోటారు వాహనాల పరిశ్రమలో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలకు నిదర్శనంగా దేశ ఆటో ఇండస్ట్రీ ప్రపంచంలోనే గొప్ప స్థితికి చేరుకుంది. 1991 కాలంలో ఈ ఆటో రంగాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి చాలా కాలంగా అమల్లో ఉన్న లైసెన్స్ రాజ్ వ్యవస్థను తొలగించారు.

దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ ఆటోమొబైల్ పరిశ్రమ వృద్దితో పాటు ఇతర రంగాల అభివృద్ధికి అవరోధంగా ఉన్నటువంటి లైసెన్స్ రాజ్ వ్యవస్థను తొలగించారు. అప్పటి వరకు పెట్టుబడులకు, సులభతర వాణిజ్య విధానానికి అడ్డంకిగా ఉన్న వ్యవస్థను దూరం చేయడంతో ఆటో పరిశ్రమలోకి భారీ ఎత్తున కొత్త పెట్టుబడులు వచ్చాయి. విదేశీ కంపెనీలు ఈ రంగంలోకి పెట్టుబడులను క్రమంగా పెంచాయి.
మన్మోహన్ తీసుకున్న కీలక నిర్ణయం ఫలితంగా భారత మోటారు వాహనాల పరిశ్రమ సామర్థ్యం మరింత స్థాయికి పెరిగింది. ఆటో రంగంలో కొత్త పెట్టుబడులకు పరిపాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడటానికి ప్రత్యేక చొరవ చూపడంతో భారత్లో వాహన తయారీ కంపెనీలకు అనుమతులు కూడా వేగంగా వచ్చాయి. దీంతో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయడం, వాటి నుంచి ఉత్పత్తి జరిగి మార్కెట్ క్రమంగా ఊపందుకోవడం చకచకా జరిగిపోయాయి.

ముఖ్యంగా దేశీయ ఆటో మొబైల్ పరిశ్రమను మరింత ప్రోత్సహించడానికి తయారీదారులపై ఉన్నటువంటి పన్నును కూడా చాలా వరకు తగ్గించారు. అంతకుముందు వరకు పన్ను ఎక్కువగా ఉండటం వలన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాని వాహన తయారీ కంపెనీలు మన్మోహన్ నిర్ణయంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. దేశంలో అనుకూలమైన వ్యాపారానికి అవకాశం ఏర్పడింది. లోకల్గా ఉన్న కంపెనీలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాయి.
ముఖ్యంగా పన్ను, వ్యాపార అనుమతుల పరంగా కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి టాటా, మారుతీ వంటి ఇతర కంపెనీలు అనుకూలమైన వ్యాపార విధానంతో తమ ఉత్పత్తిని క్రమంగా పెంచాయి. మన్మోహన్ ఆర్థిక సంస్కరణల కారణంగా ఒక్క భారత్లో తమ వ్యాపారం విస్తరించడానికి వీలు పడటంతో పాటుగా, అంతర్జాతీయంగా ఇతర దేశాలకు ఇక్కడ తయారైన వాహనాలను ఎగుమతి చేయడం జరిగింది. దీంతో భారత్ ఆటో ఇండస్ట్రీకి ప్రపంచదేశాల్లో గుర్తింపు వచ్చింది.

భారత ఆటోమొబైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్డీఐ)లకు మద్దతు ఇవ్వడం మూలంగా విదేశీ కంపెనీల నుంచి ఇక్కడికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. పోటీ పెరగడంతో దిగ్గజ వాహన తయారీ కంపెనీలు పొత్తులకు దిగాల్సి వచ్చింది. ప్రధానంగా మారుతీ, సుజుకీ కలిసి ఒక జట్టుగా ఏర్పడ్డాయి. దీంతో ఈ కంపెనీ ఇండియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది.
ఆ తర్వాత ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మరో కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేసింది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఈ డీల్ ప్రధానంగా నిలిచిపోయింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక విధాన మార్పుల కారణంగా వాహన తయారీదారులకు అన్ని అడ్డంకులు తొలగిపోయి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడినట్లయింది.


Click it and Unblock the Notifications








