ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్తో అక్రమాలకు చెక్..
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకి గణనీయంగా పెరిగిపోతోంది. దీంతో అస్పత్రులలో కూడా ఆక్సిజెన్ కొరత కూడా తీవ్రమైంది. ఈ నేపథ్యంలో, దేశంలో ఆక్సిజెన్ను రవాణా చేసే ట్యాంకర్లు చాలా కీలకంగా మారాయి.

భారత రోడ్లపై ఆక్సిజెన్ ట్యాంకర్ల స్థితిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, వాటి కోసం ట్రాఫిక్ను క్లియర్ చేయటానికి ఇప్పుడు కేంద్రం ఓ కొత్త మార్గాన్ని ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, అన్ని ఆక్సిజెన్ ట్యాంకర్లకు జిపిఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చనున్నారు.

ఈ పరికరం సాయంతో ఆక్సిజెన్ ట్యాంకర్లు ఏయే సమయాల్లో ఏయే రోడ్లపై ప్రయాణిస్తున్నాయో తెలుసుకోవటం సాధ్యమవుతుంది. ఆ రూట్లలో ట్రాఫిక్ క్లియర్ చేసి, వీలైనంత తక్కువ సమయంలో వీటిని ఆస్పత్రులకు చేర్చి, రోగుల ప్రాణాలను కాపాడటం వీలవుతుందని సదరు మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

దేశంలోని వివిధ ఆక్సిజెన్ ప్లాంట్లలో తయారవుతున్న ద్రవరూప ఆక్సిజెన్ను సరఫరా చేయడానికి ట్యాంకర్లను ఉపయోగిస్తున్న సంగతి తెలిసినదే. అయితే, దేశంలో ఆక్సిజెన్ కొరత అధికంగా ఉండటంతో, కొందరు దుండగులు వీటిని టార్గెట్ చేసి, ట్యాంకర్లను దారి మళ్లించడం చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ 3 లక్షల మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఆసుపత్రులకు నిత్యం ఆక్సిజన్ సరఫరా ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

బజాజ్ ఆటో సహాయం
కరోనాపై పోరులో భాగంగా, దేశంలోని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీలు సహాయం చేయటానికి ముందుకు వస్తున్నాయి. కరోనా రోగులకు సహాయం చేయడానికి బజాజ్ గ్రూప్ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించింది. కరోనా రోగులకు సహాయం చేయడానికి బజాజ్ గ్రూప్ 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది కూడా 100 కోట్ల రూపాయలు విరాళాన్ని అందజేసింది.

మహీంద్రా అండ్ మహీంద్రా సాయం
భారతదేశపు మల్టీ బిజినెస్ బ్రాండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కరోనా సెకండ్ వేవ్తో దేశం చేస్తున్న పోరాటానికి సాయంగా ప్రభుత్వానికి మద్దతునిస్తోంది. ఈ కంపెనీ మహారాష్ట్ర అంతటా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తోంది. ముంబై, థానే, పూణే మరియు నాసిక్లలో యుద్ధ ప్రాతిపదికన రోగులకు సహాయం చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది.

ఎమ్జి మోటార్స్ సాయం
చైనాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ ఎమ్జి మోటార్ ఇండియా కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో తమ ప్లాంట్లన్నింటినీ మూసివేసి, అత్యవసర స్థాయిలో ఆక్సిజెన్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ఈ సమయంలో కంపెనీ తమ ప్లాంట్లలో పారిశ్రామిక ఆక్సిజన్ను ఉత్పత్తి చేసి ఆసుపత్రులకు రవాణా చేస్తుంది.

దేశంలోని అస్పత్రులలో ఆక్సిజెన్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం పిఎమ్ కేర్స్ నుండి రూ.500 కోట్లను కూడా మంజూరు చేసింది. ఈ నిధులతో దేశంలోని పలు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపధికన ఆక్సిజెన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.


Click it and Unblock the Notifications








