ముంబై మోనోరైల్ మొదటి ప్రయాణం సక్సెస్
మనదేశంలో కూడా ఒకే పట్టాపై పరుగులు పెట్టే రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే మోనోరైళ్లను ముంబైలో ప్రవేశపెట్టారు. మెట్రో రైలు మాదిరిగానే మోనోరైలు కూడా ఉంటుంది. అయితే మోనో రైలు ఒక ట్రాక్ మాత్రమే ఉంటుంది. (క్రింది ఫొటోలో చూడొచ్చు).
ప్యాసింజర్లతో తొలి మోనోరైలు ప్రయాణాన్ని గడచిన శనివారం ప్రారంభించారు. ప్రారంభంలో భాగంగా ఈ మోనోరైలు ముంబైలోని చెంబూర్, వాడలా ప్రాంతాల మధ్య 8.8 కి.మీ. దూరం ప్రయాణించనుంది. ఈ మోనోరైలు గడచిన శనివారం మధ్యాహ్నం 1.31 గంటలకు వాడలా స్టేషన్ నుంచి ప్రారంభమై 1.47 గంటల ప్రాంతంలో చెంబూర్ చేరుకుంది.
అంటే, 8.8 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 16 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలో ఉంది. ఇది పూర్తిస్థాయిలో అమల్లోకి రావటానికి మరికొంత సమయం పట్టే ఆస్కారం ఉంది. ముంబైలో మోనోరైలు ట్రాక్ను మరో 20 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. కాగా, మోనోరైలు ప్రయోగం విజయవంతం అయినట్లయితే మరిన్ని మెట్రో నగరాల్లో ఈ మోనోరైలు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.



Click it and Unblock the Notifications








