ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పాత వాహనాలకు ఇక గుడ్బై.. వీటితో పెట్రోల్ బంక్కి వెళ్ళినా నిరాశే
దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అక్కడ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. వాహనాల నుంచి అధికంగా విడుదల అవుతున్న ఉద్గారాలను, కాలుష్యాన్ని తగ్గించడం కోసం 15 ఏళ్లు దాటిన పాత వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయవద్దని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అధికారులతో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆదేశాలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో గాలి నాణ్యత గత కొన్నేళ్లుగా చాలా వరకు తగ్గుతుంది. ప్రధానంగా వాహనాల సంఖ్య రాజధానిలో భారీగా పెరిగింది. దీంతో వాటి నుంచి తీవ్రస్థాయిలో కాలుష్య ఉద్గారాలు విడుదల అవుతున్నాయి.
కొత్తగా వస్తున్న వాహనాలు కొత్త నిబంధనల ప్రకారం, తక్కువ స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నప్పటికీ ఏళ్ల తరబడిన వాటి నుంచి మాత్రం ఎక్కువ స్థాయిలో వాయు కాలుష్యం జరిగి గాలి నాణ్యత పడిపోతుంది. దీంతో ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీల్చడం చాలా వరకు తగ్గిపోయింది. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కొన్ని సార్లు సరి-బేసి విధానాన్ని కూడా అవలంబించింది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించట్లేదు.

ఇప్పుడు కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో కాలుష్య స్థాయిలను శాశ్వతంగా అరికట్టడానికి కంకణం కట్టుకుంది. అందుకే 15 సంవత్సరాల కంటే పాత వాహనాలకు మార్చి 31 తర్వాత నుంచి ఇంధనం అందించకూడదని నిర్ణయించింది. పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వాయు కాలుష్యాన్ని అరికట్టే చర్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశం అయ్యారు. దీనిలో పలు కీలక అంశాలపై పూర్తిగా చర్చలు జరిపారు.
అధికారులతో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తోందని అన్నారు. పాత వాహనాలపై ఆంక్షలు అలాగే, పొగమంచు నిరోధక చర్యలు, ప్రజా రవాణాకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయడం కుదరదని మంజిందర్ సింగ్ సిర్సా స్పష్టం చేశారు.

పెట్రోల్ బంకుల వద్ద 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తించడానికి ప్రత్యేకంగా కొన్ని పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి వాహనాల కాల పరిమితిని గుర్తిస్తాయి. ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తెలియజేస్తామని మంత్రి అన్నారు. అలాగే, ఢిల్లీలో కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఎత్తైన భవనాలు, హోటళ్ళు, వాణిజ్య సముదాయాలు, ఢిల్లీ విమానాశ్రయంలో యాంటీ-స్మోక్ గన్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయనున్నారు.
దీంతో పాటు డిసెంబర్ 2025 నాటికి 90 శాతం ప్రభుత్వ CNG బస్సులను విడతల వారీగా నిలిపివేసి వీటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి చర్చలు తీసుకుంటామని పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా సమావేశం అనంతరం తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 15 సంవత్సరాల కంటే పాత వాహనాలను వాడుతున్న వారు, ఇకపై ప్రత్యామ్నాయాన్ని చూసుకోవాల్సిందే.

డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








