రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించడానికి ఇకపై ఇవి తప్పనిసరి.. దీంతో భారత రోడ్లపై సురక్షితమైన ప్రయాణం..
ఇండియాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. దేశంలో చోటుచేసుకుంటున్న మరణాల్లో ఎక్కువగా యాక్సిడెంట్ల ద్వారానే నమోదు అవుతున్నాయి. ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంపై ఆందోళన చేస్తూ వీటిని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికోసం ఆయన కఠిన నిబంధనలను రూపొందించమని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇక మీదట ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి భారీ వాహనాల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
గడ్కరీ పేర్కొన్న దాని ప్రకారం, ఇకపై భారీ వాహనాల్లో ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, డ్రైవర్ డ్రస్నెస్ అలర్ట్, ఇతర సేఫ్టీ సిస్టమ్స్ను అమర్చడం తప్పనిసరి కానుంది. భారీ వాహనాలు ఎక్కువగా హైవే మార్గాల్లో ప్రయాణిస్తాయి. వీటిలో సేఫ్టీ ప్రమాణాలను అందించడం ద్వారా హైవే మార్గాల్లో ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అందుకే మంత్రిత్వ శాఖ ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ను విడుదల చేయబోతుంది.

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) డేటా ప్రకారం, 2023లో ఇండియాలో దాదాపు 1,72,000 రోడ్డు మరణాలు సంభవించగా, వాటిలో 33,000 మరణాలకు భారీ ట్రక్కులే కారణం. అందుకే హైవే మార్గాలను మరింత సురక్షితం చేయడానికి వీటిలో ఈ సేఫ్టీ ప్రమాణాలను అందించడం తప్పనిసరి చేశారు. ఇటీవల రెండు రోజుల పాటు 42వ రవాణా అభివృద్ధి మండలి (టీడీసీ) సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారంత కూడా భారత్లో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రమాదాలను తగ్గించడానికి పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులతో పాటు, అధికారులు కూడా యాక్సిడెంట్లను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

ముఖ్యంగా ట్రక్కులలో సరైన భద్రతా చర్యలను అందించడంతో పాటు హెవీ కమర్షియల్ డ్రైవర్లకు సరైన శిక్షణ ఇవ్వడం, దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి డ్రైవర్లకు పూర్తిగా శిక్షణ అందించాలని, అలాగే, ఆటోమేటెడ్ టెస్టింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని, సురక్షితమైన డ్రైవింగ్ కోసం ప్రతి చోట అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు ఇలాంటి కార్యక్రమాల కోసం ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు.
మంత్రిత్వ శాఖ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి దేశవ్యాప్తంగా కేంద్రాల ఏర్పాటు కోసం రూ. 4,500 కోట్లతో ఒక పథకాన్ని కూడా రూపొందించింది. ప్రస్తుతం సరైన శిక్షణ కలిగిన డ్రైవర్ల కొరత ఉన్న నేపథ్యంలో రానున్న రెండేళ్ల కాలంలో 1,250 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. పలు రాష్ట్రాల్లో ఏర్పాటు కానున్న ఈ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరుస్తాయి.

డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








