అక్రమ బిఎస్4 కార్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు; హైదరాబాద్లో కూడా మూలాలు!
దేశంలో యదేచ్ఛగా పెరిగిపోతున్న వాహన కాలుష్యానికి చెక్ పెట్టేందుకు భారత సర్కార్ గడచిన ఏప్రిల్ 2019లో కొత్త బిఎస్6 ఉద్ఘార ప్రమాణాలను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, బిఎస్4 వాహనాలను తయారు చేయటం మరియు వాటిని విక్రయించడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం ప్రకటించింది.

బిఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన తరువాత బిఎస్4 ఉద్గార ప్రమాణాలతో నడిచే వాహనాల అమ్మకం పూర్తిగా ఆగిపోయింది. బిఎస్6 నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా, అప్పటికీ మిగిలిపోయి ఉన్న బిఎస్4 వాహనాల స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలకు భారత సర్కార్ కొంత సమయాన్ని కూడా కేటాయించింది.

ప్రస్తుతం దేశంలో బిఎస్4 వాహనాల తయారీ మరియు విక్రయం పూర్తిగా 100 శాతం నిలిచిపోయింది. అయితే, ఇప్పటికీ కొందరు అక్రమ మార్గంలో బిఎస్4 ఇంజన్లతో కూడిన కార్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ముంబై పోలీసులు అలాంటి ఓ గ్యాంగ్ను పట్టుకున్నారు.

ఈ ముఠా దేశవ్యాప్తంగా బిఎస్4 ఇంజన్లతో కూడిన కార్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు జరిపిన రైడ్లో ఇప్పటి వరకూ తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పోలీసులు సుమారు రూ.7.15 కోట్ల విలువైన 151 కార్లను స్వాధీనం చేసుకున్నారు.

నేవీ ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ టీమ్ కమిషనర్ బిపిన్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ముఠా దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యకలాపాలు చేస్తోంది. ముఠా సభ్యులు పక్క రాష్ట్రాల నుండి బిఎస్4 ఇంజన్లతో కూడిన కార్లను కొనుగోలు చేసి, నంబర్ ప్లేట్లు మరియు ఛాస్సిస్ నంబర్లను మార్చి, నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో వాటిని వేరే ఇతర రాష్ట్రాల్లో విక్రయించే వారని ఆయన తెలిపారు.

ఈ వాహనాలన్నీ వరదల్లో దెబ్బతిన్నాయని కస్టమర్లను నమ్మించే వారని, ఈ కేసులో ప్రధాన నిందితులు రాయ్గడ్ జిల్లాలోని పన్వెల్ సమీపంలో ఉన్న షిర్దాన్ వద్ద ఓ కార్యాలయాన్ని మరియు గోడౌన్ కూడా ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.

ఈ అరెస్టులన్నీ జనవరి చివరి నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వరకు జరిగాయని సింగ్ అన్నారు. నిందితులను షబాన్ రఫీక్ ఖురేషి (32), అనం సిద్దిఖీ (42), వసీం షేక్ (31), మనోహర్ జాదవ్ (31), ప్రశాంత్ శివ్రాతి (26), గౌరవ్ డిమ్లా (32), రషీద్ ఖాన్ (42), చంద్రశేఖర్ గదెకర్ (31), ఎమ్రాన్ చోప్రా (38) లుగా గుర్తించారు.

కార్ల ఛాస్సిస్ నంబర్లను మార్చేందుకు వీరు హైటెక్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. ఈ నంబర్లను ఉత్పత్తి చేసే యంత్రాన్ని నిందితుడు ఇమ్రాన్ చోప్రా నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛాస్సిస్ నెంబర్లు మార్చే ఈ యంత్రాన్ని హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసినట్లు నిందితులు చెప్పారు.

ఈ రాకెట్లో పట్టుబడిన నేరస్థులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై ఐపిసిలోని సెక్షన్ 420 (మోసం), సెక్షన్ 465 (ఫోర్జరీ) సహా ఇతర నేరాలను పన్వెల్ నగర పోలీస్ స్టేషన్లో నమోదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి పోలీసులు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇందులో న్యూఢిల్లీ, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి పోలీసులు బిఎస్4 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ముఠా సభ్యులు ఇలాంటి కార్లను చాలా తక్కువ ధరలకే విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమేనని గమనించండి.
Note: Images Are Only For Representative Purpose.


Click it and Unblock the Notifications








