విమానంలో ఏసీ బంద్.. చెమట తుడుచుకోవడానికి టిష్యూలు ఇచ్చిన సిబ్బంది.!!
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని కలలు కంటారు. గాలిలో తేలుతూ ఏసీ గాలిని ఆస్వాదిస్తూ స్వర్గంలో విహరిస్తున్న అనుభూతి పొందడం ఎవరికైనా ఆనందమే. మధ్య తరగతి వారికి ఇది సాధ్యం కాకపోయినా.. ఇక డబ్బులున్న వారికైతే ఇది బస్సు ప్రయాణం లాంటిదనే చెప్పవచ్చు. కానీ ఇటీవల ఓ విమాన ప్రయాణం అందులోని ప్రయాణికులకు చెమటలు పట్టించింది.
అదేంటి విమాన ప్రయాణంలో చెమటలు పట్టడమేంటని అనుకుంటున్నారా.. అవునండీ సుమారు 90 నిముషాల పాటు ప్రయాణికులు ఫ్లైట్లో చుక్కలు చూశారు. సిటీ బస్సులో వెళ్లినా ఇంత కష్టంగా ఉండేది కాదేమో అని అనుకోని ప్రయాణికుడు ఉండరేమో.. ఈ చెమట పట్టించిన విమాన ప్రయాణ అనుభవాన్ని ఓ కాంగ్రెస్ నేత సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానంలో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ కండిషన్ ఆన్ కాకముందే విమానం టేకాఫ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
చండీగఢ్ నుంచి జైపూర్కు (Chandigarh to Jaipur) వెళ్లేందుకు ఇండిగో విమానం(6E7261) సిద్ధంగా ఉంది. ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. కాసేపటికి విమానం టేకాఫ్ అయింది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. సరిగ్గా అప్పుడే అసలు సమస్య వచ్చి పడింది.

ఆకాశంలోకి వెళ్లిన కొద్ది సేపటికే విమానం లోపల ఏసీ పని చేయలేదు. దీంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. మొదట ఈ విషయం ఎవరికీ అర్థం కాకపోయినా ఆ తర్వాత చెమటలు పట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చెమటలు పట్టడంతో అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ఉక్కపోతను తట్టుకోలేక పుస్తకాలు, పేపర్లతో విసురుకోవడం మొదలుపెట్టారు.
అంతలో ఎయిర్హోస్టెస్ అక్కడికి వచ్చి ''అంతరాయానికి చింతిస్తున్నాం.. సాంకేతిక లోపం వల్ల ఏసీ పని చేయలేదు. అంతవరకూ మీరు ఈ టిష్యూ పేపర్లతో సరిపెట్టుకోండి.'' అంటూ ప్రయాణికులందరికీ టిష్యూలను పంచిపెట్టింది. అప్పటికే ఉక్కపోతతో చికాకుతో ఉన్న ప్రయాణికుల ముఖాలు.. టిష్యూ పేపర్లను చూడగానే కోపంతో మండిపోయారు. సుమారు 90 నిముషాల పాటు విమానంలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అమరీందర్ సింగ్ రాజా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఆ సమయంలో తాను కూడా విమానంలో ఉన్నానని, టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకూ ఎక్కడా ఏసీ పని చేయలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మొదట 15 నిమిషాలు ఎండలో క్యూలో నిలుచోబెట్టారని ఆయన అన్నారు.
ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏసీ పనిచేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దీంతో చెమట తూడ్చుకోవడానికి ఎయిర్ హోస్టెస్ టిష్యూస్ ఇచ్చారని ట్విట్టర్లో పేర్కొన్నారు. సదరు విమానయాన సంస్థపై చర్యలు తీసుకోవాలని డీజీసీఏ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేస్తూ అమరీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఇండిగో యాజమాన్యం స్పందించింది.
సమస్య తమ దృష్టికి వచ్చిందని, ఇందుకు తాము చింతిస్తున్నామని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని యాజమాన్యం పేర్కొంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని పేర్కొంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇండిగో విమానంలో ఒక్కరోజులో సాంకేతిక లోపం తలెత్తడం ఇది మూడోసారి. ఢిల్లీ నుంచి పాట్నాకు బయలుదేరిన విమానంలో టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో వెనక్కి మళ్లింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి రాంచీ బయలుదేరిన మరో విమానం టేకాఫ్ అయిన కాసేపటికే సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. దీంతో గంటలోపే వెనక్కి మళ్లించారు.


Click it and Unblock the Notifications








