ఇకపై ఆ పర్యాటక ప్రాంతానికి సొంత వాహనాల్లో వెళ్లే వారికి గుడ్న్యూస్!
మీలో నాగార్జునసాగర్- శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్కి వెళ్లిన వారికి చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదురై ఉంటాయి. పర్యాటకులు అధికంగా వచ్చే సమయాల్లో అయితే ఎంట్రీ గేట్ల వద్ద భారీ సంఖ్యలో వాహనాలు క్యూ కడతాయి. ఈ సమయంలో టూరిస్టులు తీవ్ర అసహనానికి గురవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య విస్తరించి ఉన్న నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కు వెళ్లేవారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) గుడ్న్యూస్ చెప్పింది. ఈ అటవీ ప్రాంత పర్యటనకు కారులో వచ్చే పర్యాటకులు తమ వాహన ఫాస్టాగ్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్ ఎంట్రీ ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. దీనికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు సంబంధించిన IHMCL (ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్), అటవీశాఖ మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.

ఇందులో భాగంగా శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్కు వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతమైన ప్రవేశం కల్పించేలా చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫలితంగా అటవీ ప్రాంతంలోని ఎంట్రీ గేట్ల వద్ద ఫాస్టాగ్ ఆధారిత పేమెంట్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించింది. దీని తర్వాత ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ కో ఆర్డినేషన్ (EMC) ఫీజును ఫాస్టాగ్ ద్వారానే వసూలు చేస్తామని తెలిపింది.
రిజర్వ్ ఫారెస్ట్ ఎంట్రీ గేట్ల వద్ద ఫాస్టాగ్ ఆధారిత పేమెంట్ వ్యవస్థ వల్ల భారీ క్యూలో నిరీక్షించే సమయం కలిసివస్తుందని తెలిపింది. తద్వారా అటవీ ప్రాంతంలోని అందాలను ఆశ్వాదించేందుకు వచ్చే పర్యాటకులకు ఇది సహాయపడుతుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా దీని ద్వారా సుస్థిర పర్యాటక అభివృద్ధికి మరియు రిజర్వ్ ఫారెస్ట్ ఎంట్రీ గేట్ల వద్ద కాలుష్య నివారణకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
ఒకానొక సమయంలో టోల్ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చేది. 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 2021లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.
ఈ విధానం ద్వారా రేడియా ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ఆధారంగా టోల్ ప్లాజాల వద్ద ఆటోమేటెక్గా పేమెంట్ జరిగిపోతుంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక సుమారు అన్ని టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ భారీగా తగ్గింది. ప్రయాణికుల వాహనాల్లో సుమారు 97 శాతం వాటికి ఫాస్టాగ్ ఉన్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రానున్న 6 నెలల్లో GPS ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వెల్లడించారు. అంతేకాకుండా ఆటోమెటిక్గా నంబర్ ప్లేట్ల గుర్తింపు వ్యవస్థ పైలెట్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నిలపకుండానే రుసుం వసూలుచేసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.


Click it and Unblock the Notifications








