భారత రోడ్లపై 3.54 కోట్ల ఫాస్ట్ట్యాగ్లు; ఫాస్ట్ట్యాగ్ లేకపోతే రెట్టింపు చార్జ్!
దేశవ్యాప్తంగా ఫాస్ట్ట్యాగ్ల వినియోగం భారీగా పెరిగింది. జూలై 14, 2021 నాటికి 3.54 కోట్లకు పైగా ఫాస్ట్ట్యాగ్లను జారీ చేసినట్లు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ తాజా నోటిఫికేషన్లో తెలిపింది. ఫిబ్రవరి 14, 2021 నుండి దేశవ్యాప్తంగా ఫాస్ట్ట్యాగ్ వాడకం తప్పనిసరి చేసిన తరువాత, ఫాస్ట్ట్యాగ్ల వినియోగం 80 శాతం నుండి 96 శాతానికి పెరిగింది.

టోల్ టాక్స్ లావాదేవీల కోసం ఫాస్ట్ట్యాగ్ ఆధారిత ప్రక్రియను నిరంతరం మెరుగుపరుస్తున్నామని, ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. జూలై 14 నుండి, జాతీయ రహదారులపై ఉండే అన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ట్యాగ్ ఆధారిత టోల్ వసూలు ప్రక్రియ అమలు చేయబడింది.

నేషనల్ హైవేస్ డ్యూటీ రూల్స్ 2008 ప్రకారం, టోల్ ప్లాజాలలో ఫాస్ట్ట్యాగ్ ఉపయోగించని టోల్ చెల్లించని వాహనాలకు, రెట్టింపు టోల్ పన్ను వసూలు చేయబడుతుంది. ఉదాహరణకు, ఏదైనా టోల్ ప్లాజా వద్ద కారు కోసం వసూలు చేసే టోల్ చార్జీ రూ.30 అనుకుంటే, ఫాస్ట్ట్యాగ్ ద్వారా ఆటోమేటిక్గా టోల్ రుసుము చెల్లించే కార్లు కేవలం రూ.30 లను మాత్రమే చెల్లిస్తాయి.

అలా కాకుండా, నగదు రూపంలో టోల్ చెల్లించే కార్లు మాత్రం రెట్టింపు మొత్తంలో అంటే రూ.60 టోల్ చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, ఈ విధానాన్ని అవలంబించడంలో ఆలస్యం చేయకుండా, డ్రైవర్లందరూ తప్పనిసరిగా తమ వాహనాలకు ఫాస్ట్ట్యాగ్ను అమర్చుకోవాలని కోరారు.

దేశంలోని జాతీయ రహదారులపై డిజిటల్ టోల్ సేకరణ కోసం ఫాస్ట్ట్యాగ్ ఉపయోగించబడుతుంది. టోల్ సేకరణ ప్రక్రియను వేగంగా మరియు సున్నితంగా చేయడం మరియు టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం లేదా సుదీర్ఘమైన క్యూలను తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఫాస్ట్ ట్యాగ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ చిప్తో కూడిన స్టిక్కర్, ఇది వాహనాల యొక్క ఫ్రంట్ విండ్షీల్డ్పై అంటించబడి ఉంటుంది.

ఫాస్ట్ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడి) ద్వారా పనిచేస్తుంది. ఈ ఫాస్ట్ట్యాగ్ స్టిక్కర్లు కలిగిన వాహనాలు టోల్ ప్లాజా గుండా ప్రయాణిస్తున్నప్పుడు, టోల్ టాక్స్ ఆటోమేటిక్గా బ్యాంక్ ఖాతా నుండి లేదా ఫాస్ట్ట్యాగ్కు అనుసంధానించబడిన ప్రీపెయిడ్ ఖాతా నుండి చెల్లించబడుతుంది.

ఇలా టోల్ చెల్లించే ప్రక్రియలో వాహనాలు టోల్ బూత్ల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండే అవసరాన్ని ఇది తొలగిస్తుంది. ఫలితంగా సమయం ఆదా అవుతుంది మరియు వాహనాల నుండి వెలువడే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది.

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలా గుండా ప్రయాణించే అన్ని ప్యాసింజర్ ఫోర్ వీలర్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు మరియు వాణిజ్య వాహనాల కోసం ఫాస్ట్ట్యాగ్ తప్పనిసరిగా అమలు చేయబడింది. ఈ టోల్ ప్లాజాల గుండే వెళ్లే ద్విచక్ర వాహనాలకు ఫాస్ట్టాగ్ అవసరం లేదని గమనించండి.

ఫాస్ట్ట్యాగ్ను దేశవ్యాప్తంగా ఉన్న ఏ టోల్ బూత్లోనైనా కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ కొనడానికి, మీకు వాహన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు ఒక ఐడి కూడా అవసరం అవుతుంది. టోల్ ప్లాజాలతో పాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పేటిఎమ్ పేమెంట్స్ బ్యాంక్ సహా 22 బ్యాంకుల ద్వారా ఫాస్ట్ ట్యాగ్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, అమేజాన్, ఫ్లిప్కార్ట్ వంటి కొన్ని ఇ-కామర్స్ సంస్థలు కూడా తమ యాప్ల ద్వారా ఫాస్ట్ట్యాగ్ను విక్రయిస్తున్నారు.

దేశంలో ఎంపిక చేసిన పెట్రోల్ పంపుల వద్ద వినియోగదారులు ఇప్పుడు ఫాస్ట్ట్యాగ్ ద్వారా ఇంధనం కొనుగోలు చేయవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్తో అనుసంధానించబడిన ఫాస్ట్టాగ్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్లెట్లలో నగదు రహిత మరియు కాంటాక్ట్లెస్ చెల్లింపుల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సౌకర్యం భారతదేశం అంతటా సుమారు 3,000 ఇండియన్ ఆయిల్ రిటైల్ అవుట్లెట్లలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








