భారత్కు వచ్చిన ప్రపంచంలో కెల్లా అతిపెద్ద కంటైనర్ షిప్
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలో కెల్లా అతిపెద్ద, పొడవైన కంటైనర్ షిప్ల్లో ఒకటి. దీని పేరు 'ఎమ్వీ ఎమ్ఎస్సి వలేరియా'. ఇది స్విట్జర్లాండ్లోని ఎమ్ఎస్సీ మెడిటేరేనియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన కంటైనర్ నౌక. ప్రపంచ వ్యాప్తంగా ఇంత భారీ కంటైనర్ షిప్లను హ్యాండిల్ చేసే పోర్ట్లు 35కు మించి లేవు. తాజాగా ఈ కంటైనర్ నౌక గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు వచ్చింది.
ముంద్రాలోని అదానీ పోర్టులో కొత్తగా నిర్మించిన కంటైనర్ టెర్మినల్ ఈ భారీ నౌకకు ఆతిథ్యమిచ్చింది. అదానీ గ్రూప్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ పోర్ట్ భారతదేశంలో కెల్లా అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్. ఎమ్వీ ఎమ్ఎస్సి వలేరియా కంటైనర్ నౌక సామర్థ్యం 14,036 టీఈయూలు, మన దేశంలో సగటు కంటైనర్ షిప్ సామర్థ్యం 4,000 టీఈయూలు. ఇంత భారీ స్థాయి కంటైనర్ షిప్ భారత్ తీరానికి రావడం ఇదే తొలిసారి.
ఎమ్వీ ఎమ్ఎస్సి వలేరియా కంటైనర్ నౌక మొత్తం పొడవు 365.5 మీటర్లు. గతేడాది నుంచే ఈ షిప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఇది చైనా మరియు పశ్చిమ మెడిటెర్రానియాన్ల మధ్య తిరుగుతోంది. భారత కంటైనర్ వ్యాపారంలో కొత్త ఆధ్యాయానికి తెరతీశామని, ఇంత భారీ స్థాయి కంటైనర్ షిప్ల కారణంగా వ్యయాలు బాగా తగ్గుతాయని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఈ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయని, ఈ కంటైనర్ రాక తమ కంపెనీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన చెప్పారు.



Click it and Unblock the Notifications








