కారును నడపకుండా ఇంటి వద్దే పార్క్ చేస్తే డబ్బులిస్తారట!
మిలాన్: జనాభా పెరుగుదల ప్రస్తుతం ప్రపంచ సమస్యగా పరిణమిస్తోంది. పెరుగుతున్న జనాభాతో పాటుగా వాహనాల సంఖ్య కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా కాలుష్యం, రద్దీ (ట్రాఫిక్) వంటి సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని దేశాలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి.
ఇప్పటికే ఫ్రాన్స్ ప్రభుత్వం తమ దేశంలో డీజిల్ వాహనాలను నిషేధించి, కాలుష్యాన్ని తగ్గించాలని చూస్తుంటే, తాజాగా మిలాన్ ప్రభుత్వం మరో కొత్త తరహా ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఎక్కడైనా వాహనం నడిపితే టోల్ టికెట్లని రకరకాల చార్జీలను వసూలు చేస్తారు. కానీ, మిలాన్లో మాత్రం వాహనాన్ని నడపకుండా 12 గంటల పాటు ఇంటి వద్దనే పార్క్ చేసి ఉంటే, ప్రభుత్వమే సదరు కారు యజమానికి తిరిగి డబ్బు చెల్లిస్తుంది.

వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం. 'పార్క్ యువర్ కార్ అండ్ గో పబ్లిక్' (మీ కారును పార్క్ చేసి, ప్రజా రవణ వ్యవస్థలో ప్రయాణించండి) అంటూ ఓ కొత్త క్యాంపైన్ను మిలాన్ ప్రారంభించింది. ఇందులో భాగంగా, మిలాన్ ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇన్సూరెన్స్ ఏజెన్సీ మిలాన్ మరియు ఆన్-బోర్డ్ టెలిమ్యాటిక్స్ సిస్టమ్ తయారీ సంస్థ ఆక్టో టెలిమ్యాటిక్స్తో చేతులు కలిపింది.
కార్లలో ఇన్స్టాల్ చేసిన టెలిమ్యాటిక్ సిస్టమ్స్ సాయంతో యునిపోల్ కస్టమర్లను ట్రాక్ చేసి, తమ కారును ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 వరకూ పార్క్ చేసి ఉన్నట్లు గుర్తిస్తే, సదరు కారు యజమానికి 1.50 యూరోల రివార్డును ఇస్తారు. ఈ మొత్తం పబ్లిక్ ట్రాన్స్పోర్టులో ప్రయాణించేందుకు అయ్యే మొత్తంతో సమానం అవుతుంది. అంటే, కారు నడపనందుకు ఇంధనం ఆదా కావటమే కాకుండా, బోనస్గా బస్/మెట్రో చార్జీ కూడా లభిస్తుందన్నమాట. బాగుంది కదూ మిలాన్ ప్లాన్..!


Click it and Unblock the Notifications








