40 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారత వ్యోమగామి.. ఇస్రోతో కలిసి నాసా కీలక నిర్ణయం.!!
చంద్రయాన్ 3 విజయంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంబంధించి నాసా కీలక నిర్ణయం తీసుకుంది. ఇది భారతీయులకు తీపి కబురనే చెప్పవచ్చు. వచ్చే ఏడాది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు భారతీయ వ్యోమగామిని పంపాలని నాసా నిర్ణయించింది. ఇస్రోతో కలిసి NASA ఈ డెసిషన్ తీసుకుంది.
చంద్రయాన్ 3 ప్రాజెక్టు సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ ప్రతిభకు నివ్వెరపోయాయి. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్లో ఈ మిషన్ను పూర్తి చేసి చంద్రుడి దక్షిణ ధ్రువంపైన దిగ్విజయంగా ల్యాండ్ చేసి భారత్ చరిత్ర తిరగరాసింది. దీంతో అతి పెద్ద అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. ఇస్రోతో కూటమిని ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల భారత్కు వచ్చిన నాసా(National Aeronautics and Space Administration) అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఇస్రో చీఫ్ సోమ్నాథ్, సైంటిస్టులతో సమావేశమయ్యారు. కాగా ఈ సమావేశంలో ఇస్రో సెలెక్ట్ చేసిన భారతీయుడిని నాసా తరపున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపేందుకు నాసా ఆసక్తి చూపుతోందని ఆయన తెలిపారు. తద్వారా ద్వారా అంతరిక్ష పరిశోధనలో రెండు దేశాలు ఎంఓయూ కుదుర్చుకుంటాయని తెలిపారు.
కాగా దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి అంతరిక్షంలో అడుగుపెట్టబోతుండటం శుభ సందర్భం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సోవియట్ యూనియన్ 1984లో సూయజ్ టీ-11 రాకెట్ ద్వారా భారత వ్యోమగామి రాకేశ్ శర్మను అంతరిక్షంలోకి పంపిన తర్వాత, మన దేశం నుంచి ఇంకెవ్వరూ అంతరిక్షంలోకి అడుగుపెట్టలేదు.

కాగా మానవ సహిత అంతరిక్ష నౌకను ఎంచుకునే అధికారాన్ని ఇస్రోకు ఇవ్వాలని నాసా నిర్ణయించినట్లు కూడా బిల్ నెల్సన్ తెలిపారు. నాసా నిర్ణయం ప్రకారం వ్యోమగాముల అర్హతను ఇస్రో నిర్ణయిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధనలో పురోగతి సాధించడానికి సహాయపడే విధంగా వ్యోమగాములను ఇస్రో(Indian Space Research Organisation) సెలెక్ట్ చేస్తుంది.
భారత్కు వచ్చిన నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ తొలుత ముంబైలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ను కలిశారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లి సైంటిస్టులతో మాట్లాడారు. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి రాకేష్ శర్మను కూడా ఆయనను కలిసి పలు విషయాలపై మాట్లాడారు.
ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు భారత ఆస్ట్రోనట్ను పంపాలని నాసా నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వంలో సంచలనం సృష్టించిందన్నారు. దీని కోసం తదుపరి దశ పనులను నాసా, భారత ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భారత్ వదులుకోదని, నాసాతో సత్సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కాగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రస్తుతం నాసా ఆధీనంలో ఉంది. అయితే భారత్ కూడా సొంతంగా అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం భారతీయ అంతరిక్షంలో అంతరిక్ష స్టేషన్ పేరుతో పరిశోధనా కేంద్రాన్ని నిర్మించేందుకు యత్నిస్తోంది. ఈ ప్రకారం 2025 నాటికి అంతరిక్షంలో తన సొంత అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని భారత్ భావిస్తోంది.
చంద్రయాన్ 3 విజయంతో చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు కూడా భారత్ యోచిస్తోంది. సమాచారం ప్రకారం 2040 ఏడాదిలో భారత్ నుంచి మానవులను అంతరిక్షంలోకి పంపుతారని తెలుస్తోంది. అంతే కాకుండా ప్రస్తుతం భారత్ తలపెట్టనున్న ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ సెంటర్కు కూడా సహకరిస్తున్నట్లు నాసా వెల్లడించింది.
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం- ఇస్రో 1975లో తొలిసారిగా ఆర్యభట్ట శాటిలైట్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దాదాపు 50 ఏళ్లలో ఇస్రో అద్భుతమైన విజయాలు సాధిస్తూ స్పేస్ రంగంలో ఎనలేని వృద్ధిని సాధించింది. ఇంకా చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి తన వ్యోమనౌకను పంపి చరిత్ర సృష్టించింది. తాజాగా నాసా ప్రకటనతో ఇస్రో మున్ముందు విజయాలకు ఇది కీలక మైలురాయి కానుంది.


Click it and Unblock the Notifications








