వైద్య పరికరాల తయారీలో నేనే సైతం అంటున్న మెర్సిడెస్ బెంజ్
ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన వైరస్ కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ నేడు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. ఈ వైరస్ ప్రభావం వల్ల ఇప్పటికే చామంది ప్రజలు చనిపోయారు. అంతే కాకుండా ఈ వైరస్ ప్రభావానికి లోనవుతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.

ఈ వైరస్ ని నివారించడానికి ప్రభుత్వాలు చాలా కట్టు దిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలకు తమ వంతు సహాయంగా ఇప్పటికే చాల కంపెనీలు వైద్య పరికరాలను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి సహాయం చేతియడానికి మరియు కరోనా బాధితులను కాపాడటానికి లగ్జరీ కార్ల సంస్థ అయిన బెంజ్ ఇప్పుడు నేను సైతం అంటోంది.

లగ్జరీ కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మెర్సిడెస్ బెంజ్ 3 డి ప్రింటర్ల సహాయంతో వైద్య పరికరాల ఉత్పత్తికి తన మద్దతును అందిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

మెర్సిడెస్ బెంజ్ ఎజి ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ యొక్క బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యుడు జోర్గ్ బర్జర్ మాట్లాడుతూ, అత్యంత సమర్థవంతమైన మా బృందం 3 డి ప్రింటింగ్ టెక్నాలజీతో వైద్య పరికరాల ఉత్పత్తికి సహకారం అందిస్తోంది.

అంతే కాకుండా తాము బాడెన్-వుర్టంబెర్గ్ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సంప్రదిస్తున్నాము. బాగా నైపుణ్యం కలిగిన నిపుణులు వీటి ఉత్పత్తికి సహాయం చేస్తారు. ఇప్పుడు మా ఉత్పత్తులు కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడే వైద్యపరికరాల తయారీ అన్నారు. మా 3 డి ప్రింటర్లు వైద్య సదుపాయానికి అవసరమయ్యే పరికరాలను తయారు చేయడం కోసం ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ప్రతి సంవత్సరం దాదాపు 150,000 ప్లాస్టిక్ మరియు లోహ భాగాలను ఉత్పత్తి చేయడానికి 3 డి ప్రింటింగ్ యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు కంపెనీ నిర్దారించింది. ఈ సామర్థ్యాన్ని ఇప్పుడు పూర్తిగా వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నామన్నారు.

ప్రస్తుతం మరింత విస్తరిస్తున్న కరోనాని అరికట్టడానికి మెర్సిడెస్ బెంజ్ తన వంతుగా తమ 3 డి ప్రింటింగ్ టెక్నాలజీతో వైద్య పరికరాల ఉత్పత్తికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








