Hyderabad Metro: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. కొత్తగా ఈ మార్గాల్లో మెట్రో రైళ్లు
హైదరాబాద్ నగర వాసులకు గుడ్న్యూస్. త్వరలో నగరవ్యాప్తంగా మెట్రో(Hyderabad Metro) సేవలు విస్తరించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు మెట్రో రైలు మార్గాలు విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్లో మెట్రో సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఉద్యోగులు, విద్యార్థులు, రోజు కూలీలు ఎక్కువగా మెట్రో రైళ్లను వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో మెట్రో సర్వీస్ను విస్తరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎక్కువ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రో రైలు మార్గాల విస్తరణ జరగనుంది. ఈ మేరకు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

హైదరాబాద్లో మెట్రో రైల్ మార్గాల విస్తరణ నేపథ్యంలో కొత్త ఎలైన్మెంట్లను తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. కొత్త ఎలైన్మెంట్ వల్ల ప్రయాణికలకు తక్కువ దూరంతో అత్యధిక ప్రయోజనం చేకూరనుంది. అంతే కాకుండా నిర్మాణ వ్యయం తక్కువగా ఉండేలా చూడాలని మెట్రో అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలోని ప్రాంతాలకు మెట్రో రైలు విస్తరణ జరగాలన్నారు.
దీని ద్వారా హైదరాబాద్ నగరం నలుదిశలా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం(జనవరి 2) మెట్రో రైల్ ఫేజ్ 2, 3 పై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం- శంషాబాద్ విమానాశ్రయ మార్గాన్ని నిలిపివేయాని రేవంత్ పేర్కొన్నారు. దీనికి బదులుగా విమానాశ్రయం నుంచి ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ, ఎల్బీనగర్కు మెట్రో రైల్ కనెక్షన్ తీసుకురావాలని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుపై జీహెచ్ఎంసీ(GHMC) కమిషనర్తో సమన్వయం చేసుకొని ప్రతిపాదనలు చేయాలని మెట్రో రైల్ ఎండీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఫేజ్ 2 కొత్త ప్రతిపాదనలపై డీపీఆర్, ట్రాఫిక్ అనాలసిస్ త్వరగా పూర్తి చేయాల(CM Revanth Review on Metro Lines)ని స్పష్టం చేశారు. కొత్త మెట్రో రైల్ మార్గాల ద్వారా మత, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆదేశించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త మెట్రో రైల్ మార్గం.. ఎల్బీనగర్- హయత్నగర్, మియాపూర్- పటాన్ చెరు, రాయదుర్గం- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎంజీబీఎస్- ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలపై పనిచేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు రూ. 6,250 కోట్లతో 31 కి.మీ మేర మెట్రో రైల్ మార్గాన్ని చేపట్టాలనుకుంది.

ఈ నిర్మాణాన్ని ప్రస్తుతం నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. ఈ మార్గంలో ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. దీనికి బదులుగా ఎయిర్ పోర్ట్ మెట్రోను ఎల్బీ నగర్కు కనెక్ట్ చేయాలని సూచించారు. అంతేకాకుండా నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న 5 కి.మీ వరకు ఉన్న మెట్రో మార్గాన్ని చేపట్టాలన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు మరికొన్ని కొత్త మెట్రో మార్గాలకు ఆమోదం తెలిపింది. వీటిలో నాగోల్- ఎల్బీనగర్-ఓవైసీ ఆస్పత్రి- చంద్రయాన్గుట్ట-మైలార్దేవ్పల్లి-ఆరాంఘర్-హైకోర్టు నిర్మాణ ప్రతిపాదిత మార్గం రాజేంద్రనగర్(19 కి.మీ) మార్గంలో మెట్రో రైల్ మార్గానికి డీపీఆర్ సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

వీటితో పాటు 40 కి.మీ మేర మూసీ నది ఫ్రంట్ ఈస్ట్- వెస్ట్ కారిడార్ను మెట్రో రైల్ ప్రాజెక్టులో చేర్చాలని రేవంత్ అన్నారు. తారామతి-నార్సింగి వయా నాగోల్, ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసి త్వరలో కేంద్రానికి పంపించాలని ఆదేశించారు.


Click it and Unblock the Notifications








