కొత్త మోటార్ రూల్: వాహనాలపై తప్పనిసరిగా ఫిట్నెస్, రిజిస్ట్రేషన్ చెల్లుబాటును ప్రదర్శించాలి!
గత కొన్నేళ్లుగా భారతదేశంలోని మోటార్ వాహనాల విషయంలో వివిధ రకాల ప్రమాణాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. వాహనాల భద్రతను పెంచడం, కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్న నిబంధనలు తీసుకురావడం మరియు పాత వాహనాలను స్క్రాప్ చేయడం వంటి అనేక కొత్త విషయాలను భారత ప్రభుత్వం పరిచయం చేస్తూ వస్తోంది. ఇప్పుడు తాజాగా, మోటారు వాహనం యొక్క ఫిట్నెస్ చెల్లుబాటును సూచించడానికి కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం, నిర్దేశించిన పద్ధతిలో ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు రిజిస్ట్రేషన్ యొక్క చెల్లుబాటును వాహనాలపై ప్రదర్శించాలి. నిబంధనల ప్రకారం, వాహనంపై 'రోజు-నెల-సంవత్సరం' (DD-MM-YYYY) ఆకృతిలో సదరు వాహనం యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ ప్రదర్శించబడుతుంది. ఈ తరహా విధానం ఇప్పటికే అమెరికాలో అమలు చేయబడుతోంది. ఆ దేశంలో సంచరించే వాహనాల ఫ్రంట్ విండ్ షీల్డ్ పై ఓ బ్లూ కలర్ స్టిక్కర్ ఉంటుంది, ఇది సదరు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ చెల్లుబాటు తేదీని సూచిస్తుంది.

వాహనంపై ఫిట్నెస్ చెల్లుబాటును ఎలా ప్రదర్శించాలి?
హెవీ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు, మీడియం గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు మరియు తేలికపాటి మోటారు వాహనాల విషయంలో, వాటి ఫిట్నెస్ చెల్లుబాటును విండ్స్క్రీన్ కు ఎడమ వైపు ఎగువ అంచున ప్రదర్శించబడుతుందని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆటో-రిక్షా, ఇ-రిక్షా, ఇ-కార్ట్ మరియు క్వాడ్రిసైకిల్ విషయంలో కూడా ఇది విండ్స్క్రీన్ యొక్క ఎడమ వైపు ఎగువ అంచున ప్రదర్శించాల్సి ఉంటుంది. ద్విచక్ర వాహనాల విషయంలో ఫిట్నెస్ చెల్లుబాటు వాహనం యొక్క నిర్దిష్ట భాగంలో ప్రదర్శించబడుతుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, వాహనాలపై ఈ సమాచారాన్ని నీలం బ్యాగ్రౌండ్తో పసుపు రంగులో ఏరియల్ బోల్డ్ స్క్రిప్ట్ ద్వారా ప్రదర్శించబడుతుంది.

దేశంలో పెద్ద సంఖ్యలో పాత వాహనాలు నడుస్తున్నాయి
మనదేశంలో ఫిట్నెస్ గడువు ముగిసిన తర్వాత కూడా లక్షలాది పాత వాహనాలు ఇంకా రోడ్లపై తిరుగుతూనే ఉన్నాయి. రవాణా మంత్రిత్వ శాఖ యొక్క నివేదిక ప్రకారం, దేశంలో 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల సుమారు 50 లక్షలకు పైగా తేలికపాటి మోటార్ వాహనాలు (LMV) రోడ్లపై తిరుగుతున్నాయి. ఇక 15 ఏళ్లు దాటిన తేలికపాటి మోటారు వాహనాల సంఖ్య అయితే, దాదాపు 34 లక్షలకు పైగానే ఉన్నాయి. అంతే కాకుండా, చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా నడుపుతున్న 17 లక్షలకు పైగా భారీ మోటారు వాహనాలు (HMV) కూడా రోడ్లపై తిరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రోడ్లపై తిరిగే ఇలాంటి పాత వాహనాల వల్ల ఎక్కువ కాలుష్యం వ్యాపిస్తుంది మరియు వాటి భద్రత/నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి, వీలైనంత త్వరగా వాటిని గుర్తించి స్క్రాప్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ చెబుతోంది. మనదేశంలో ఆగస్టు 15, 2021 వ తేదీ నుండి, వాహన స్క్రాపింగ్ విధానం అమలులోకి వచ్చిన సంగతి తెలిసినదే. ఈ విధానం ప్రకారం, కాలం చెల్లిన పాత వాహనాలను వినియోగదారులు స్క్రాప్ చేయాల్సి ఉంటుంది.

అలా కాకుండా, అవే పాత వాహనాలను వాటి జీవిత కాలం ముగిసిన తర్వాత కూడా ఉపయోగించాలనుకుంటే, సదరు వాహన యజమానికి అధిక మొత్తంలో రీ-రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, క్రమం తప్పకుండా ఆ వాహనానికి ఫిట్నెస్ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. అయితే, ఈ వాహన స్క్రాప్ విధానంలో, పాత వాహనాలను స్క్రాప్ చేసిన వాహన యజమానులకు న్యాయమైన పరిహారంతో పాటుగా కొత్త వాహనం కొనుగోలుపై తగ్గింపు వంటి అనేక ప్రోత్సాహకాలను కూడా ప్రతిపాదించారు.

పాత వాహనాలపై పెరగనున్న పన్నులు
పాత ప్రైవేట్, కమర్షియల్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని పెంచబోతోంది. ఏప్రిల్ 2022 నెల నుండి 15 సంవత్సరాల కంటే ఎక్కువ కలిగిన పాత టూవీలర్, కారు లేదా వాణిజ్య వాహనాల యొక్క రీ-రిజిస్ట్రేషన్ కోసం దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ విధానం ఢిల్లీలోని వాహన యజమానులపై ఎలాంటి ప్రభావం చూపదు. ఢిల్లీ ఎన్సిఆర్లో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నడపడం ఇప్పటికే నిషేధించబడింది.

పాత వాహనాల విషయంలో ఈ కొత్త ఫీజులు ఏప్రిల్ 1, 2022 వ తేదీ నుండి అమలు చేయబడనున్నాయి. ఇవి అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్కు చెల్లించే రూ. 300 బదులుగా రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కారును కలిగిన వారు రిజిస్ట్రేషన్ రెన్యూవల్ కోసం రూ. 5,000 రుసుము చెల్లించాలి.

అదేవిధంగా, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న బస్సులు లేదా ట్రక్కుల వంటి పబ్లిక్ మరియు వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కూడా ప్రస్తుతం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా సూచించబడింది. ఈ వాహనాలకు రెన్యూవల్ ఫీజు రూ.10,000 నుంచి రూ.12,500 వరకు నిర్ణయించారు. దిగుమతి చేసుకున్న బైక్లు మరియు కార్ల కోసం రిజిస్ట్రేషన్ మరియు పునరుద్ధరణ ఇప్పుడు మరింత ఖరీదైనదిగా మారనుంది. ఇలాంటి ఇంపోర్టెడ్ ద్విచక్ర వాహనాలకు రూ.10,000 మరియు నాలుగు చక్రాల వాహనాలకు రూ.40,000 రెన్యువల్ ఫీజుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








