ఇకపై తాగి వాహనాన్ని నడిపితే మీకు తడిసిపోతుంది.. ఎందుకంటే రూల్స్ మారాయి.. జేబులు ఖాళీ అవ్వడం ఖాయం
తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ మారాయి. ఇకపై వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటం, ఇతర ట్రాఫిక్ నియమాలను జనాలు సీరియస్గా తీసుకోకపోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతి వేగం ఈ ప్రమాదాలకు ముఖ్య కారణంగా ఉంది. దీంతో పాటు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మరికొందరికి ట్రాఫిక్ రూల్స్పై అవగాహన లేకపోవడం ప్రమాదాలకు దారి తీస్తుంది.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని చాలా చోట్ల మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ యాక్సిండెట్స్కి కారణమవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేసినా ప్రజల్లో మార్పు రావడం లేదు. దీంతో భారీ మొత్తంలో చలాన్లు విధించడం వల్లనైనా ఈ ప్రమాదాలను నివారించవచ్చని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, రోడ్డు భద్రతపై ప్రజలు మరింత అవగాహన కలిగి ఉండేలా కొత్తగా ట్రాఫిక్ నియమాలు కఠినతరం చేశారు. తాజాగా అమలు చేయబోతున్న ఈ ట్రాఫిక్ నిబంధనలు వాహనదారులు పాటించకపోతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం (BNS) ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులు, ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొలి కేసు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపినందుకు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 281, 80(ఏ), 177 మోటర్ వెహికిల్ చట్టం కింద ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త రూల్స్ని ఉల్లంఘిస్తే ఇకపై రాష్ట్రంలో కచ్చితంగా కేసులు నమోదు చేయనున్నారు. తెలంగాణలో వచ్చిన కొత్త ఫైన్స్ ఎలా ఉన్నాయంటే..

ఇప్పటి వరకు రెడ్ సిగ్నల్ ఎవరైనా క్రాస్ చేస్తే కేవలం రూ. 100 మాత్రమే చలానా విధించేవారు. ఇకపై రెడ్ సిగ్నల్ జంపిగ్కి రూ.500 జరిమానా విధించనున్నారు. ఎవరైనా నిర్లక్ష్యంతో డ్రైవింగ్ చేసినా లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించేలా చేసినా ప్రస్తుతం రూ.100 తక్షణ జరిమానా విధించేవారు. ఇప్పుడు ఈ సాధారణ ఉల్లంఘనల జరిమానాను రూ. 500 లకు పెంచారు.
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం: గతంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే కేవలం రూ. 500 మాత్రమే జరిమానా విధించేవారు. అయితే ఇప్పుడు ఆ అమౌంట్ని రూ. 2000లకు పెంచారు. ఇకపై ఎవరైనా వీటిని అతిక్రమిస్తే వెంటనే చర్యలు తీసుకోనున్నారు. అతివేగంగా వాహనం నడిపితే గతంలో జరిమానా రూ.400గా ఉంది. ఇప్పుడు ఆ జరిమానా రూ.1000గా చేశారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం: అన్నింటికంటే కీలకమైన ఈ జరిమానాలో గతంలో కేవలం రూ.2000గా ఉండేంది. అయితే వీటిని పదే పదే జనాలు ఉల్లంఘిస్తుండటంతో ఈ చలానాను ఏకంగా రూ.10,000లకు పెంచింది. ఇది ఒక విధంగా కఠినమైన ఫైన్ అని చెప్పవచ్చు. ఇకనైనా మద్యం సేవించి వాహనం నడపాలంటే జనాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారని ఈ అమౌంట్ని భారీగా పెంచారు.
ప్రమాదకరంగా వాహనాలు నడపడం: ఇక నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.5000 జరిమానా వేయనున్నారు. ఇక కీలకమైన హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఇప్పటి వరకు కేవలం రూ.100 మాత్రమే ఫైన్ ఉండేది. ఇకపై రూ.1000 జరిమానాతో పాటు 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. రేసింగ్, హై స్పీడ్తో వాహనాలు నడిపితే రూ.5000, సీటు బెల్ట్ పెట్టుకోకుంటే రూ.1000 జరిమానా వేయనున్నారు.
ట్రిపుల్ రైడింగ్: ఎవరైనా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పట్టుబడితే రూ.1200 జరిమానా వేయనున్నారు. అత్యవసర వాహనాలను అడ్డుకుంటే రూ. 10,000, ద్విచక్రవాహనాలపై హెవీ లోడ్తో వెళ్తే రూ.1200 తో పాటు 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఇక ఫైనల్గా కీలకమైన ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే రూ.2000 భారీ జరిమానా విధించనున్నారు.


Click it and Unblock the Notifications








