ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 'కవచ్' రక్షణ ఉంటే ప్రమాదం జరిగేది కాదేమో..?
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 280పైగా ప్రయాణికులు మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు. వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. సిగ్నల్ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని తన నివేదికలో పేర్కొంది. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందే కోరమాండల్ ఎక్స్ప్రెస్ మెయిన్లైన్ నుంచి లూప్లైన్లోకి మారిందని తెలిపింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్ను మెయిన్లైన్లో వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. లూప్లైన్ లోకి వచ్చిందని.. రైల్వే శాఖ తెలిపింది.

అయితే అప్పటికే లూప్లైన్లో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు వెల్లడించింది. దీంతో కోరమాండల్ రైలు పట్టాలు తప్పి పక్క ట్రాక్లో పడినట్లు పేర్కొంది. ఆ సమయంలో ఆ ట్రాక్పైకి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ వచ్చిందని. ట్రాక్పైనున్న బోగీలను ఢీకొట్టి ఆ రైలు కూడా పట్టాలు తప్పినట్లు రైల్వే తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.
అయితే ప్రమాద స్థలంలో భీకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయకచర్యలు ప్రారంభించాయి. ప్రమాదంలో బోగీల కింద ఇంకా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్మీ సైతం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఒడిశాలోని రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమే కారణమని రైల్వే శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చింది. దీనిపై విచారణకు ఇప్పటికే ఉన్నతస్థాయి బృందం రంగంలోకి దిగింది. ప్రమాదానికి కారణాలు ఏంటనేదానిపై ఆరా తీస్తోంది. రైల్వేలో ప్రమాదాల నియంత్రణకు తీసుకొచ్చిన రక్షణ వ్యవస్థ 'కవచ్' ఈ మార్గంలో లేకపోవడమే ప్రమాదానికి కారణమని అంచనా వేస్తున్నారు.

అసలు ఏంటి కవచ్... రైల్వేలో ప్రమాదాలను నియంత్రించేందుకు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలో వెల్లడించారు. కవచ్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. అయితే ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందంటే.. ఏదైనా సాంకేతిక లోపంతో ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎదురెదురుగా లేదా వెనుక నుంచి ఢీకొనకుండా కవచ్ వ్యవస్థ పనిచేస్తుంది. ఆటోమేటిక్గా రైళ్లు నిలిచిపోయేలా చేస్తుంది.
రెడ్ సిగ్నల్ను పట్టించుకోకుండా లోకోపైలెట్ రైలును నడిపిస్తున్నప్పుడు కవచ్ వ్యవస్థతో ఆటోమెటిక్గా బ్రేకులు పడతాయి. పట్టాలు సరిగా లేనప్పుడు, ఇతర టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు కవచ్ వ్యవస్థ అప్రమత్తం చేస్తుంది. మరియు బ్రిడ్జ్, మలుపులు వద్ద రైలు పరిమితికి మించిన వేగంతో వెళ్తుంటే.. కవచ్ వ్యవస్థ రైలు వేగాన్ని 30km/h ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. కవచ్ వ్యవస్థతో రైలు ఇంజిన్లోని స్క్రీన్పై కనిపిస్తుంది రైలు స్పీడ్ సహా ఇతర సమాచారం అందులో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పరిమితికి మించి రైలు ప్రయాణం చేస్తుంటే.. కవచ్ వ్యవస్థ వేగాన్ని తగ్గిస్తుంది.

రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలను ఇప్పుడే ఏం అంచనా వేయలేమని, విచారణ ప్రారంభమైందని. విచారణ నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
రైలు ప్రమాద బాధితుల వివరాల కోసం రైల్వే హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేసింది.
* పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఎమర్జెన్సీ కంట్రోల్ రూం : 033-22143526/22535185
* ఖరగ్పూర్ స్టేషన్ హెల్ప్లైన్ : 8972073925, 9332392339
* హౌరా స్టేషన్ హెల్ప్లైన్ నంబర్ : 033-26382217
* షాలిమార్ స్టేషన్ హెల్ప్లైన్ : 9903370746
* బాలాసోర్ స్టేషన్ హెల్ప్లైన్ : 8249591559, 7978418322
* ఒడిశా ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్ : 06782262286
* చెన్నై రైల్వేస్టేషన్ హెల్ప్లైన్ : 044-25330952


Click it and Unblock the Notifications








