కారు కంపెనీల గుట్టు రట్టు.. అక్టోబర్ 2026 నుంచి మైలేజీ మోసాలకు చెక్.. కేంద్రం కొత్త రూల్స్
భారతదేశంలో సామాన్యుడు కారు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు. అనేక కంపెనీ కార్ల గురించి చాలా విచారించి మాత్రమే కొంటారు. కారు కొనాలనే ప్రతి సామాన్యుడికి ఉండే మొదటి ఆలోచన మైలేజీ. షోరూమ్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక మైలేజీ అంకె చెబితే, తీరా కారు రోడ్డు మీదకు వచ్చాక వచ్చే మైలేజీకి అస్సలు పొంతన ఉండదు.
మనకు మైలేజీ తక్కువ వస్తుంటే మనం ట్రాఫిక్నో లేక మన రోడ్లనో తిట్టుకుంటాం. కానీ అసలు లోపం అక్కడ లేదు, కంపెనీలు మైలేజీని టెస్ట్ చేసే విధానంలోనే ఉందన్నది కాదనలేని వాస్తవం. ఈ తేడాని గమనించిన కేంద్ర ప్రభుత్వం, వాహనదారులకు ఊరటనిచ్చేలా అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త మైలేజీ నిబంధనలను తీసుకురాబోతుంది.

మన దేశంలో విక్రయించే కార్ల మైలేజీని ప్రధానంగా ARAI (Automotive Research Association of India) ధృవీకరిస్తుంది. వీరు ఒక మూసి ఉన్న ల్యాబ్లో, అత్యంత అనుకూలమైన పరిస్థితుల్లో ఇండియన్ డ్రైవింగ్ సైకిల్(IDC) పద్ధతిలో కారుని టెస్ట్ చేస్తారు.
ఈ టెస్టింగ్ జరిగేటప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉండదు, రోడ్లు గతుకులుగా ఉండవు, గాలి సాఫీగా ఉంటుంది. అందుకే వాస్తవానికి రోడ్డు మీదకు వచ్చేసరికి ఆ మైలేజీ దారుణంగా పడిపోతుంది.

కంపెనీలు ప్రకటించే మైలేజీకి, మనకు వచ్చే మైలేజీకి మధ్య వ్యత్యాసం ఉండటానికి ప్రధాన కారణం ఏసీ. ఇప్పటివరకు జరుగుతున్న టెస్టింగ్ ప్రక్రియలో కారు ఏసీని పూర్తిగా ఆఫ్ చేసి(AC OFF) మైలేజీని లెక్కిస్తారు. కానీ భారతదేశం వంటి ఉష్ణమండల దేశంలో ఏసీ లేకుండా కారు నడపడం అసాధ్యం.
ఏసీ ఆన్ చేసినప్పుడు ఇంజిన్పై అదనపు భారం పడి, ఇంధన వినియోగం 15 నుంచి 20 శాతం పెరుగుతుంది. దీనికి తోడు కంపెనీ టెస్టింగ్ సమయంలో కారులో కేవలం డ్రైవర్ మాత్రమే ఉంటారు, టైర్లలో గాలి పక్కాగా ఉంటుంది, ఇంజిన్ ఆయిల్ క్వాలిటీది ఉంటుంది. మన రియల్ లైఫ్లో కారు నిండా జనం, లగేజీ, ట్రాఫిక్ జామ్లు వెరసి మైలేజీ తగ్గిపోతుంది.

కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) తీసుకువస్తున్న AIS-213 అనే కొత్త నిబంధన ప్రకారం.. అక్టోబర్ 1, 2026 నుంచి దేశంలోని ప్రతి కారును మైలేజీ టెస్ట్ చేసేటప్పుడు కచ్చితంగా ఏసీని ఆన్ చేయాలి. మన నిజమైన డ్రైవింగ్ పరిస్థితులకు దగ్గరగా ఉండేలా ఈ పరీక్షలు జరుగుతాయి.
దీనివల్ల కంపెనీలు తమ బ్రోచర్లలో ఇచ్చే మైలేజీ అంకెలు తగ్గుతాయి, కానీ అవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. దీనివల్ల కస్టమర్ మోసపోకుండా, తన నెలవారీ పెట్రోల్ ఖర్చు ఎంతవుతుందో ముందే అంచనా వేసుకోగలడు.
ప్రభుత్వం ఏమంటోంది?
యూరోపియన్ దేశాల్లోని వాతావరణం వేరు, మన దేశ వాతావరణం వేరు అని కేంద్రం గుర్తించింది. అక్కడ ఏసీ అవసరం తక్కువ కాబట్టి ఏసీ ఆఫ్ చేసి టెస్ట్ చేసినా పర్వాలేదు, కానీ మన దగ్గర ఏసీ అనేది లగ్జరీ కాదు అవసరం. అందుకే ఏసీ ప్రభావాన్ని విస్మరించి మైలేజీని లెక్కించడం కరెక్ట్ కాదని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు, అభ్యంతరాలను కోరుతోంది. రానున్న 30 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే, కారు కంపెనీలు తమ ఇంజిన్లను ఏసీ ఆన్ చేసినా ఎక్కువ మైలేజీ వచ్చేలా మరింత సమర్థవంతంగా తయారు చేయాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








